Saturday, November 9, 2019

కార్తీక పురాణం- 12వ రోజు పారాయ‌ణం   (శుక్ల ద్వాద‌శి రోజున‌)

చ‌తుర్వింశాధ్యాయం
అగ‌స్త్యా, కార్తీక శుక్ల ద్వాద‌శిని హ‌రిబోధిని అంటారు. ఆ ఒక్క ప‌ర్వ‌తిథీ వ్ర‌తాచ‌ర‌ణం చేస్తే అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసిన ఫ‌లం, అన్ని విధాలైన య‌జ్ఞాల‌ను ఆచ‌రించిన ఫ‌లం ప్రాప్తిస్తాయి. విష్ణువు ప‌ట్ల‌, ఏకాద‌శి ప‌ట్ల భ‌క్తి, ఆస‌క్తి పెరుగుతాయి. సూర్య‌చంద్ర‌గ్ర‌హ‌ణ ప‌ర్వాల కంటె గొప్ప‌ది, ఏకాద‌శి కంటె వంద‌రెట్లు మ‌హిమాన్నివ‌త‌మైన‌ది ఈ ద్వాద‌శి. ఈ రోజున‌ ఏ పుణ్యం చేసినా, ఏ పాపం చేసినా అది కోటిరెట్లుగా మారుతుంది. ఈ ద్వాద‌శినాడు ఒక‌రికి అన్న‌దానం చేస్తే కోటి మందికి అన్న‌దానం చేసిన పుణ్యం, ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగిలించిన పాపం క‌లుగుతాయి. ఒక‌వేళ ద్వాద‌శి ఘ‌డియ‌లు త‌క్కువ‌గా ఉన్న ప‌క్షంలో ఆ స్వ‌ల్ప స‌మ‌య‌మైనా స‌రే పార‌ణ‌కు ఉప‌యోగించాలే గాని, ద్వాద‌శి దాటిన త‌ర్వాత పార‌ణం ప‌నికిరాదు. పుణ్యాన్ని కోరేవారెవ‌రైనా స‌రే ఏ నియ‌మాన్ని అతిక్ర‌మించినా ఈ ద్వాద‌శి పార‌ణ‌ను మాత్రం విస‌ర్జించ‌కూడ‌దు. ఏకాద‌శి తిథి నాడు ఉప‌వాసం ఉండి ద్వాద‌శి తిథి దాటిపోకుండా పార‌ణ చేయాలి. త‌ద్వారా క‌లిగే శ్రేయ‌స్సును స్వ‌యంగా శేష‌సాయి చెప్పాలే త‌ప్ప శేషుడు కూడా చేప్ప‌లేడు. అందుకు అంబ‌రీషుని క‌థే ఉదాహ‌ర‌ణ‌. 

అంబ‌రీషోపాఖ్యానం
ద్వాద‌శి వ్ర‌తాచ‌ర‌ణ త‌త్ప‌రుడూ, ప‌ర‌మ‌భాగ‌వ‌తోత్త‌ముడూ అయిన అంబ‌రీషుడ‌నే మ‌హారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాద‌శి నాడు ఉప‌వ‌శించి మ‌ర్నాడు ద్వాద‌శి ఘ‌డియ‌లు స్వ‌ల్పంగా ఉన్న కార‌ణంగా తిథి దాట‌కుండానే పార‌ణ చేయాల‌నుకున్నాడు. అదే స‌మ‌యానికి దూర్వాస మ‌హ‌ర్షి విచ్చేసి ఆ నాటి ఆతిథ్యంలో త‌న‌కు కూడా భోజ‌నం పెట్టాల‌ని కోరాడు. అంబ‌రీషుడు ఆయ‌న‌ను ద్వాద‌శి పార‌ణ‌కు ఆహ్వానించాడు. త‌క్ష‌ణ‌మే దూర్వాసుడు స్నానాచ‌ర‌ణ‌, అనుష్ఠానం కోసం న‌దికి వెళ్లాడు. అలా వెళ్లిన ఋషి ఎంత‌సేప‌టికీ రాక‌పోవ‌డంతో అంబ‌రీషుడు ఆతృత ప‌డ్డాడు. ఆ రోజు ద్వాద‌శి ఘ‌డియ‌లు స్వ‌ల్పంగా ఉన్నాయి. కాలాతిక్ర‌మ‌ణం కాకుండా పార‌ణ చేసి తీరాల్సి ఉంది. అతిథి వ‌చ్చే వ‌ర‌కు ఆగ‌డం గృహ‌స్థ ధ‌ర్మం. దానిని వ‌ద‌ల‌లేడు. ద్వాద‌శి దాట‌కుండా పార‌ణ చేయ‌డం ఈ వ్ర‌త ధ‌ర్మం. దాన్ని వ‌దులుకోలేడు.
శ్లో - హ‌రిభ‌క్తి ప‌రిత్యాగో ద్వాద‌శీ త్యాగ‌తో భ‌వేత్‌
య‌తో2నుపోషితే భూయాత్ కృత్వాశ‌మ్యగ్ పోష‌ణం
పూర్వం ద్వాద‌శ సంఖ్యాకే పురుషౌ హ‌రివాస‌రే
పాప‌ముల్లంఘ‌నే పాపాత్ నైవ యుజ్యం మ‌నీషిణా
ద్వాద‌శీ వ్ర‌తాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణుభ‌క్తిని విస‌ర్జించిన వాడ‌వుతాడు. ఏకాద‌శినాడు ఉప‌వాసం చేయ‌క‌పోతే ఎంత పాపం క‌లుగుతుందో ద్వాద‌శినాడు పార‌ణ చేయ‌క‌పోవ‌డం వ‌ల‌న అంత‌కు రెట్టింపు పాపం క‌లుగుతుంది. అంతే కాదు, ఒక్క ద్వాద‌శీ పార‌ణాతిక్ర‌మ‌ణ వ‌ల‌న ఆ నాటి వ్ర‌త‌ఫ‌లంతో పాటుగానే అంత‌కు పూర్వం చేసిన ప‌న్నెండు ద్వాద‌శీ పార‌ణ‌ల మ‌హాపుణ్యం కూడా హ‌రించుకుపోతుంది. జ‌న్మ‌జ‌న్మాంత‌ర పుణ్య‌బ‌లం క్షీణిస్తుంది. అన్నింటి క‌న్నా ముఖ్యంగా ద్వాద‌శ్య‌తిక్ర‌మ‌ణం వ‌ల‌న విష్ణువిరోధ భీతి ఏర్ప‌డుతుంది. అందువ‌ల‌నే ప్రాణావ‌సాన‌మైనా స‌రే ద్వాద‌శి పార‌ణ చేయ‌డ‌మే క‌ర్త‌వ్యం. త‌ద్వారా సంక్ర‌మించే బ్రాహ్మ‌ణ శాపం వ‌ల‌న క‌ల్పాంత దుఃఖ‌మే క‌లుగుతుంది. దూర్వాసుని వంటి అతిథి ఉన్న‌ప్ప‌టికీ ద్వాద‌శీ తిరోగ‌మ‌నానికి ముందే పార‌ణ చేసి హ‌రిభ‌క్తిని నిలుపుకున్న‌ట్ట‌యితే అతిథి ఉల్లంఘ‌న వ‌ల‌న ఏర్ప‌డే క‌ష్టాల‌ను కూడా ఆ క‌మ‌ల‌నాభుడే క‌డ‌తేరుస్తాడు. ఇలా త‌న మ‌న‌సులో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చి కూడా ధ‌ర్మ‌వ‌ర్త‌నుడైన ఆ అంబ‌రీషుడు ద్వాద‌శి 
పార‌ణార్ధం త‌న‌ను ప‌రివేష్ఠించి ఉన్న వేద‌విదుల‌కు త‌న ధ‌ర్మసందేహాన్ని తెలియ‌చేశాడు.

అంబ‌రీషుని మ‌నోవ్య‌థ‌  
అంబ‌రీషుని స‌మ‌స్య విన్న వేద‌స్వ‌రూపులైన ఆ విప్రులుక్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే శృతిస్మృతి శాస్ర్త‌ పురాణాల‌న్నింటినీ మ‌ననం చేసుకుని మ‌హారాజా ఆ స‌ర్వేశ్వ‌రుడైన భ‌గ‌వంతుడు స‌ర్వ జీవుల యందునా జ‌ఠ‌రాగ్ని రూపంలో ప్ర‌క్షిప్త‌మై ఉంటున్నాడు. ఆ జ‌ఠ‌రాగ్ని ప్రాణ‌వాయువు చేత ప్ర‌జ్వ‌ల‌నం కావ‌డం వ‌ల‌ననే జీవుల‌కు ఆక‌లి క‌లుగుతోంది. దాని తాప‌మే క్షుత్పిపాసా బాధ‌గా వ్య‌వ‌హారంలో ఉంది. కాబ‌ట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప‌చేయ‌డ‌మే జీవ‌ల‌క్ష‌ణం. జీవులు స్వీక‌రించే భ‌క్ష్య‌, భోజ్య‌, చోష్య‌, లేహ్య రూప అన్నాదుల‌ను వారిలోని అగ్ని మాత్ర‌మే భుజిస్తున్నాడు. జీవులంద‌రిలోనూ ఉన్న జ‌ఠ‌రాగ్ని జ‌గ‌న్నాథ స్వ‌రూపం క‌నుక‌నే 
శ్లో - అథ‌శ్వ‌పాకం శూద్రం వాస్వ‌న్య స‌ద్మాగ‌తం శుభం
అతిక్ర‌మ్య న భుంజీత గృహ‌మేద్య‌తిథి నిజం
ఇంటికి వ‌చ్చిన వాడు శూద్రుడైనా స‌రే, ఛండాలుడైనా స‌రే ఆ అతిథిని వ‌దిలి ఆ గృహ‌స్థు భోజ‌నం చేయ‌కూడ‌దు. అలాంటిది స్వ‌యంగా బ్రాహ్మ‌ణుడే అతిథిగా వ‌స్తే అత‌నిని విస్మ‌రించ‌డం అథ‌మాథ‌మం అని వేరే చెప్ప‌న‌క్క‌ర‌లేదు క‌దా. పైగా తానే స్వ‌యంగా ఆహ్వానించిన బ్రాహ్మ‌ణుని కంటె ముందుగా తానే భోజ‌నం చేయ‌డం బ్రాహ్మ‌ణావ‌మాన‌మే అవుతుంది. భూవ‌రా, భూసురావ‌మాన‌వ వ‌ల‌న ఆయుష్షు, ఐశ్య‌ర్యం, కీర్తి, ధ‌ర్మం న‌శించిపోతాయి. మ‌న‌స్సంకాల్పాలు తిరోహితాలైపోతాయి. బ్రాహ్మ‌ణుడు స‌ర్వ‌దేవ‌తా స్వ‌రూపుడుగా చెప్ప‌బ‌డి ఉండ‌డం వ‌ల‌న బ్రాహ్మ‌ణావ‌మానం స‌ర్వ‌దేవ‌త‌ల‌నూ అవ‌మానించ‌డంతో స‌మాన‌మ‌వుతుంది. జాతి మాత్రం చేత‌నే బ్రాహ్మ‌ణుడు దేవ‌తాతుల్యుడై ఉండ‌గా కేవ‌లం జ‌న్మ వ‌ల‌నే కాకుండా జ్ఞానం, త‌పోమ‌హిమ వ‌ల‌న శుద్ధ రుద్ర రూపుడుగా కీర్తినందుకునే దూర్వాసుని వంటి ఋషిని భోజ‌నానికి పిలిచి ఆయ‌న క‌న్నా ముందే పార‌ణ చేయ‌డం ధ‌ర్మ‌మ‌ని చెప్ప‌లేము. కోపిష్ఠి అయిన ఆ ఋషి శ‌పిస్తాడ‌నే భ‌యాన్ని ప‌క్క‌కు నెట్టి చూసినా గాని
శ్లో - వ‌యం న నిశ్చ‌యం క్వాపి గ‌చ్ఛామో న‌ర‌పుంగ‌వ‌
త‌థాపి ప్ర‌థ‌మం విప్రాద్భోజ‌నం న ప్ర‌కీర్తితం
బ్రాహ్మ‌ణాతిథి క‌న్నా ముందు భుజించ‌డం కీర్తిక‌ర‌మైన‌ది మాత్రం కాదు.
ధ‌ర‌ణీపాలా, ద్వాద‌శీ పార‌ణా ప‌రిత్యాగం వ‌ల‌న, త‌త్పూర్వ దిన‌మైన ఏకాద‌శ్యుప‌వాసానికి భంగం క‌లుగుతుంది. ఆ ఏకాద‌శి వ్ర‌త‌భంగానికి ప్రాయ‌శ్చిత్త‌మ‌నేదే లేదు. ఇలా బ్రాహ్మ‌ణాతిథిని అతిక్ర‌మించ‌డం వ‌ల‌న విప్ర ప‌రాభ‌వానికి కూడా విరుగుడు లేదు. రెండూ స‌మ‌తూకంలోనే ఉన్నాయి.
చ‌తుర్వింశోపాధ్యాయ స‌మాప్తః
--------------
పంచ‌వింశాధ్యాయం
విప్రుల ధ‌ర్మ‌బోధ 
అంబ‌రీషా, పూర్వ‌క‌ర్మానుసారం నీకిప్పుడు రెండు ప‌క్క‌ల నుంచి కంఠాన్ని చుట్టుకుని ఉన్న తాడులా ఈ ధ‌ర్మ‌సంక‌టం ప్రాప్తించింది. దూర్వాసుడు వ‌చ్చే వ‌ర‌కు ఆగాలో లేదా ద్వాద‌శీ ఘ‌డియ‌లు దాట‌కుండా పార‌ణ చేయాలో ఏదీ నిశ్చ‌యంగా చెప్ప‌డానికి మేము అశ‌క్తుల‌పైపోతున్నాము.
శ్లో- స్వ‌బుధ్యాతు స‌మాలోక్య కురుత్వం త‌వ నిశ్చ‌యం
కాబ‌ట్టి ఆత్మ‌బుద్ధి సుఖం చైవ అనే సూత్రం అనుస‌రించి భారం ఆ భ‌గ‌వంతుడి మీద పెట్టి తోచిన దానిని నువ్వాచ‌రించు అన్నారు. బ్రాహ్మ‌ణుల మాట‌లు విన‌గానే అంబ‌రీషుడు ఓ బ్రాహ్మ‌ణులారా, బ్రాహ్మ‌ణ శాపం క‌న్నా విష్ణుభ‌క్తిని విడిచి పెట్ట‌డ‌మే ఎక్కువ క‌ష్టంగా భావిస్తున్నాను.
శ్లో - క‌ర్తుం సాధ్యం య‌థాకాలం ద్వాద‌శ్య‌ద్భిస్తు పార‌యేత్
కృతావ‌కాశ వ‌త్ప‌శ్చాత్ భుం జీత్యేత్య‌ప‌రే జ‌గుః
శృతులు ప్ర‌క‌టించిన ప్ర‌మాణం చేత ప్ర‌స్తుతం నేను కాసిని మంచినీళ్లు తాగుతాను. అందువ‌ల్ల అతిథి న్నా ముందు అన్నం తిన్న దోషం రాదు. ద్వాద‌శి ఘ‌డియ‌లు దాట‌కుండా ఆహారం తీసుకున్న పార‌ణ ఫ‌లిత‌మూ ఉంటుంది. ఇందువ‌ల‌న దూర్వాసుడు శ‌పించే అవ‌కాశ‌మూ ఉండ‌దు. నా జ‌న్మాంత‌ర పాప‌మూ న‌శిస్తుంది. ఇదే నా నిర్ణ‌యం అన్నాడు.
అనంత‌రం వారి ఎదుట‌నే స్వ‌ల్పంగా జ‌లం స్వీక‌రించాడు. నోటి ద‌గ్గ‌ర నీటి పాత్ర‌నింకా నేల‌మీద పెట్ట‌నైనా లేదు, అదే స‌మ‌యంలో అక్క‌డ దూర్వాసుడు అడుగు పెట్టాడు. చేతిలో జ‌ల‌పాత్ర‌తో ఉన్న రాజును చూడ‌గానే జ‌రిగిందేమిటో గ్ర‌హించాడు. చూపుల‌తోనే కాల్చేస్తాడా అన్న‌ట్టు చుర‌చురా చూశాడు. మాట‌లతోనే మార‌ణ‌హోమం చేస్తాడా అన్న‌ట్టు రేరే దుర‌హంకారపూరిత రాజాథ‌మా, అతిథినైన నేను లేకుండానే ద్వాద‌శి పార‌ణ చేస్తావా?
శ్లో - అస్నాత్వాతుమ‌లం భుంక్తే - అద‌త్వాఘంతు కేవ‌లం
యో నిమంత్రితాతిథిః పూర్వం మోహాద్భుంక్తేత‌తోథ‌మః
మ‌లాశీస‌తు విజ్ఞేయః క్రిమినిష్ఠాగ‌తోయ‌థా
భుంజ‌తేత్వ‌ఘం పాపాయే ప‌చంత్యాత్మ‌కార‌ణాత్ 
అతిథ్య‌ర్ధంచ ప‌క్వం యే భుంజ‌తేతే త్వ‌ఘాథ‌మ‌మ్‌
స్నానం చేయ‌కుండా భోజ‌నం చేసే వాడు మ‌ల‌భోజి అవుతాడు. ప‌రునికి పెట్ట‌కుండా తానొక్క‌డే తినే వాడు పాప‌భోజి అవుతాడు. తాను ఆహ్వానించిన అతిథికి ముందుగా త‌నే భోజ‌నం చేసే వాడు అశుద్ధంలో పురుగులా మ‌లాశి అవుతాడు. ప‌క్వ‌మైనది గాని, ఫ‌లం గాని, నీళ్లు గాని భోజ‌నార్ధంగా భావించి సేవించిన‌ది ఏదైనా స‌రే అన్నంతో స‌మాన‌మే అవుతుంది. అందువ‌ల‌న నీ అంగీకృతుడ‌నైన అతిథిని నేను రాకుండానే నా కన్నా ముందు అన్న‌ప్ర‌తినిధిగా జ‌ల‌పార‌ణం చేశావు. బ్రాహ్మ‌ణ తిర‌స్కారివైన నీవు బ్రాహ్మ‌ణ ప్రియుడైన విష్ణువుకి భ‌క్తుడు ఎలా అవుతావు. "య‌థాపురోథ‌స‌న్స్వ‌శ్య మ‌ద‌మోహాన్మ‌హీప‌తే" నీ పురోహితుడు చెప్పిన‌ట్టు కాకుండా మ‌రో విధంగా ఆచ‌రించే మ‌ద‌మోహితుడులా ప్ర‌వ‌ర్తించావు నీవు అన్నాడు దూర్వాసుడు.

ఆ ఆగ్ర‌హానికి భ‌య‌కంపితుడైన అంబ‌రీషుడు దోసిలి ప‌ట్టిన వాడై మునీంద్రా నేను పాపినే. ప‌ర‌మ నీచుడినే. అయినా నిన్ను శ‌ర‌ణు కోరుతున్నాను. నేను క్ష‌త్రియుడ‌ను గ‌నుక ఏ అభిజాత్యాహంకారం వ‌ల్ల‌నో త‌ప్పు చేశాను. కాని నువ్వు బ్రాహ్మ‌ణుడైన కార‌ణంగా శాంతం వ‌హించు. న‌న్ను ర‌క్షించు. అని పాదాల మీద ప‌డి ప్రార్థించాడు. అయినా స‌రే దూర్వాసుని కోపం త‌గ్గ‌లేదు. మ‌ణిమ‌కుటాన్ని ద‌రించే ఆ అయోధ్యాప‌తి శిర‌స్సును ఎడ‌మ కాలితో త‌న్నేశాడు. ర‌వ్వంత ఎడంగా వెళ్లి ఎవ‌రికైనా కోసం వ‌చ్చిన‌ప్పుడు ప్రార్థిస్తే వాళ్లు శాంతువ‌లుతారు. కాని నేన‌లాంటి వాడిని కాను. నాకు కోపం వ‌స్తే శాపం పెట్ట‌కుండా ఉండ‌ను. చేప‌గానూ, తాబేలుగానూ, పందిగానూ, మ‌రుగుజ్జువానిగానూ, వికృత‌మైన ముఖం క‌ల‌వానిగానూ, క్రూరుడైన బ్రాహ్మ‌ణునిగాను, జ్ఞాన‌శూన్యుడైన క్ష‌త్రియునిగానూ, అధికారం లేని క్ష‌త్రియునిగానూ,  దురాచార భూయిష్ట‌మైన పాషండ‌మార్గ‌వేదిగానూ, నిర్ద‌యాపూర్వ‌క బ్రాహ్మ‌ణ హింస‌కుడైన బ్రాహ్మ‌ణునిగానూ ప‌ది జ‌న్మ‌ల‌ను (గ‌ర్భ న‌ర‌కాలు) అనుభ‌వించు అని శ‌పించాడు. అప్ప‌టికే బ్రాహ్మ‌ణ శాప‌భ‌యంతో అవాక్క‌యి ఉన్న అంబ‌రీషుడు అంత్య‌ద‌శ‌లో అయినా శ్రీ మ‌హావిష్ణువు క‌ల్పాంత‌ర కాల లోక క‌ల్యాణార్ధం బ్రాహ్మ‌ణ వాక్యాన్ని తిర‌స్క‌రించ‌కూడ‌ద‌నే త‌న వ్ర‌తం వ‌ల‌న ఆ ప‌ది జ‌న్మ‌ల శాపాన్ని తానే భ‌రించ‌ద‌ల‌చి గృహ్ణామి అని ఊరుకున్నాడు. ఇన్ని శాపాలిస్తే గృహ్ణామి అంటాడేమిటీ రాజు, వీనికింకా పెద్ద శాపం ఇవ్వాలి అని మ‌రోసారి దూర్వాసుడు నోరు తెర‌వ‌బోయాడు. కాని స‌ర్వ‌జ్ఞుడైన శ్రీ‌హ‌రి దూర్వాసుడి నోట ఇంకో శాం వెలువ‌డ‌కుండానే భ‌క్తుడైన అంబ‌రీషుని ర‌క్ష‌ణార్ధం జ‌గ‌దేక శ‌ర‌ణ్యం, జ‌గ‌దేక భీక‌రం అయిన త‌న ఆయుధ‌మైన సుద‌ర్శ‌న చ‌క్రాన్ని వ‌ద‌ల‌డంతో అక్క‌డి పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని అది ఆవ‌హించి దూర్వాసుని వైపు క‌దిలి రాసాగింది. అది చూడ‌గానే దూర్వాసుడు తుళ్లి ప‌డ్డాడు. ఆ చ‌క్రానికి చిక్క‌కూడ‌ద‌ని భూచ‌క్ర‌మంతా క్ష‌ణాల్లో ప‌రిభ్ర‌మించాడు. అయినా సుద‌ర్శ‌నం అత‌నిని త‌రుముతూనే ఉంది. భీతావ‌హుడైన ఆ దూర్వాసుడు వ‌శిష్ఠాది బ్ర‌హ్మ‌ర్షుల‌ను, ఇంద్రాది అష్ట దిక్పాల‌కుల‌ను, చిట్ట‌చివ‌రికి శివ బ్ర‌హ్మ‌ల‌నీ శ‌ర‌ణు కోరాడు. కాని అత‌ని వెన‌కాలే విహ్వ‌ల మ‌హాగ్ని జ్వాల‌లు వెద‌జ‌ల్లుతూ వ‌స్తున్న విష్ణుచ‌క్రాన్ని చూసి ఎవ‌రికి వారే త‌ప్పుకున్నారు త‌ప్ప తెగించి ఎవ‌రూ ఎలాంటి అభ‌యం ఇవ్వ‌లేదు. 
పంచ‌వింశోధ్యాయ స‌మాప్తః
-------------- 
షడ్వింశాధ్యాయం
ఈ విధంగా ప్రాణ‌భీతుడైన దూర్వాసుడు సంభ‌విత లోకాల‌న్నీ సంచ‌రించి చివ‌రికి చ‌క్ర‌పాణి శ్రీ మ‌హావిష్ణు లోకాన్ని చేరాడు. హే బ్రాహ్మ‌ణ ప్రియా, మాధ‌వా, మ‌ధుసూద‌నా. కోటి సూర్యుల‌తో స‌మాన‌మైన కాంతిని వేడి క‌లిగిన నీ సుద‌ర్శ‌న చ‌క్రం న‌న్ను చంప‌డానికి అమిత‌ వేగంగా దూసుకు వ‌స్తోంది. నీవే న‌న్నీ ఆప‌ద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ స‌ర్వేశ్వ‌రుడైన ఆ శ్రీ‌హ‌రినే శ‌ర‌ణు కోరాడు. 

విష్ణుమూర్తి విలాసంగా న‌వ్వుతూ దూర్వాసా ప్ర‌పంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మ‌ణులే దైవాలు. కాని నువ్వు స‌ద్ర్బాహ్మ‌ణుడ‌వూ, రుద్రాంశ సంభూతుడివై ఉండి కూడా అంబ‌రీషుని అకార‌ణంగా శ‌పించావు. పార‌ణ‌కు వ‌స్తాన‌ని చెప్పి స్నానార్ధ‌మై వెళ్లిన నీవు స‌కాలానికి  చేరుకోలేదు. ఆల‌స్యంగా రాద‌ల‌చుకున్న వాడివి నీ కోసం ఎదురుచూడ‌కుండా ద్వాద‌శీ ఘ‌డియ‌లు గ‌తించిపోకుండానే పార‌ణ చేయ‌డానికి అనుమ‌తినైనా ఇవ్వ‌లేదు. ద్వాద‌శి దాటిపోవ‌డానికి కొన్ని క్ష‌ణాలు మాత్ర‌మే వ్య‌వ‌ధి ఉన్న స‌మ‌యంలో వ్ర‌త భంగానికి భ‌య‌ప‌డి మంచినీళ్ల‌ను తీసుకున్నాడే గాని ఆక‌లితో లేదా నిన్న‌వ‌మానించాల‌నో కాదు. అనాహారేతి య‌చ్ఛ‌స్తం శుధ్య‌ర్థం వ‌ర్ణినా స‌దా అని శాస్త్రం చెబుతోంది. నిషిద్ధాహారుల‌కు కూడా జ‌ల‌పానం దోషం కాద‌ని శాస్ర్తాలు చెబుతుండ‌గా అదేమంత త‌ప్ప‌ని నువ్వు శ‌పించాల్సివ‌చ్చింది? ఆత్రేయా  నువ్వెంత క‌టువుగా మాట్లాడినా కూడా అత‌గాడు నిన్ను విన‌య‌పూర్వ‌కంగా శాంతించ‌మ‌ని వేడుకున్నాడే గాని, కోపించ‌లేదు క‌దా? అయినా స‌రే ముముక్షుడైన అత‌డిని నువ్వు ప‌ది దుర్భ‌ర జ‌న్మ‌లు పొందాల‌ని శ‌పించావు. నా భ‌క్తుల‌ను ర‌క్షించుకోవ‌డం కోసం నీ శాపాన్ని క్ష‌ణాల్లో తిప్పి వేయ‌గ‌ల‌ను కాని బ్రాహ్మ‌ణ వాక్యం వ‌ట్టిపోయింద‌నే లోకాప‌వాదం నీకు క‌ల‌గ‌కుండా ఉండ‌డం కోసం ఆ భ‌క్తుని హృద‌యంలో చేరి నీ శాపాన్ని స‌విన‌యంగా స్వీక‌రించాను. నీ శాపాన్ని అంగీక‌రిస్తూ గృహ్ణామి అన్న వాడిని నేనే గాని అంబ‌రీషుడు కానే కాదు. అత‌నికి నీవిచ్చిన శాపం సంగ‌తే తెలియ‌దు. ఋషి ప్ర‌భూ నీ శాపం ప్ర‌కారంగానే కాల్పాంతాన దుష్టుడైన శంఖాసురుని సంహ‌రించ‌డానికి, శిష్యుడైన మ‌నువును ఉద్ధ‌రించ‌డానికీ మ‌హామ‌త్స్యంగా అవ‌త‌రిస్తాను. దేవ‌దాన‌వులు సాగ‌రాన్ని మ‌ధించే వేళ మంధ‌ర‌గిరిని మూపున ధ‌రించ‌డానికి కుదురుగా ఉండేందుకుగాను వ‌రాహాన్న‌వుతాను. హిర‌ణ్య‌క‌శిపుని సంహ‌రించ‌డం కోసం వికృతాన‌నం గ‌ల న‌ర‌సింహ రూపాన్ని ధ‌రిస్తాను. స‌ర్వ‌దేవ‌తా సంర‌క్ష‌ణ కోసం ధ‌ర్మ‌బ‌లుడైనా కూడా దాన‌వుడు క‌నుక బ‌లిని శిక్షించేందుకు వామ‌నుడ‌న‌వుతాను. త్రేతా యుగంలో జ‌మ‌ద‌గ్నికి కుమారుడుగా పుట్టి సాయుధ బ్రాహ్మ‌ణుడ‌నై దుర్మ‌దులైన రాజుల పీచ‌మ‌ణ‌చివేస్తాను. రావ‌ణ సంహారార్ధం ఆత్మ‌జ్ఞాన శూన్యుడైన అంటే నేనే భ‌గ‌వంతుడ‌నే దానిని మ‌రిచిపోయి మామామానుష విగ్ర‌హుడ‌నైన ద‌శ‌ర‌థ రామునిగా అవ‌త‌రిస్తాను. ద్వాప‌రంలో జ్ఞానినీ, బ‌ల‌వంతుడ‌నూ అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకు (బ‌ల‌రాముడు) త‌మ్మునిగా కృష్ణావ‌తారం ధ‌రిస్తాను. క‌ల‌యుగారంభాన పాప‌మోహం కోసం పాషండ మ‌త ప్ర‌చార‌కుడ‌నై బుద్ధుడుగా ఆవిర్భ‌విస్తాను.ఆ యుగాంతాను శ‌తృఘాత‌కుడైన బ్రాహ్మ‌ణుడుగా ప్ర‌భ‌విస్తాను. దూర్వాసా నా ఈ ద‌శావ‌తారాల‌ను, ఆయా అవ‌తారాల‌లోని లీల‌ల‌ను ఎవ‌రు వినినా, చ‌దివినా, తెలుసుకున్నా వారి పాపాలు ప‌టాపంచ‌ల‌వుతాయి అని చెప్పాడు.
శ్లో - ధ‌ర్మానానా విధా వేదే విస్తృత న‌ర‌జ‌న్మ‌నాం
దేశ‌కాల వ‌యోవ‌స్థా వ‌ర్ణాశ్ర‌మ విభాగ‌శః
దేశ‌, కాల వ‌యో అవ‌స్థ‌ల‌ను బ‌ట్టి వ‌ర్ణాశ్ర‌మాల‌ను అనుస‌రించి ధ‌ర్మం అనేక విధాలుగా వేదం ప్ర‌వ‌చించింది. అటువంటి వివిధ ధ‌ర్మాల్లో కూడా ఏకాద‌శి నాడు ఉప‌వాసం, ద్వాద‌శి దాట‌కుండా పార‌ణం అనేవి విశ్వ‌జ‌నీనంగా భాసిస్తున్నాయి. అలాంటి వైదిక ధ‌ర్మాచ‌ర‌ణ చేసినందుకుగాను నువ్వు అంబ‌రీషుని శ‌పించింది చాల‌క తిరిగి మ‌రో ఘోర శాపం ఇవ్వ‌బోయావు. బ్రాహ్మ‌ణుడైన నీ వాక్యాన్ని స‌త్యం చేయ‌డం, భ‌క్తుడైన ఆ రాజుకు కాపాడుకోవ‌డం రెండూ నా బాధ్య‌త‌లే గ‌నుక పునః శ‌పించ‌బోయే నిన్ను నివారించ‌డానికే నా చ‌క్రాన్ని ప్ర‌యోగించాను అని దూర్వాసునికి శ్రీ‌హ‌రి తెలియ‌చేశాడు.
ద్వాద‌శి పారాయ‌ణ స‌మాప్తః  

Friday, November 8, 2019

కార్తీక పురాణం- 11వ రోజు పారాయ‌ణం (శుక్ల ఏకాద‌శి రోజున‌)

ఏక‌వింశాధ్యాయం
అత్రి మ‌హ‌ర్షి ఇలా చెబుతున్నాడు.
అగ‌స్త్యా, సాధార‌ణ‌మైన దొమ్మిగా, కొట్లాట‌గా ప్రారంభ‌మై ఆ పోరాటం ఒక మ‌హాయుద్ధంగా ప‌రిణ‌మించింది. అస్త్రశ‌స్ర్తాల‌తో, ప‌దునైన బాణాల‌తో, వాడివాడి గుదియ‌ల‌తో, ఇనుప‌క‌ట్ల తాడిక‌ర్ర‌లతో, ఖ‌డ్గ‌, ప‌ట్టిస‌, ముస‌ల‌, శూల‌, భ‌ల్లాత‌క‌, తోమ‌ర‌, కుంభ‌, కాఠారాద్యాయుధాల‌తో భీక‌రంగా యుద్ధం సాగింది. ఆ సంకుల స‌మ‌రంలో కాంభోజ‌రాజు మూడు వంద‌ల బాణాల‌ను ప్ర‌యోగించి పురంజ‌యుని గొడుగు, జెండా, ర‌థం కూడ‌గొట్టాడు. ఇంకొక ఐదు బాణాల‌తో అశ్వాల‌నున కూల్చివేశాడు. మ‌రికొన్ని బాణాల‌తో పురంజ‌యుని గాయ‌ప‌రిచాడు. అందుకు కోపించిన పురంజ‌యుడు బ్ర‌హ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించిన న‌ప‌దునైన బాణాల‌ను కాంభోజ‌రాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజుని క‌వ‌చాల‌ను చీల్చి గుండెలో దిగ‌బ‌డ్డాయి. ర‌క్తం ధారాపాతంగా కారుతుండ‌గా త‌న వ‌క్షంలో గుచ్చుకున్న బాణాల‌ను పెరికివేసి ఓ పురంజ‌యా, నేను ప‌రుల సొమ్ముకు ఆశ‌ప‌డే వాడిని కాను. నీవు పంపిన బాణాల‌ను నీకు తిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వాటినే త‌న వింట సంధించి పురంజ‌యుని మీద‌కు ప్ర‌యోగించాడు. ఆ బాణాలు పురంజ‌యుని సార‌థిని చంపేశాయి. ధ‌నుస్సును ముక్క‌లు చేశాయి. పురంజ‌యుని మ‌రింత గాయ‌ప‌రిచాయి. అంత‌టితో మండిప‌డిన అయోధ్యాధిప‌తి ఇర‌వై రెక్క‌ల బాణాల‌ను వింట సంధించి వాటిని ఆక‌ర్షాంతంగా లాగి కాంభోజునిపై వ‌దిలాడు. ఆ ఇర‌వై బాణాలు ఏక‌కాలంలో కాంభోజుని గుండెల్లో నుంచి వీపు గుండా దూసుకుపోవ‌డంతో అత‌ను మూర్ఛిల్లాడు. దానితో యుద్ధం మ‌రింత భ‌యంక‌రంగా మారింది. తెగిన తొండాల‌తో ఏనుగులు, న‌రికిన త‌ల‌ల‌తో అశ్వాలు, విరిగి ప‌డిన ర‌థాలు, స్వేచ‌ఛ‌గా దొర్లుతున్న ర‌థ‌చ‌క్రాలు, త‌ల‌లు, మొండాలు ఎడంఎడంగా ప‌డి గిల‌గిలా త‌న్నుకుంటున్న క‌ళేబ‌రాల‌తో క‌ద‌న‌రంగం అంతా కంట‌గింపుగా త‌యార‌యింది. మృత‌వీరుల ర‌క్తం అక్క‌డ వాగులు క‌ట్టి ప్ర‌వ‌హించ‌సాగింది. ఆ భీష‌ణ బీభ‌త్స సంగ్రామంలో అధ‌ర్మ‌యుతుడైన పురంజ‌యుని బ‌లం క్ర‌మ‌క్ర‌మంగా క్షీణించిపోయింది. 

కురుజాతి వీరుల విజృంభ‌ణ‌కు త‌ట్టుకోలేక ఆ సాయంకాలానికి స‌మ‌ర‌భూమిని వ‌దిలి, ప‌ట్ట‌ణంలోకి పారిపోయాడు. అంతఃపురం చేరి ఆ నాటి శ‌త్రువుల జ‌యానికి ప‌డీప‌డీ దుఃఖిస్తున్న పురంజ‌యుని చూసి సుశీలుడ‌నే పురోహితుడు ఓ మ‌హారాజా శ‌త్ర‌వైన వీర‌సేనుని గెల‌వాల‌నే కోరికే గ‌నుక బ‌లంగా ఉన్న‌ట్ట‌యితే ఈ క్ష‌ణ‌మే భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌తో విష్ణువును సేవించి శ‌ర‌ణాగ‌తి చేయ‌డం ఒక్క‌టే మార్గం. ఇది కార్తీక పౌర్ణ‌మి. కృత్తికా న‌క్ష‌త్ర యుతుడై చంద్రుడు షోడ‌శ క‌ళా శోభాయ‌మానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో ల‌భించే పూల‌ను సేక‌రించి హ‌రి ముందు మోక‌రించి పూజించు. విష్ణు స‌న్నిధిలో దీపాలు వెలిగించు. గోవిందా, నారాయ‌ణా అంటూ స్వామివారి నామాల‌ను మేళ‌తాళ ధ్వ‌నుల మ‌ధ్య‌న ఎలుగెత్తి పాడు. శ్రీ‌హ‌రి ముందు న‌ర్తించు. అలా చేసిన‌ట్ట‌యితే విష్ణుమూర్తి అనుగ్ర‌హం వ‌ల‌న నీకు మ‌హావీరుడైన కుమారుడు క‌లుగుతాడు. కార్తీక మాసంలో త‌న‌ను ఆరాధించే భ‌క్తుల ర‌క్ష‌ణార్ధం శ్రీ‌హ‌రి శ‌త్రుభ‌యంక‌ర‌మైన సుద‌ర్శ‌న చ‌క్రాన్ని స్వ‌యంగా పంపుతాడు. 

ఈ కార్తీక పుణ్య మ‌హిమ చెప్ప‌డం ఎవ‌రి వ‌ల్ల సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. భూప‌తి, ఈ నాటి నీ ఓట‌మికి కార‌ణం సైన్య‌బ‌లం లేక‌పోవ‌డం లేదా నీకు శ‌రీర‌బ‌లం లేక‌పోవ‌డం కానే కాదు. మితిమీరిన అధ‌ర్మ‌వ‌ర్త‌నం వ‌ల‌న నీ ధ‌ర్మ‌ఫ‌లం క్షీణించిపోయింది. ఫ‌లితంగా దైవ‌బ‌లం త‌గ్గిపోయింది. అదే నీ ప‌రాజ‌యానికి కార‌ణం. కాబ‌ట్టి పురంజ‌యా, శోకాన్ని వ‌దిలి భ‌క్తితో శ్రీ‌హ‌రిని సేవించు. క‌ల‌త మాని కార్తీక వ్ర‌తాన్ని ఆచ‌రించు. ఈ కార్తీక వ్ర‌తం వ‌ల‌న ఆయురారోగ్య ఐశ్య‌ర్య సుఖ సంప‌త్ సౌభాగ్య సంతానాలు సంఘ‌టిల్లి తీరుతాయి. నా మాట‌ల‌ను విశ్వ‌సించు అని హితోక్తులు ప‌లికాడు
ఏక‌వింశోధ్యాయ స‌మాప్తః
---------------
ద్వావింశాధ్యాయం
రెండో రోజు యుద్ధం-పురంజ‌యుని విజ‌యం
అగ‌స్త్యా, ఆ విధంగా సుశీలుడు చేసిన బోధ‌తో పురంజ‌యుడు త‌క్ష‌ణ‌మే విష్ణ్వాల‌యానికి వెళ్లి వివిధ ఫ‌ల‌పుష్ప ప‌ల్ల‌వ ద‌ళాదిగా విష్ణుడును షోడ‌శోప‌చారాల‌తో పూజించి ప్ర‌ద‌క్షిణ న‌మ‌స్కారాల‌ర్పించి మేళ‌తాళాల‌తో ఆయ‌న‌ను కీర్తించి పార‌వ‌శ్యంతో న‌ర్తించాడు. అంతేకాదు, బంగారంతో విష్ణు ప్ర‌తిమ చేయించి పూజాదికాలు నిర్వ‌హించాడు. దీప‌మాలిక‌లు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా విష్ణు సేవ‌లో లీన‌మైపోయి మ‌రుస‌టి రోజు ఉద‌య‌మే శేష సైన్య స‌మేతుడై యుద్ధ‌రంగాన్ని చేరాడు. న‌గ‌ర స‌రిహ‌ద్దుల‌ను దాటుతూనే శ‌త్రువుల‌ను స‌మ‌రానికి ఆహ్వానిస్తూ భీష‌ణ‌మైన ధ‌నుష్ఠంకారం చేశాడు. కాంభోజ కురుజాది బ‌లాలు ఆ శ‌బ్దానికి అప్ర‌మ‌త్తులై యుద్ధ‌భూమికి చేరారు. వ‌జ్రాల వంటి క‌త్తులు, పిడుగుల వంటి బాణాలు, అమిత వేగ‌వంత‌మైన ఆకాశానికి ఎగ‌ర‌గ‌లిగే అశ్వాలు, ఐరావ‌తాల వంటి ఏనుగులు, విజ‌య‌కాంక్ష‌తో ప్రాణాల‌కు తెగించి పోరాడే కాల్బ‌లాల‌తో యుద్ధం దుర్నిరీక్ష్యంగా మారింది. ముందు రోజు రాత్రి పురంజ‌యుని పూజ‌ల‌కు సంతుష్టుడైన గ‌రుడ‌గ‌మ‌నుడు అత‌నికి దైవ‌బ‌లాన్ని జ‌త చేయ‌డం వ‌ల‌న ఆ నాటి యుద్ధంలో శ‌త్రురాజుల శ‌క్తుల‌న్నీ ఉడిగిపోయాయి. కాంభోజుని గుర్రాలు, కురుజాదుల ఏనుగులు, వివిధ రాజుల ర‌థ‌బ‌లాలు, వైరి కూటానికి చెందిన ప‌దాతి బ‌లాలు దైవ‌కృపా పాత్రుడైన పురంజ‌యుని ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. పురంజ‌యుని ప‌రాక్ర‌మానికి గుండెల‌విసిపోయిన శ‌త్రురాజులు ప్రాణ‌భీతితో ర‌ణ‌రంగాన్ని వ‌దిలి త‌మ త‌మ రాజ్యాల‌కు ప‌రుగులు తీశారు. విష్ణుమూర్తి అనుగ్ర‌హం వ‌ల‌న విజ‌యాన్ని పొందిన పురంజ‌యుడు రాజ‌ధాని అయోధ్యా ప్ర‌వేశం చేశాడు. విష్ణుడు అనుకూలుడైతే శ‌త్రువు మిత్రుడ‌వుతాడు. విష్ణువు ప్ర‌తికూలుడైతే మిత్రుడే శ‌త్రువ‌వుతాడు. దేనికైనా దైవ‌బ‌ల‌మే ప్ర‌ధానం. ఆ దైవ‌బ‌లానికి ధ‌ర్మాచ‌ర‌ణే అత్యంత ప్ర‌ధానం. ధ‌ర్మాచ‌ర‌ణ త‌త్ప‌రులై కార్తీక వ్ర‌త ధ‌ర్మానుష్ఠానంతో ఎవ‌రైతే శ్రీ‌హ‌రిని సేవిస్తారో వారి స‌మ‌స్త దుఃఖాలు చిటిక‌లో న‌శించిపోతాయి.
అగ‌స్త్యా, విష్ణుభ‌క్తి సిద్ధించ‌డ‌మే క‌ష్ట‌త‌రం. అందునా కార్తీక వ్ర‌తాచ‌ర‌ణాస‌క్తి, శ‌క్తి క‌ల‌గడం ఇంకా క‌ష్టం. క‌లియుగంలో ఎవ‌రైతే కార్తీక వ్ర‌తం, శ్రీ‌హ‌రి సేవ వ‌ద‌ల‌కుండా చేస్తారో వారు శూద్రులైనా స‌రే వైష్ణ‌వోత్త‌ములుగా ప‌రిగ‌ణింప‌బ‌డ‌తారు. వేద‌విదులైన బ్రాహ్మ‌ణులైన‌ప్ప‌టికీ కూడా ఈ హ‌రిసేవ‌, కార్తీక వ్ర‌తాచ‌ర‌ణ లేని వారు క‌ర్మ‌చండాలురే అవుతారు. ఇక వేద‌వేత్త అయి, హ‌రిభ‌క్రుడై, కార్తీక వ్ర‌త నిష్ఠుడైన వానిలో సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి నివ‌శిస్తాడు. ఏ జాతి వారైనా స‌రే ఈ సంసార సాగ‌రం నుంచి బ‌య‌ట‌ప‌డి ఉత్త‌మ గ‌తులు పొందాల‌నే కోరిక‌తో విష్ణువును అర్చించిన‌ట్ట‌యితే త‌క్ష‌ణ‌మే త‌రించిపోతారు. స్వతంత్రుడు గాని, ప‌ర‌తంత్రుడు గాని హ‌రిపూజాస‌క్తుడై ఉంటేనే ముక్తి. భ‌క్తుల‌కా శ్రీ‌హ‌రి, విష్ణువుకి భ‌క్తులు అన్యోన్యానురాగ‌బ‌ద్ధులై ఉంటారు. భ‌క్తుల‌కు ఇహ‌ప‌రాలు రెండింటినీ అనుగ్ర‌హించి ర‌క్షించ‌గ‌లిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వ‌మంత‌టా నిండి ఉన్న ఆ మ‌హావిష్ణువుపై సంపూర్ణ భ‌క్తి ప్ర‌ప‌త్తులున్న వారికి మాత్ర‌మే ఈ కార్తీక వ్ర‌తావ‌కాశం చేజిక్కుతుంది. కాబ‌ట్టి వేద‌స‌మ్మ‌తం, స‌క‌ల‌శాస్త్రసారం, గోప్యం, స‌ర్వ‌వ్ర‌తోత్త‌మం అయిన ఈ కార్తీక వ్ర‌తాన్ని ఆచ‌రించినా, క‌నీసం కార్తీక మ‌హాత్యాన్ని మ‌న‌స్ఫూర్తిగా వినినా కూడా అలాంటి వారు పాపాలు న‌శించిపోయి వైకుంఠం చేరుకుంటారు. మ‌హ‌త్వ పూర్వ‌క‌మైన ఈ 22వ అధ్యాయాన్ని శ్రాద్ధ కాలంలో ప‌ఠించ‌డం వ‌ల‌న పితృదేవ‌త‌లు క‌ల్పాంత తృప్తిని పొందుతారు. ఇది నిస్సంస‌యం అని అత్రి ముగించాడు.
ద్వావింశాధ్యాయ స‌మాప్తః
----------------
త్ర‌యోవింశాధ్యాయం
హే అత్రి మునీంద్రా, విష్ణుకృప వ‌ల‌న విజ‌యుడైన పురంజ‌యుడు ఆ త‌ర్వాత ఏమి చేశాడో కూడా వివ‌రించు అన్న అగ‌స్త్యుని మాట‌ల‌కు స్పందించిన అత్రి మ‌హ‌ర్షి ఇలా చెప్ప‌సాగాడు.

భ‌గ‌వంతుని కృప వ‌ల‌న యుద్ధ‌భూమిలో విజ‌య‌ల‌క్ష్మిని వ‌రించిన పురంజ‌యుడు అమ‌రావ‌తిలో ఇంద్రుని వ‌లె అత్యంత వైభ‌వంతో ప్ర‌కాశించాడు. గ‌తంలోని దుష్ట భావాల‌ను విస‌ర్జించి స‌త్య శౌచ పాల‌నం, నిత్య ధ‌ర్మాచ‌ర‌ణం, దాన‌శీల‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తూ, య‌జ్ఞ‌యాగాదులు నిర్వ‌హించాడు. ప్ర‌తీ ఏడాది క్ర‌మం త‌ప్ప‌కుండా కార్తీక వ్ర‌తాచ‌ర‌ణం చేసి క‌ల్మ‌షాల‌న్నీ తొల‌గిపోయి శుద్ధాత్ముడై అరిష‌డ్వ‌ర్గాల‌ను జ‌యించి ప‌ర‌మ వైష్ణ‌వుడై జీవితం గ‌డిపాడు. నిరంత‌రం శ్రీ‌హ‌రి పూజా ప్రియుడై ఏ దేశాల‌లో ఏయే క్షేత్రాల్లో తీర్థాల్లో విష్ణువును ఏయే విధాలుగా పూజించ‌డం వ‌ల‌న జ‌న్మ త‌రిస్తుందా అనే త‌ప‌న‌తో ఉండే వాడు. అంత‌గా హ‌రిసేవా సంవిధాన త‌త్ప‌రుడై సంతృప్తుడ‌య్యాడు. ఒక రోజు ఆకాశ‌వాణి పురంజ‌యా, కావేది తీరంలో శ్రీ‌రంగ క్షేత్రం ఉంది. శ్రీ‌రంగ‌నాథుడ‌నే పేరిట విష్ణుమూర్తి అక్క‌డ వెలిసి పూజ‌లందుకుంటున్నాడు. ఆయ‌న‌ను కార్తీక మాసంలో అర్చించి జ‌న‌న మ‌ర‌ణాల నుంచి క‌డ‌తేరు అంటూ ప్ర‌బోధించ‌డంతో రాజ్య‌పాల‌న మంత్రుల‌కు అప్ప‌గించి త‌గినంత స్థాయిలో చ‌తురంగ బ‌లాలను తీసుకుని అనేక తీర్థ‌క్షేత్రాల‌ను ద‌ర్శిస్తూ అక్క‌డ‌క్క‌డా యోగ్య‌విధిగా శ్రీ‌హ‌రినే అర్చిస్తూ కావేరీ మ‌ధ్యంగ‌త‌మై భూలోక వైకుంఠంగా భాసిల్లుతున్న శ్రీ‌రంగం చేరి కార్తీక మాసం అంతా కావేరి న‌దిలో స్నానాలు చేసి రంగ‌నాథ సేవ చేశాడు. ప్ర‌తిక్ష‌ణం కృష్ణా, గోవిందా, వాసుదేవా, శ్రీ‌రంగ‌నాథా అని హ‌రినే స్మ‌రిస్తూ జ‌ప‌దానాది విద్యుక్త ధ‌ర్మాల‌న్నింటినీ పూర్తి చేసుకుని అయోధ్య చేరుకున్నాడు. అనంత‌రం ధ‌ర్మ‌కామం వ‌ల‌న స‌త్ పుత్ర పౌత్రాదుల‌ను పొంది కొన్నాళ్ల‌కు స‌ర్వ‌భోగాల‌ను త్య‌జించి భార్యాస‌మేతంగా వాన‌ప్ర‌స్థం స్వీక‌రించి జీవితం అంతా విష్ణుసేవ‌లోనే లీన‌మ‌య్యాడు. కార్తీక వ్ర‌తాచ‌ర‌ణ చేశాడు. ఆ పుణ్య‌వ‌శాన అత్యంలో వైకుంఠం చేరుకున్నాడు.
త్ర‌యోవింశాధ్యాయ స‌మాప్తః

Thursday, November 7, 2019

కార్తీక పురాణం- 10వ రోజు పారాయ‌ణం   (శుక్ల ద‌శ‌మి రోజున‌)

ఏకోన‌వింశాధ్యాయం 

జ్ఞాన‌సిద్ధుడు విష్ణుమూర్తినుద్దేశించి ఇలా కీర్తిస్తున్నాడు.

వేద‌వేత్త‌ల చేత వేద‌వేద్యునిగాను, వేదాంత స్థితునిగాను, ర‌హ‌స్య‌మైన వానిగాను, అద్వితీయునిగాను కీర్తింప‌బ‌డే వాడా!

సూర్య‌చంద్ర శివ బ్ర‌హ్మాదుల చేత‌, మ‌హారాజాధిరాజుల చేత స్తుతులందుకునే ర‌మ‌ణీయ పాద‌ప‌ద్మాలు గ‌ల వాడా! నీకు న‌మ‌స్కారం.

పంచ‌భూతాలు, సృష్టి సంభూతాలైన స‌మ‌స్త చ‌రాచ‌రాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివ‌సేవిత చ‌ర‌ణా, నువ్వు ప‌ర‌మం కంటె ప‌ర‌ముడ‌వి. నువ్వే స‌ర్వాధికారివి. స్థావ‌ర జంగ‌మ రూప‌మైన స‌మ‌స్త ప్ర‌పంచం కూడా దానికి కార‌ణ‌బీజ‌మైన మాయ‌తో స‌హా నీ యందే ప్ర‌స్ఫుట‌మ‌వుతోంది. సృష్ట్యాదినీ, మ‌ధ్య‌లోనూ, త‌ద‌నంతంలోనూ కూడా ప్రపంచ‌మంతా నీవే నిండి ఉంటావు. భ‌క్ష్య భోజ్య చోష్య లేహ్య చ‌తుర్విధాన్న రూపుడ‌వూ, య‌జ్ఞ స్వ‌రూప‌డ‌వు కూడా నీవే. అమృత‌మ‌యం, ప‌ర‌మ సుఖ‌ప్ర‌దం అయిన నీ స‌చ్చిదానంద రూప సంస్మ‌ర‌ణం చేత‌నే ఈ సంసారం స‌మ‌స్తం వెన్నెల్లో స‌ముద్రంలా భాసిస్తోంది.

హే ఆనంద‌సాగ‌రా!  ఈశ్వ‌రా, జ్ఞాన స్వ‌రూపా, స‌మ‌స్తానికీ ఆధారం, స‌క‌ల పురాణ సారం కూడా నీవే. ఈ విశ్వం స‌మ‌స్తం నీ వ‌ల్ల‌నే జ‌నించి తిరిగి నీ యందే ల‌యిస్తూ ఉంటుంది. ప్రాణులంద‌రి హృద‌యాల్లోనూ ఉండే వాడివీ, ఆత్మ‌వాచ్యుడ‌వూ, అఖిల వంద్యుడ‌వూ, మ‌నోవాగగోచ‌రుడ‌వూ అయిన నువ్వు కేవ‌లం మాంస‌మ‌యాలైన ఈ భౌతిక నేత్రాల‌కు క‌నిపించ‌వు క‌దా తండ్రీ. ఓ కృష్ణా, ఓ ఈశ్వ‌రా, ఓ నారాయ‌ణా నీకు న‌మ‌స్కారం.

 నీ ద‌ర్శ‌న ఫ‌లంతో న‌న్ను ధ‌న్యుని చేయి. ద‌యామ‌యునివై న‌న్ను నిత్యం ప‌రిపాలించు. జ‌గ‌దేక‌పూజ్యుడ‌వైన నీకు మొక్క‌డం వ‌ల‌న నా జ‌న్మ‌కు సాఫ‌ల్యం ల‌భించేలా అనుగ్ర‌హించే దాత‌వు, నేత‌వు, కృపాస‌ముద్రుడ‌వు నీవే. సంసార సాగ‌రంలో సంక‌టాల న‌డుమ కొట్టుమిట్టాడుతున్న న‌న్ను స‌ముద్ధ‌రించు.

హే సిద్ధ‌చ‌రితా, హే ముకుందా, హే త్రిలోక‌నాథా, హే గుణాతీతా, హే గురూ, హే ద‌యామ‌యా విష్ణూ నీకు న‌మ‌స్కారం. నిత్యానంద సుధాబ్ధివాసీ, స్వ‌ర్గాప‌వ‌ర్గ‌ప్ర‌దా, అభేదా, తేజోమ‌యా, సాధుహృత్ప‌ద్మ‌స్థితా, ఆత్మారామా, దేవ‌దేవేశా, గోవిందా నీకిదే న‌మ‌స్కారం.

సృష్టి స్థితిల‌య‌కారా, వైకుంఠ‌వాసా! బుద్ధిమంతులైన వారు ఏ పాదాలపై భ‌క్తి అనే ప‌డ‌వ చేత సంసార సారూప్యాన్ని పొంద‌గ‌లుగుతున్నారో ఆ తేజ‌స్వ‌రూపాలైన నీ పాదాల‌కివే నా ప్ర‌ణామాలు.

వేదాల చేత గాని, శాస్త్రత‌ర్క‌పురాణ నీతి కావ్యాదుల చేత గాని మాన‌వులు నిన్ను ద‌ర్శించ‌లేరు. నీ పాద‌సేవ‌, భ‌క్తి అనే అంజ‌నాల‌ను ధ‌రించ‌గ‌లిగిన వారు మాత్ర‌మే నీ రూపాన్ని భావించి ఆత్మ‌స్వ‌రూపునిగా గుర్తించి త‌రించ‌గ‌లుగుతున్నారు. ప్ర‌హ్లాద‌, ధ్రువ‌, మార్కండేయ‌, విభీష‌ణ‌, ఉద్ధ‌వ‌, గ‌జేంద్రాది భ‌క్త కోటుల‌ను ర‌క్షించిన నీ నామ స్మ‌ర‌ణ మాత్రం చేత‌నే స‌మ‌స్త పాపాలు న‌శించిపోతున్నాయి. ఓ కేశ‌వా, ఓ గోవిందా, ఓ విష్ణూ, ఓ మ‌ధుసూద‌నా, ఓ త్రివిక్ర‌మా, ఓ వామ‌నా, ఓ శ్రీ‌ధ‌రా, ఓ హృషీకేశా, ఓ ప‌ద్మ‌నాభా, ఓ దామోద‌రా, ఓ సంక‌ర్ష‌ణా, ఓ వాసుదేవా నీకు న‌మ‌స్కారం. న‌న్ను ర‌క్షించు.

ఎడ‌తెరిపి లేకుండా పార‌వ‌శ్యంతో త‌న‌ను స్తుతిస్తున్న జ్ఞాన‌సిద్ధుని విష్ణుమూర్తి చిరున‌వ్వుతో చూస్తూ "జ్ఞాన‌సిద్ధా నీ స్తోత్రానికి నేను సంతోష‌భ‌రితుడ‌న‌య్యాను. ఏమి వ‌రం కావాలో కోరుకో" అన్నాడు. 

హే జ‌గ‌న్నాథా, నీకు నాపై అనుగ్ర‌హం ఉన్న‌ట్ట‌యితే నాకు సాలోక్యాన్ని (వైకుంఠం) ప్ర‌సాదించు అని జ్ఞాన‌సిద్ధుడు కోర‌డంతో తథాస్తు అని శ్రీ‌హ‌రి ఇలా చెప్ప‌సాగాడు.
జ్ఞాన‌సిద్ధా, నీ కోరిక నెర‌వేరుతుంది. కాని అత్యంత దురాత్ముల‌తో నిండిపోతున్న ఈ న‌ర లోకంలో మ‌హాపాపాత్ములు సైతం సులువుగా త‌రించే సూత్రాన్ని చెబుతాను విను. స‌త్పురుషా, నేను ప్ర‌తీ ఆషాఢ శుద్ధ ద‌శ‌మి నాడు ల‌క్ష్మీస‌మేతుడ‌నై పాల స‌ముద్రంలో ప‌వ‌ళించి కార్తీక శుద్ధ ద్వాద‌శి నాడు మేల్కొంటాను. నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ నాలుగు నెల‌లూ ఎవ‌రైతే స‌ద్ర్వ‌తాలు ఆచ‌రిస్తారో వారి పాపాల‌న్నీ న‌శించిపోయి నా సాన్నిధ్యం పొంద‌గ‌లుగుతారు. విజ్ఞులు, వైష్ణ‌వులు అయిన నీవు, నీ స‌హ‌వ్ర‌తులూ కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్ర‌తాచ‌ర‌ణం చేయండి. చాతుర్మాస్య వ్ర‌తాచ‌ర‌ణ శూన్యులైన వారు బ్ర‌హ్మ‌హ‌త్యాపాత‌క ఫ‌లాన్ని పొందుతారు. నిజానికి నాకు నిద్ర‌, మెల‌కువ‌,క‌ల అనేవేవీ లేవు. నేను వాటికి అతీతుడ‌ను. అయినా నా భ‌క్తుల‌ను ప‌రీక్షించ‌డానికి త్రికాలాల్లోనూ నిద్రా మిష‌తో జ‌గ‌న్నాట‌క రంగాన్ని చూస్తూ ఉంటాను. చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన ఈ స్తోత్రాన్ని త్రికాలాల్లోను ప‌ఠించే వారు కూడా త‌రిస్తారు. వీటిని లోకంలో ప్ర‌చారం చేసి లోకోప‌కారానికి న‌డుం క‌ట్టు. అని చెప్పి నారాయ‌ణుడు ల‌క్ష్మీ స‌మేతుడై ఆషాఢ శుక్ల ద‌శ‌మి నాడు పాల‌స‌ముద్రాన్ని చేరి శేష‌త‌ల్పంపై శ‌య‌నించ‌సాగాడు.

ఈ వృత్తాంతం అంతా చెప్పిన అంగీర‌స‌ముని ఓయీ నీవ‌డిగిన చాతుర్మాస్య వ్ర‌త మ‌హిమ ఇది. దురాత్ములైనా, పాపాత్ములైనా స‌రే హ‌రినారాయ‌ణాప‌రులై ఈ చాతుర్మాస్య వ్ర‌తాచ‌ర‌ణ చేసే బ్రాహ్మ‌ణ‌, క్ష‌త్రియ, వైశ్య‌, శూద్ర‌, స్ర్తీ జాతుల వారంద‌రూ కూడా త‌రించి తీరుతారు. ఈ వ్ర‌తాన్నిచేయ‌ని వారు గో, గోత్ర హ‌త్యా ఫ‌లాన్ని, కోటి జ‌న్మ‌లు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు. శ్ర‌ద్ధాభ‌క్తుల‌తో ఆచ‌రించే వారు వంద య‌జ్ఞాలు చేసిన ఫ‌లం పొంది అంతంలో విష్ణులోకం పొందుతారు.
ఏకోన‌వింశాధ్యాయ స‌మాప్తః
-----------
వింశాధ్యాయం


జ‌న‌కుని కోరిక‌పై వ‌శిష్ఠుడు ఇంకా ఇలా చెప్ప‌సాగాడు.
ఓ మిథిలారాజ్య ధౌరేయా, ఈ కార్తీక మాహాత్మ్యం గురించి అత్రి, అగ‌స్త్య మునుల మ‌ధ్య జ‌రిగిన సంవాదం కూడా త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి. ఒక నాడు అత్రి మ‌హాముని అగ‌స్త్యుని చూపి కుంభ‌సంభ‌వా, లోక‌త్ర‌యోప‌కారం కోసం కార్తీక మాహాత్మ్య బోధ‌క‌మైన ఒక హ‌రిగాథ‌ను వినిపిస్తాను.

వేదంతో స‌మాన‌మైన శాస్త్రంగాని, ఆరోగ్యాన్ని మించిన ఆనందం గాని, హ‌రికి సాటి అయిన దైవం గాని, కార్తీకంతో స‌మాన‌మైన నెల గాని లేవ‌య్యా. కార్తీక స్నాన‌, దీప‌దానాలు, విష్ణ్వ‌ర్చ‌న‌ల వ‌ల‌న స‌మ‌స్త వాంఛ‌లూ స‌మ‌కూర‌తాయి. ముఖ్యంగా క‌లియుగ ప్రాణులు కేవ‌లం విష్ణుభ‌క్తి వ‌ల‌న మాత్ర‌మే విజ‌య‌, వివేక‌, విజ్ఞాన‌, య‌శోధ‌న ప్ర‌తిష్ఠాన సంప‌త్తులు పొంద‌గ‌లుగుతారు. ఇందుకు సాక్షీభూతంగా పురంజ‌యుని ఇతిహాసం వివ‌రిస్తాను అంటూ కొన‌సాగించాడు.

పురంజ‌యోపాఖ్యానం
త్రేతా యుగంలో సూర్య‌వంశ క్ష‌త్రియుడైన పురంజ‌యుడ‌నే వాడు అయోధ్య‌ను ప‌రిపాలించే వాడు. స‌ర్వ‌శాస్త్రవిదుడూ, ధ‌ర్మ‌జ్ఞుడూ అయిన రాజు అత్య‌ధిక‌మైన ఐశ్వ‌ర్యం క‌ల‌గ‌డంతో అహంక‌రించిన వాడై బ్రాహ్మ‌ణ ద్వేషి, దేవ బ్రాహ్మ‌ణ భూ హ‌ర్త‌, స‌త్య విహీనుడూ, దుష్ట క‌ర్మ ప‌రాక్ర‌మ యుక్తుడు, దుర్మార్గుడుగా మారిపోయాడు. ఫ‌లితంగా అత‌ని ధ‌ర్మ‌బ‌లం న‌శించిపోయింది. సామంతులైన కాంభోజ‌, కురుజాదులు అనేక మంది ఏక‌మై చ‌తురంగ బ‌లాల‌తో వ‌చ్చి అయోధ్య‌ను ముట్ట‌డించారు. ఈ వార్త తెలిసిన పురంజ‌యుడు కూడా బ‌ల‌మ‌ద‌యుక్తుడై శ‌త్రువుల‌తో త‌ల‌బ‌డేందుకు సిద్ధం అయ్యాడు. పెద్ద‌పెద్ద చ‌క్రాలు, ప‌తాకం, ధ‌నుర్బాణ శ‌స్ర్తాస్త‌సంప‌న్నం అయిన‌, ప‌లు యుద్ధాల్లో విజ‌యం అందించిన‌, చ‌క్క‌టి అశ్వాలు పూన్చిన త‌మ సూర్య‌వంశాన్వ‌మైన ర‌థాన్న‌ధిరోహించి ర‌థ‌గ‌జ‌తురంగ ప‌దాతి ద‌ళాల‌తో న‌గ‌రం నుంచి బ‌య‌లుదేరి శ‌త్రు సైన్యాల‌పై విరుచుకుప‌డ్డాడు.
ద‌శ‌మ దిన పారాయ‌ణ స‌మాప్తః

Wednesday, November 6, 2019

కార్తీక పురాణం- 9వ రోజు పారాయ‌ణం   (శుక్ల న‌వ‌మి రోజున‌) 

తొమ్మిద‌వ రోజు పారాయ‌ణం
స‌ప్త‌ద‌శాధ్యాయం
పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీర‌సుడు ఈ విధంగా ఉప‌దేశం చేశాడు. నాయ‌నా ఒక‌ప్పుడు కైలాసంలో పార్వ‌తీ దేవికి శివుడు చెప్పిన విష‌యాల‌నే నేను నీకిప్పుడు చెబుతున్నాను.

అంగీర‌సుడు చేసిన ఆత్మ‌జ్ఞాన బోధ‌
శ్లో - క‌ర్మ‌బంధ‌శ్చ ముక్తిశ్చ కార్యంకార‌ణ‌మేవ‌చ‌
స్థూల సూక్ష్మం త‌థా ద్వంద్వ సంబంధో దేహ‌ముచ్య‌తే
క‌ర్త‌బంధం, ముక్తి కార్యం, కార‌ణం స్థూల సూక్ష్మంగా ప్ర‌సిద్ధి చెందింది. ఈ ద్వంద్వ సంబంధిత‌మైన‌దే దేహంగా వ్య‌వ‌హారంలో ఉంది.
శ్లో - ఆత్ర‌బ్రూమ స్స‌మాధానం కోన్యో జీవ‌శ్చ‌మేవ‌హి
స్వ‌యం పృచ్ఛ‌సిమాం కో2హం బ్ర‌హ్మైవాస్మిన సంశ‌యః
జీవుడంటే వేరెవ‌రూ కాదు. నీవే. అప్పుడు నేనెవ‌రిని అని నిన్ను నువ్వే ప్ర‌శ్నించుకుంటే "నేనే బ్ర‌హ్మ‌నై ఉన్నాను, ఇది నిశ్చ‌యం" అనే స‌మాధాన‌మే వ‌స్తుంది.

అది విన్న ఆ పురుషుడు "ఓ మ‌హాత్మా మీరు చెప్పిన వాక్యార్థ జ్ఞానం నాకు త‌ట్ట‌డంలేదు. నేను బ్ర‌హ్మ‌ను అనుకోవ‌డానికైనా బ్ర‌హ్మ‌మ‌నే ప‌దార్ధం గురించి తెలిసి ఉండాలి క‌దా!  ఆ ప‌దార్ధ జ్ఞానం కూడా లేని వాడినైన నాకు ఆ వివ‌రాలు చెప్పండి" అని కోరాడు. 

అంతఃక‌ర‌ణానికి, త‌ద్వ్యాపారాల‌కి, బుద్ధికి సాక్షి స‌త్, చిత్‌, ఆనంద రూపి అయిన ప‌దార్థ‌మే మూలం అని తెలుసుకో. దేహం కుండ వ‌లె రూపాదివ‌త్ గా ఉన్న పిండ‌శేషం. ఆకాశాది పంచ‌భూతాల వ‌ల‌న పుట్టిన‌ది అయిన కార‌ణంగా ఈ శ‌రీరం ఆత్మ‌త‌ర‌మైన‌దే త‌ప్ప "ఆత్మ" మాత్రం కాదు. ఇదే విధంగా ఇంద్రియాలు గాని, అగోచ‌ర‌మైన మ‌న‌స్సు గాని, అస్థిర‌మైన ప్రాణం గాని ఇవేవీ ఆత్మ కాదు. దేనివ‌ల‌నైతే దేహేంద్రియాదుల‌న్నీ భాస‌మాన‌నుల‌వుతున్నాయో అదే "ఆత్మ‌". ఆ ఆత్మ‌ప‌దార్ధ‌మే నేను అనే విచికిత్స‌ను పొందు. ఏ విధంగానైనా అయ‌స్కాంత మ‌ణి తాను ఇత‌రాల చేత ఆక‌ర్షింప‌బ‌డ‌కుండా ఇనుమును తాను ఆక‌ర్షిస్తుందో అదే విధంగా తాను నిర్వికారిమై బుద్ధ్యాదుల‌ను సైతం చ‌లింప‌చేస్తున్న‌న‌దో దానిని ఆత్మ‌వాచ్య‌మైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యం వ‌ల‌న జ‌డాలైన దేహేంద్రియాలు, మ‌న‌సు, ప్రాణం భాస‌మానాల‌వుతున్నాయో అదే జ‌న‌న‌మ‌ర‌ణ ర‌హిత‌మైన ఆత్మ‌. ఏదైతే నిర్వికార‌మై నిద్రాజాగ్ర‌త్ స్వ‌ప్పాదుల‌ను, వాటి ఆద్యంతాల‌ను గ్ర‌హిస్తోందో అదే నేను. ఘ‌టాన్ని ప్ర‌కాశింప‌చేసే దీపం ఘ‌టిత‌మైన‌ట్టే దేహేత‌ర‌మైన నేను అన‌బ‌డే ఆత్మ చేత‌నే దేహాతుల‌న్నీ భాస‌మానాల‌వుతాయి. స‌మ‌స్తం ప‌ట్ల ఏర్ప‌డుతూ ఉండే అనూహ్య‌, అగోచ‌ర ప్రేమైక ఆకార‌మే నేను. దేహేంద్రియ మ‌నః ప్రాణాహంకారాల క‌న్నా విభిన్న‌మైన‌ది -జ‌నిత‌త్వ‌, అస్తిత్వ‌, వృద్ధిగ‌త‌త్వ‌, ప‌రిణామ‌త్వ‌, క్షీణ‌త్వ‌, నాశంగ‌త‌త్వాల‌నే ష‌డ్వికారాలూ లేనిదే ఆత్మ‌. అదే నీవు. ఆ నీవే నేను. నేనే నీవుగా త్వ‌మేవాహంగా భావించాలి. ఈ విధంగా త్వం (నీవు అనే ప‌దార్ధ జ్ఞానాన్ని పొంది దాని కార‌ణంగా వ్యాపించే స్వ‌భావం వ‌ల‌న సాక్షాద్విముఖంగా త‌చ్ఛ‌బ‌ద్దార్ధాన్ని గ్ర‌హించాలి. (త‌త్ శ‌బ్దానికి బ్ర‌హ్మ అని అర్ధం)

శ్లో - అత‌ద్వ్యావృత్తిరూపేణ సాక్షాద్విధి ముఖేన‌చ‌
వేదాంతానాం ప్ర‌వృత్తిస్యాత్ ద్విరాచార్య సుభాషితం
అతః శ‌బ్దానికి బ్ర‌హ్మ‌ణ్య‌మైన ప్ర‌పంచ‌మ‌ని అర్ధం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇదీ కాదు ఒక‌టొక‌టిగా ప్ర‌తీ దానినీ కొట్టి పారేయ‌డం. అంటే బ్ర‌హ్మ ఆత్మ కాదు, కాలు ఆత్మ కాదు అనుకుంటూ స‌ర్వావ‌యేంద్రియ సంపూర్ణ దేహాన్ని కూడా ఇది కాదు అనుకుంటూ ఇది కాక‌పోతే మ‌రి అది ఏది అని ప్ర‌శ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్ర‌హ్మ లేదా ఆత్మ‌. ఇక సాక్షాద్విధిముఖాత్ అంటే స‌త్యం జ్ఞానం అనంతం బ్ర‌హ్మ అనే వాక్యాల ద్వారా స‌త్య‌త‌, జ్ఞానం, ఆనందం వ‌ల‌నే ఆత్మ‌ను తెలుసుకోవాలి అని అర్ధం. ఆ ఆత్మ సంసార‌ల‌క్ష‌ణావేష్టితం కాద‌ని, స‌త్య‌మ‌ని, ప్ర‌జ్ఞాది ల‌క్ష‌ణ యుత‌మ‌నీ, ప‌రిపూర్ణ‌మ‌ని పూర్వోక్త సాధ‌న‌ల వ‌ల‌న తెలుసుకో. దేనినైతే స‌ర్వ‌జ్ఞం ప‌రేశం సంపూర్ణ శ‌క్తివంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్ర‌హ్మ నేను. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ‌. అదే నువ్వు. అదే నేను. త‌ద‌నుప్ర‌విశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జ‌గ‌త్ ప్ర‌వేశ‌మూ ప్ర‌వేశ జీవుల‌ను గురించిన నియంతృత్వం, క‌ర్మ‌ఫ‌ల‌ప్ర‌ద‌త్వం స‌ర్వ‌జీవ‌కార‌ణ క‌ర్తృత్వం దేనికైతే సాధ్య‌మో అదే బ్ర‌హ్మ‌. త‌త్వ‌మ‌సి = త‌త్ అంటే బ్ర‌హ్మ లేదా ఆత్మ‌త్వం. అంటే నువ్వే, నువ్వే అంటే ప‌ర‌బ్ర‌హ్మం అని అర్ధం. ఓ జిజ్ఞాసూ ఆద్య‌యానంద ప‌ర‌మాత్మ‌యే ప‌త్య‌గాత్మ‌. ఈ ప్ర‌త్య‌గాత్మే ఆ ప‌ర‌మాత్మ‌. ఈ ప్ర‌కార‌మైన తాదాత్మ్య‌త ఏ నాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్ర‌మే త‌త్ శ‌బ్దార్ధం త‌నేన‌ని, త్వం శ‌బ‌ద్దం సాధ‌న‌మే గాని ఇత‌రం కాద‌ని అవ‌గ‌త‌మైపోతుంది.
నీకు మ‌రింత స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వ‌డం  కోసం మ‌రింత‌గా వివ‌రిస్తాను.
త‌త్వ‌మ‌సి = త‌త్‌+త్వం+అసి.  అంటే తాదాత్మ్యం. ఇందులో వాక్యార్ధాలైన కించిజ్ఞ‌త్వ‌, స‌ర్వ‌జ్ఞ‌తా  విశిష్టులైన జీవేశ్వ‌రుల‌ను ప‌క్క‌న పెట్టి ల‌క్ష్యార్ధాలైన ఆత్మ‌ల‌నే గ్ర‌హించిన‌ట్ట‌యితే తాదాత్మ్యం సిద్ధిస్తుంది. (ముఖ్యార్ధ వేధా శంక తొల‌గించుకునేందుకు ల‌క్ష‌ణావృత్తి చ‌ద‌వాలి). అందులో భాగ‌ల‌క్ష‌ణ అనే దాని వ‌ల‌న ఇది సాధింప‌బ‌డుతూ ఉంటుంది. (ఉదా :  సో2యం దేవ‌ద‌త్తః ఆత్మ‌సంప‌న్నః) అహం బ్ర‌హ్మా2స్మి అనే వాక్యార్ధ బోధ స్థిర‌ప‌డే వ‌ర‌కు కూడా శ‌మ‌ద‌మాది సాధ‌న సంప‌త్తితో శ్ర‌వ‌ణ మ‌న‌నాదికాల‌ను ఆచ‌రించాలి. ఎప్పుడైతే శ్రుతి వ‌ల్ల‌నో, గురు క‌టాక్షం వ‌ల్ల‌నో తాదాత్మ్య బోధ సిద్ధ‌ప‌డుతుందో అప్పుడీ వ‌ర్త‌మాన సంసార లంప‌టం దానిక‌దే పుటుక్కున తెలిగ‌పోతుంది. అయినా కొంత‌కాలం పాటు ప్రార‌బ్ధ క‌ర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్ష‌య‌మ‌వ‌డంతో పున‌రావృత్తిర‌హిత‌మైన స్థాయిని చేర‌తాము. దాన్నే ముక్తి లేదా మోక్షం అంటారు. అందువ‌ల‌న ముందుగా చిత్త‌శుద్ధి కోసం క‌ర్మిష్ఠులుగా ఉండి ఆ ఫ‌లాన్ని దైవార్ప‌ణం చేస్తూ ఉండ‌డం వ‌ల‌న ప్రార‌బ్ధాన్న‌నుస‌రించి ఆ జ‌న్మ‌లోనే గాని లేదా ప్రార‌బ్ధ క‌ర్మ ఫ‌లం అధిక‌మైతే మ‌రుజ‌న్మ‌లోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస‌ప‌రులై, జ్ఞానులై క‌ర్మ‌బంధాల‌ను తెంచుకుని ముక్తుల‌వుతారు.
నాయ‌నా బంధించేవి ఫ‌ల‌వాంఛిత క‌ర్మ‌లు (ఏదైనా ప్ర‌తిఫ‌లాన్ని ఆశించి చేసే క‌ర్మ‌లు). ముక్తినిచ్చేవి ఫ‌ల‌ప‌రిత్యాగ క‌ర్మ‌లు (ఏ ప్ర‌తిఫ‌లం ఆశించ‌కుండా చేసే క‌ర్మ‌లు) అని అంగీర‌సుడు సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చాడు.
స‌ప్త‌ద‌శాధ్యాయ స‌మాప్తః
--------------
అష్టాద‌శాధ్యాయం
అంగీర‌సుడు చెప్పింది వినిన ఆ దివ్య‌పురుషుడు క‌ర్మ‌యోగాన్ని గురించి అడుగుతాడు. దానికి స‌మాధానంగా అంగీర‌సుడిలా వివ‌రించాడు.
చ‌క్క‌ని విష‌యం అడిగావు. సుఖ‌దుఃఖాది ద్వంద్వాల‌న్నీ దేహానికే గాని ఆత్మ‌కు లేవు. ఎవ‌డైతే ఆత్మానాత్మ సంశ‌య‌గ్ర‌స్తుడో వాడు మాత్ర‌మే క‌ర్మ‌ల‌ను చేసి త‌ద్వారా చిత్త‌శుద్ధిని పొందిన‌వాడై ఆత్మ‌జ్ఞాని కావాలి. దేహ‌ధారి అయిన వాడు త‌న వ‌ర్ణాశ్ర‌మ విద్యుక్తాలైన స్నాన శౌచ‌కాది క‌ర్మ‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా చేసి తీరాలి.
శ్లో - స్నానేన‌ర‌హితం క‌ర్మ‌హ‌స్తి భుక్త క‌పిత్థ‌వ‌త్‌
ప్రాతః స్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శ్రుతిచోదితం
స్నానం చేయ‌కుండా చేసే ఏ క‌ర్మ అయినా స‌రే ఏనుగు తిన్న వెల‌గ‌పండులా నిష్ఫ‌ల‌మే అవుతుంది. అందునా బ్రాహ్మ‌ణుల‌కు ప్రాతఃకాల స్నానం వేదోక్త‌మై ఉన్న‌ది. 

ప్ర‌తీ రోజూ ప్రాతః స్నానం చేయ‌లేని వారు సూర్య‌సంచారం గ‌ల తులా-కార్తీక‌; మ‌క‌ర‌-మాఘ‌;  మేష‌-వైశాఖాల్లో అయినా చేయాలి. జీవితంలో ఈ మూడు మాసాలు ప్రాతః కాల స్నానం చేసిన వాడు స‌రాస‌రి వైకుంఠాన్నే పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్య‌కాలాల్లో గాని, చంద్ర‌సూర్య‌గ్ర‌హ‌ణ కాలాల్లో గాని స్నానం అత్యంత ప్ర‌ధానం. గ్ర‌హ‌ణ స‌మ‌యాల్లో గ్ర‌హ‌ణ‌కాల స్నానం త‌ప్ప‌నిస‌రి.స‌ర్వ‌కాలాల్లోను బ్రాహ్మ‌ణులు, పుణ్య‌కాలాల్లో స‌ర్వ ప్ర‌జ‌లు స్నాన సంధ్యా జ‌ప‌, హోమ సూర్య‌న‌మస్కారాలు త‌ప్ప‌నిస‌రిగా చేయాలి. స్నాన‌క‌ర్మ వ‌దిలిన‌వాడు రౌర‌వ న‌ర‌కంలో ప‌డి పునః క‌ర్మ‌భ్ర‌ష్టుడుగా జ‌న్మిస్తాడు. ఓ వివేక‌వంతుడా, పుణ్య‌కాలాల‌న్నింటిలోనూ స‌ర్వోత్త‌మ‌మైన‌ది కార్తీకం. వేదాన్ని మించిన శాస్త్రం, గంగ‌ను మించిన తీర్ధం, భార్య‌తో స‌మాన‌మైన సుఖం, ధ‌ర్మ‌తుల్య‌మైన స్నేహం, కంటి కంటే వెలుగు లేన‌ట్టుగానే కార్తీక మాసంతో స‌మాన‌మైన పుణ్య‌కాలం గాని, కార్తీక దామోద‌రుని క‌న్నా దైవం గాని లేరు. క‌ర్మ‌మ‌ర్మాన్ని తెలుసుకుని కార్తీకంలో ధ‌ర్మాన్ని ఆచ‌రించే వాడు వైకుంఠం చేర‌తాడు. నాయ‌నా విష్ణుమూర్తి ల‌క్ష్మీస‌మేతుడై ఆషాఢ శుక్ల‌ద‌శ‌మ్యంతంలో పాల‌స‌ముద్రాన్ని చేరి నిద్రా మిష‌తో శ‌య‌నిస్తాడు. పునః హ‌రిబోధిని అనే కార్తీక శుక్ల ద్వాద‌శినాడు నిద్ర లేస్తాడు. ఈ న‌డుమ నాలుగు మాసాల‌నే చాతుర్మాస్యాలంటారు. విష్ణుమూర్తి నిద్రాసుఖ‌ప్ర‌ద‌మైన ఈ నాలుగు నెల‌లూ ఎవ‌రైతే హ‌రిధ్యానం, పూజ‌లు చేస్తుంటారో వారి పుణ్యాలు అనంత‌మై విష్ణులోకాలు పొందుతారు. ఈ విష‌య‌మై ఒక పురాణ ర‌హ‌స్యాన్ని చెబుతాను విను. 

ఒకానొక కృత‌యుగంలో విష్ణుమూర్తి ల‌క్ష్మీసమేతుడై వైకుంఠ సింహాస‌నాన్ని అధిష్టించి ఉండ‌గా నార‌దుడు అక్క‌డ‌కు వెళ్లి వారికి మొక్కి హే శ్రీ‌హ‌రీ, భూలోకంలో వేద‌విధులు అడుగంటాయి. జ్ఞానులు సైతం గ్రామ్య సుఖాల‌కు లోనైపోతున్నారు. ప్ర‌జలంతా విక‌ర్ములై ఉన్నారు. వారెలా ముక్తుల‌వుతారో తెలియ‌క నేను దుఃఖితుడ‌నై ఉన్నాను అని విన్న‌వించాడు.
నార‌దుని మాట‌ల‌ను విశ్వ‌సించిన నారాయ‌ణుడు స‌తీ స‌మేతంగా వృద్ధ బ్రాహ్మ‌ణ రూపం ధ‌రించి తీర్థ‌క్షేత్రాదులు, బ్రాహ్మ‌ణ ప‌రిష‌త్తులున్న ప‌ట్ట‌ణాల్లో ప‌ర్య‌టించ‌సాగాడు. కొంద‌రు ఆ దంప‌తుల‌కు అతిథి స‌త్కారాలు చేశారు. కొంద‌రు హేళ‌న చేశారు. ఇంకొంద‌రు ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌తిమ‌ల‌ను పూజిస్తూ ఈ పుణ్య‌దంప‌తుల‌ను తిర‌స్క‌రించారు. కొంద‌రు అభ్య‌క్ష్యాల‌ను భుజిస్తున్నారు. ఇలా ఒక‌టేమిటి, అతి త‌క్కువ పుణ్య‌కార్యాచ‌ర‌ణ‌లు, అత్య‌ధిక పాప‌కార్యాలు చేస్తూ ఉన్నారు. వారిని చూసిన శ్రీ‌హ‌రి ప్ర‌జోద్ధ‌ర‌ణ చింతనా మాన‌సుడై చ‌తుర్భుజాల‌తో, కౌస్తుభాది ఆభ‌ర‌ణాల‌తో య‌థారూపాన్ని పొంది ఉండ‌గా జ్ఞాన‌సిద్ధుడ‌మే ఋషి త‌న శిష్య‌గ‌ణ స‌మేతంగా వ‌చ్చి ఆయ‌న‌ను ఆరాధించి అనేక విధాలుగా స్తుతించాడు.
న‌వ‌మ దిన పారాయ‌ణ స‌మాప్తః

Tuesday, November 5, 2019

కార్తీక పురాణం- 8వ రోజు పారాయ‌ణం   (శుక్ల అష్ట‌మి రోజున‌)

పంచాద‌శాధ్యాయం

కార్తీక మాహాత్మ్యాన్ని మ‌రింత‌గా వివ‌రిస్తూ వ‌శిష్ఠ మ‌హ‌ర్షి ఇలా చెప్ప‌సాగాడు.
ఓ జ‌న‌క న‌రేంద్రా, కార్తీక మాసంలో ఎవ‌రైతే హ‌రి ముంద‌ర నాట్యం చేస్తారో వారు శ్రీ‌హ‌రి నివాసం పొందుతారు. కార్తీక ద్వాద‌శినాడు శ్రీ‌హ‌రికి దీప‌మాలార్ప‌ణ చేసే వారు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీక మాస శుక్ల ప‌క్ష సాయంకాల వేళ‌ల్లో విష్ణువును అర్చించే వారు స్వ‌ర్గ నాయ‌కుల‌వుతారు. ఈ నెల రోజులూ నియ‌మంగా విష్ణ్వాల‌యానికి వెళ్లి దైవ‌ద‌ర్శ‌నం చేసుకునే వారు సాలోక్య మోక్షం అందుకుంటారు. అలా గుడికి వెళ్లేట‌ప్పుడు వారు వేసే ఒక్కో అడుగుకు ఒక్కో అశ్వ‌మేథ య‌జ్ఞ ఫ‌లం పొందుతారు. కార్తీక మాసంలో అస‌లు విష్ణుమూర్తి గుడికి వెళ్ల‌ని వారు క‌చ్చితంగా రౌర‌వ న‌ర‌కానికో, కాల‌సూత్ర న‌ర‌కానికే వెళ్తారు. కార్తీక శుద్ధ ద్వాద‌శి నాడు చేసే ప్ర‌తీ స‌త్ర్కియ అక్ష‌య పుణ్యాన్ని, ప్ర‌తీ దుష్క‌ర్మ అక్ష‌య పాపాన్ని క‌లిగిస్తాయి. శుక్ల ద్వాద‌శినాడు విప్ర స‌హితుడై భ‌క్తితో గంధ పుష్పాక్ష‌త‌లు, ధూప‌దీప పాద భ‌క్ష్య నివేద‌న‌ల‌తో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేదే లేదు. కార్తీక శుద్ధ ద్వాద‌శినాడు శివాల‌యంలో గాని, కేశ‌వాల‌యంలో గాని ల‌క్ష దీపాల‌ను వెలిగించి స‌మ‌ర్పించే వారు విమానారూఢులై దేవ‌త‌ల‌తో స్తుతింప‌బ‌డుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీక మాసం నెల్లాళ్లూ దీపం పెట్ట‌లేని వారు శుద్ధ ద్వాద‌శి, చ‌తుర్ద‌శి, పౌర్ణ‌మి మూడు రోజులైనా దీపం పెట్టాలి. ఆవు పాలు పితికేందుకు ప‌ట్టేటంత స‌మ‌య‌మైనా దైవ‌స‌న్నిధిలో దీపం వెలిగించిన వారు పుణ్యాత్ముల‌వుతారు. ఇత‌రులు పెట్టిన దీపాన్ని ప్ర‌కాశింప‌చేసిన వారి పాపాలు ఆ దీపాగ్నిలోనే ద‌హించుకుపోతాయి. ఇత‌రులు ఉంచిన దీపం కొండెక్కిన‌ట్ట‌యితే దాన్ని తిరిగి వెలిగించే వారు ఘ‌న‌మైన పాపాల నుంచి కూడా త‌రించిపోతారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఒక క‌థ చెబుతాను విను.

ఎలుక దివ్య‌పురుషుడైన వృత్తాంతం
స‌ర‌స్వ‌తీ న‌దీ తీరంలో ఎంతో దీర్ఘ కాలం నుంచి పూజా పున‌స్కారాలు లేక శిథిల‌మైపోయిన విష్ణ్వాల‌యం ఒక‌టి ఉండేది. కార్తీక స్నానార్ధ‌మై స‌ర‌స్వ‌తీ న‌దికి వ‌చ్చి ఒక య‌తి ఆ గుడిని చూసి త‌న త‌పోధ్యానాల‌కు ఆ ఏకాంత ప్ర‌దేశం అనువుగా ఉంటుంద‌ని భావించి ఆ ప్రాంతాన్ని తుడిచి శుభ్రం చేశారు. నీరు చ‌ల్లాడు. స‌మీప గ్రామానికి వెళ్లి ప‌త్తి, నూనె 12 ప్ర‌మిద‌లు తెచ్చి దీపాలు వెలిగించి "నారాయ‌ణార్ప‌ణ‌మ‌స్తు" అనుకుని త‌న‌లో తాను ధ్యానం చేసుకోసాగాడు.

ఆ య‌తి ప్ర‌తీ రోజూ ఇలా చేస్తుండ‌గా ఎక్క‌డా ఆహారం దొర‌క్క ఆక‌లితో అల‌మ‌టిస్తున్న ఒక ఎలుక ఆ గుడిలోకి వ‌చ్చి ఆహారాన్వేష‌ణ‌లో విష్ణు విగ్ర‌హానికి ప్ర‌ద‌క్షిణంగా తిరిగి మెల్ల‌గా దీపాల ద‌గ్గ‌ర‌కు చేరింది. అప్ప‌టికే ఒక ప్ర‌మిద‌లో నూనె అయిపోవ‌డం వ‌ల‌న ఆరిపోయిన వ‌త్తి మాత్ర‌మే ఉంది. త‌డిగా ఉన్న ఆ వ‌త్తి నుంచి వ‌చ్చే నూనె వాస‌న‌కు భ్ర‌మ‌సిన ఎలుక అదేదో ఆహారంగా భావించి వ‌త్తిని నోట క‌రుచుకుని ప‌క్క‌నే వెలుగుతున్న మ‌రో దీపం ద‌గ్గ‌ర‌కు వెళ్లి ప‌రిశీలించ‌బోయింది. అప్ప‌టికే బాగా త‌డిసి ఆరిపోయి ఉన్నా వ‌త్తి కొన వెలుగుతున్న వ‌త్తికి త‌గ‌ల‌డంతో అగ్ని సంప‌ర్కమై వెల‌గ‌డంతో ఆ ఎలుక దాన్ని వ‌దిలేసింది. అది కూడా ప్ర‌మిద‌లో ప‌డ‌డంతో రెండు వ‌త్తులు చ‌క్క‌గా వెలుగ‌సాగాయి. రాజా కార్తీక శుద్ధ ద్వాద‌శి నాడు విష్ణు స‌న్నిధిలో ఒక య‌తీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా ఆ ఎలుక తిరిగి వెల‌గ‌డంతో పూర్వ‌పుణ్య‌వ‌శాన ఆ మూషికం ఆ రాత్రి గుడిలోనే ప్రాణం విడిచి దివ్య‌మైన పురుష శ‌రీరాన్ని పొందింది. 

అప్పుడు ధ్యానం నుంచి వెలుప‌లికి వ‌చ్చిన య‌తి ఆ అపూర్వ పురుషుని చూసి ఎవ‌రు నువ్వు, ఇక్క‌డికెందుకు వ‌చ్చావు అని అడిగాడు. ఆ పురుషుడు ఓ య‌తీంద్రా,నేను ఒక ఎలుక‌ను. కేవ‌లం గ‌డ్డిప‌ర‌క‌ల వంటి ఆహారంతో జీవించే వాడిని. అలాంటి నాకు ఇప్పుడీ దుర్ల‌భ‌మైన మోక్షం ఏ పుణ్యం వ‌ల‌న వ‌చ్చిందో తెలియ‌డంలేదు. పూర్వ‌జ‌న్మ‌లో నేనెవ‌రిని? ఏ పాపాలు చేయ‌డం వ‌ల‌న ఎలుక జ‌న్మం ఎత్తాను?? ఏ పుణ్యం వ‌ల‌న ఈ దివ్య‌దేహం పొందాను??? అంటూ త‌ప‌స్పంస‌న్నుడ‌వైన నీవే నాకు స‌రైన స‌మాధానం చెప్పు. నేను నీ శిష్యుడిని అంటూ అంజ‌లి ఘ‌టించి ప్రార్థించాడు. ఆ య‌తి త‌న జ్ఞాన నేత్రంతో అంతా ద‌ర్శించి ఇలా చెప్ప‌సాగాడు.

బాహ్లికోపాఖ్యానం

నాయ‌నా, పూర్వ‌జ‌న్మ‌లో నువ్వు జైమిని గోత్రంలో బాహ్లికుడ‌నే పేరిట బ్రాహ్మ‌ణుడుగా జ‌న్మించావు. బాహ్లిక దేశ‌వాస్త‌వ్యుడైన నువ్వు నిరంత‌రం సంసార పోష‌ణా ప‌రాయ‌ణుడ‌వై స్నాన సంధ్యాదుల‌ను వ‌దిలిపెట్టి, వ్య‌వ‌సాయం చేసుకుంటూ వైదిక క‌ర్మానుష్ఠానులైన విప్రుల‌ను నిందిస్తూ ఉండేవాడివి. దేవ‌తార్చ‌న‌ల‌ను విడిచి సంభావ‌నా లాల‌స‌తో శ్రాద్ధ భోజ‌నాలు చేస్తూ నిషిద్ధ దినాల్లో కూడా రాత్రింబ‌వ‌ళ్లూ తిన‌డ‌మే ప‌నిగా బ‌తికావు. చివ‌ర‌కు కాక‌బ‌లులు, వేద‌బ‌లులు కూడా భుజిస్తూ వేద‌మార్గాన్ని త‌ప్పావు. ఇంటి ప‌నుల కోసం ఒక దాసీ దాన్ని నిమ‌యించుకుని వ‌క్ర‌బుద్ధితో దాన్ని తాకుతూ, మాట్లాడుతూ, హాస్యాలాడుతూ నీ పిల్ల‌ల‌కు కూడా దాని చేత‌నే భోజ‌నాదులు పెట్టించావు. నువ్వు కూడా దాని చేతి కూటినే తింటూ అత్యంత హీనంగా ప్ర‌వ‌ర్తించావు. నీ కంటె దిగువ వారికి పాలు, పెరుగు, మ‌జ్జిగ‌, నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడ‌బెట్టావు. ధ‌నం మీద ఆశ‌తో కూతురిని కూడా ద్ర‌వ్యానికి విక్ర‌యించి వ‌దిలించుకున్నావు. ఆ విధంగా కూడ‌బెట్టిన‌దంతా భూమిలో దాచిపెట్టి అర్థంత‌రంగా మ‌ర‌ణించావు. ఆ పాపాల‌న్నింటి కార‌ణంగా న‌ర‌కాన్ని అనుభ‌వించి ఎలుక‌వై జ‌న్మ‌లు ఎత్తుతూ చివ‌రికి ఈ జీర్ణ దేవాల‌యంలో బాట‌సారులు దైవం కోసం స‌మ‌ర్పించిన దేవ‌ద్ర‌వ్యాన్ని కూడా అప‌హ‌రిస్తూ బ‌తికావు. ఈ రోజు మ‌హాపుణ్య‌వంత‌మైన కార్తీక శుద్ధ ద్వాద‌శి కావ‌డం, అదీ విష్ణుస‌న్నిధానం కావ‌డం వ‌ల‌న నీ ఎలుక రూపం పోయి ఈ మాన‌వ రూపం సిద్ధించింది అని వివ‌రించారు.

ఆ య‌తి చెప్పింది విని గ‌త జ‌న్మ‌కృత పాపాల‌కు ప‌శ్చాత్తాపం పొందిన వాడై ఆ య‌తి మార్గ‌ద‌ర్శ‌కంలో మ‌ర్నాటి నుంచి కార్తీక శుద్ధ త్ర‌యోద‌శి, చ‌తుర్ద‌శి, పౌర్ణ‌మి మూడు రోజులూ స‌ర‌స్వ‌తీ న‌దిలో పుణ్య‌స్నానం ఆచ‌రించాడు. ఆ పుణ్య‌ఫ‌లం వ‌ల‌న వివేక‌వంతుడై బ‌తికినంత కాలం ప్ర‌తీ ఏడాది కార్తీక వ్ర‌తాచ‌ర‌ణ చేస్తూ అంత్యంలో సాయుజ్య మోక్షం పొందాడు.కాబ‌ట్టి కార్తీక శుద్ధ ద్వాద‌శి నాడు స్నాన‌దాన పూజా దీపామాలార్ప‌ణం శ‌క్తి ఉన్నంత మేర‌కు ఆచ‌రించే వాడు శ్రీ మ‌హావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడ‌వుతాడు. పాప‌విముక్తుడై సాయుజ్యం పొందుతాడ‌న్న‌ది స‌త్యం.
పంచాద‌శాధ్యాయ స‌మాప్తః
-----------------

షోడ‌శోధ్యాయం
జ‌న‌క మ‌హారాజా, దామోద‌రున‌కు అత్యంత ప్రీతిక‌ర‌మైన ఈ కార్తీకం నెల‌రోజులూ నియ‌మంగా తాంబూల దానం చేసే వారు మ‌రుజ‌న్మ‌లో భూప‌తులుగా జ‌న్మిస్తారు. ఈ నెల‌లో పాడ్య‌మి నుంచి రోజుకొక్క దీపం విష్ణుస‌న్నిధిలో వెలిగించే వారు వైకుంఠ‌గాముల‌వుతారు. సంతాన‌వాంఛితుడు కార్తీక పౌర్ణ‌మి నాడు సంక‌ల్ప‌యుక్తంగా సూర్యుని ఉద్దేశించి స్నానాదులు చేయ‌డం వ‌ల‌న సంతాన‌వంతుల‌వుతారు. విష్ణుస‌న్నిధిలో కొబ్బ‌రికాయ‌ను ద‌క్షిణ తాంబూలాల‌తో దానం ఇచ్చిన వారికి వ్యాధి అనేదే సంక్ర‌మించ‌దు. దుర్మ‌ర‌ణాలు, సంతాన విచ్ఛేదాలు ఉండ‌వు.

స్తంభ రూపం
పౌర్ణ‌మి నాడు విష్ణు స‌న్నిధిన స్తంభ‌దీప ప్ర‌జ్వ‌ల‌నం చేయ‌డం వ‌ల‌న వైకుంఠ‌ప‌తిత్వం సిద్ధిస్తుంది. రాతితో గాని, కొయ్య‌తో గాని స్తంభం చేయించి దానిని విష్ణ్వాల‌యం ముందు పాతి దాని మీద శాలి ధాన్యం, వ్రీహి ధాన్యం, నువ్వులు పోసి, దానిపై దీపం పెట్టిన వారు హ‌రిప్రియుల‌వుతారు. ఈ స్తంభ‌దీపం చూసినంత మాత్రం చేత‌నే స‌మ‌స్త పాపాలు న‌శించిపోతాయి. ఈ దీపం పెట్టిన వాళ్ల‌కి వైకుంఠ‌ప‌తిత్వం సిద్ధిస్తుంది. ఇక దీపాన్ని దానం చేయ‌డం వ‌ల‌న క‌లిగే పుణ్యాన్ని వ‌ర్ణించ‌డం నా వ‌ల్ల అయ్యే ప‌ని కాదు. స్తంభ‌దీప మ‌హిమ తెలియ‌చేసే ఒక క‌థ చెబుతా విను అంటూ వ‌శిష్ఠుడు ఈ దిగువ క‌థ చెప్పాడు.

కొయ్య‌మొద్దుకు కైవ‌ల్య‌ప్రాప్తి

వివిధ వృక్ష‌జాతుల‌కు చెందిన మ‌హావృక్షాల‌తో అల‌రారే మ‌తంగ ముని ఆశ్ర‌మంలో ఒక విష్ణ్వాల‌యం ఉండేది. ఎంద‌రెంద‌రో మునులు ఆల‌యానికి వ‌చ్చి కార్తీక వ్ర‌తం స్వీక‌రించి శ్రీ హ‌రిని నెల రో్జులూ షోడ‌శోప‌చార పూజ‌ల‌తో అర్చిస్తూ ఉండే వారు. ఒకానొక కార్తీక మాసంలో వ‌చ్చిన మునివ‌ర్యుడు కార్తీకంలో విష్ణు స‌న్నిధిని స్తంభ దీపం పెట్ట‌డం వ‌ల‌న వైకుంఠం ల‌భిస్తుంద‌ని చెబుతాడు. ఈ రోజు కార్తీక పౌర్ణ‌మి గ‌నుక మ‌నంద‌రం కూడా ఈ విష్ణ్వాల‌యం ప్రాంగ‌ణంలో దీప స్తంభం వెలిగిద్దాం అని సూచించాడు. అందుకు స‌మ్మ‌తించిన ఋషులంద‌రూ ఆ గుడి ఎదుట‌నే కొమ్మ‌లు, క‌ణుపులు గ‌ల స్థూపాకార‌పు చెట్టుని ఒక స్తంభంగా త‌యారుచేసి శాలి వ్రీహిత‌ల స‌మేతంగా దానిపై నేతి దీపం వెలిగించి విష్ణువుకు అర్పించి పురాణ కాల‌క్షేపం చేయ‌సాగారు. అంత‌లోనే వారికి ఛ‌ట‌ఛ‌టారావాలు వినిపించాయి. వెన‌క్కి తిరిగి చూడ‌గా ఆ స్తంభం ఫ‌ట‌ఫ‌టారావాల‌తో నిలువునా ప‌గిలి నేల‌పై ప‌డిపోవ‌డం క‌నిపించింది. అందులో నుంచి ఒక పురుషాకారం బ‌య‌ట‌కు రావ‌డంతో మునులంద‌రూ "ఎవ‌రు నువ్వు, ఇలా స్థాణువుగా ఎందుకు ప‌డి ఉన్నావు" అని అడిగారు. 

అందుకు స‌మాధానంగా ఆ దివ్య‌పురుషుడు "ఓ మునివ‌రేణ్యులారా, నేను గ‌తంలో ఒక బ్రాహ్మ‌ణుడ‌ను. అయినా వేద‌శాస్త్ర ప‌ఠ‌న గాని, హ‌రిక‌థా శ్ర‌వ‌ణం గాని, క్షేత్ర సంద‌ర్శ‌న గాని చేసి ఎరుగ‌ను. అప‌రిమిత ఐశ్వ‌ర్యం గ‌ల నేను బ్రాహ్మ‌ణ ధ‌ర్మాన్ని వ‌దిలి రాజునై ప‌రిపాల‌న సాగిస్తూ దుష్ట‌బుద్ధితో ప్ర‌వ‌ర్తించే వాడిని. వేద‌పండితులు, ఆచార‌వంతులు, పుణ్యాత్ములు, ఉత్త‌ములు అయిన బ్రాహ్మ‌ణుల‌ను నీచాస‌నాల‌పై కూచుండ‌చేసి నేను ఉన్న‌తాస‌నంపై కూచునే వాడిని. ఎవ‌రికీ ఏ నాడు దాన‌ధ‌ర్మాలు చేయ‌లేదు. త‌ప్ప‌స‌రైన‌ప్పుడు మాత్రం ఇంతిస్తాను, అంతిస్తాను అని వాగ్దానం చేసే వాడినే త‌ప్ప ద్ర‌వ్యాన్ని మాత్రం ఇచ్చే వాడిని కాను. దేవ బ్రాహ్మ‌ణ ద్ర‌వ్యాల‌ను స్వంతానికే ఖ‌ర్చు చేసుకునే వాడిని. ఆ కార‌ణంగా దేహాంతాన న‌ర‌కానికి పోయి బాధ‌ల‌నుభ‌వించి ఆ త‌ర్వాత‌ 52 వేల సార్లు కుక్క‌గాను, 10 వేల సార్లు కాకిగాను, మ‌రో 10 వేల సార్లు తొండ‌గాను, కోటి జ‌న్మ‌లు చెట్టుగాను పుట్టాను. గ‌త కోటి జ‌న్మ‌లుగా ఇలా మొద్దు వ‌లె మారి కాలం గ‌డుపుతున్నాను. ఇంత‌టి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచ‌నం క‌లిగిందో, ఈ విశేష పురుష రూపం ఎలా వ‌చ్చిందో స‌ర్వ‌జ్ఞులైన మీరే చెప్పాలి" అన్నాడు.

ఈ కార్తీక వ్ర‌త ఫ‌లం ఎంతో అద్భుత‌మైన‌ది. మ‌న క‌ళ్ల ముంద‌రే ఈ కొయ్య‌కు ముక్తి క‌లిగింది క‌దా! అందునా కార్తీక పౌర్ణ‌మి నాడు స్తంభ దీపం పెట్ట‌డం స‌ర్వ‌త్రా శుభ‌ప్ర‌దం. మ‌నం పెట్టిన దీం వ‌ల‌న ఈ మొద్దు ముక్తి పొందింది. మొద్దైనా, మ్రానైనా కార్తీకంలో దైవ‌స‌న్నిధిని దీప‌రూపం వ‌హించ‌డం వ‌ల‌న దామోద‌రుని ద‌య పొంద‌డం త‌థ్యం అని చెప్పుకుంటున్న ఋషుల మాట‌లు అత‌ని చెవిన ప‌డ్డాయి. ఆ దివ్య‌పురుషుడు అయ్య‌లారా! దేహి ఎవ‌రు, జీవి ఎవ‌రు, జీవుడు దేని చేత ముక్తుడు, దేని చేత బ‌ద్ధుడు;  దేని చేత దేహుల‌కు ఇంద్రియాలు క‌లుగుతున్నాయో వివ‌రించండి అని అడిగాడు. ఆ తాప‌సుల్లో ఉన్న అంగీర‌స మ‌హాముని అత‌నికి ఇలా జ్ఞాన‌బోధ చేశాడు.
అష్ట‌మదిన పారాయ‌ణ స‌మాప్తః 

Monday, November 4, 2019

కార్తీక పురాణం- 7వ రోజు పారాయ‌ణం   (శుక్ల స‌ప్త‌మి రోజున‌)


త్ర‌యోద‌శాధ్యాయం
క‌న్యాదాన ఫ‌లం

ఓ మ‌హారాజా, ఎంత చెప్పినా త‌ర‌గ‌తి ఈ కార్తీక మ‌హాత్మ్య పురాణంలో కార్తీక మాసంలో చేయ‌వ‌ల‌సిన దాన‌ధ‌ర్మాల గురించి వివ‌రంగా చెబుతాను విను, అంటూ వ‌శిష్ఠుడు ఇలా చెప్ప‌సాగాడు. త‌ప్ప‌నిస‌రిగా చేయ‌వ‌ల‌సిన వానిని చేయ‌క‌పోవ‌డం వ‌ల‌న పాపాల క‌లిగించే కార్తీక ధ‌ర్మాల‌న్నీ నా తండ్రి అయిన బ్ర‌హ్మ‌దేవుడు నాకు చెప్పాడు.

జ‌న‌క‌రాజేంద్రా, ఈ కార్తీక మాసంలో క‌న్యాదానం, ప్రాతః కాల స్నానం, యోగ్యులైన బ్రాహ్మ‌ణ బాలున‌కు ఉప‌న‌య‌నం చేయించ‌డం, విద్యాదానం, వ‌స్త్రదానం, అన్న‌దానం ఎంతో ఫ‌లాన్ని అందిస్తాయి. బ్రాహ్మ‌ణ బాలునికి ఈ కార్తీక మాసంలో ఒడుగు చేయించి ద‌క్షిణ స‌మ‌ర్పించ‌డం వ‌ల‌న పూర్వ‌జ‌న్మ పాపాలు కూడా తొల‌గిపోతాయి. ఈ విధంగా సొంత ధ‌నంతో ఉప‌న‌య‌నం చేయించిన వ‌టువు చేసే గాయ‌త్రీ జ‌పం వ‌ల్ల దాతకు సంక్ర‌మించిన మ‌హాపాత‌కాలు కూడా న‌శించిపోతాయి. వంద రావి చెట్లు నాటించిన‌, వంద తోట‌ల‌ను వేయించిన‌, వంద నూతులు, దిగుడుబావులు త‌వ్వించిన పుణ్యాల‌న్నీ క‌లిపినా కూడా ఒక బ్రాహ్మ‌ణ బాలునికి ఉప‌న‌య‌నం చేయించినందు వ‌ల్ల క‌లిగే పుణ్యంలో 16 వంతుకు కూడా స‌రికావు.
శ్లో - మాఘ్యాం వైమాధ‌వే మాసి చోత్త‌మం ద‌త్వాతు బంధ‌నం
కార‌యిష్యంతి తే రాజ‌న్ దానం ద‌త్వాతు కార్తీకే
కార్తీకంలో ఉప‌న‌య‌న దానం చేసి త‌దుప‌రి వ‌చ్చే మాఘ‌మాసంలో గాని, వైశాఖ మాసంలో గాని ఉప‌న‌య‌నం చేయించాలి. సాధువులూ, శ్రోత్రియులూ అయిన బ్రాహ్మ‌ణ బాల‌కుల‌కు ఉప‌న‌య‌నం చేయించ‌డం వ‌ల‌న అనంత పుణ్యం ల‌భిస్తుంద‌ని ధ‌ర్మ‌వేత్త‌ల‌యిన మునులు చెప్పారు. అనంత పుణ్యం క‌లిగించే ఈ కార్యానికి కార్తీక మాసంలో సంక‌ల్పం చెప్పుకుని ఫ‌లానా వారికి నా ద్ర‌వ్యంతో ఉప‌న‌య‌నం చేయిస్తాను అని వాగ్దానం చేయ‌డం వ‌ల్ల క‌లిగే స‌త్ఫ‌లితాన్ని చెప్ప‌డం స్వ‌ర్గ‌లోక వాసుల‌కు కూడా సాధ్యం కాదు. 

జ‌న‌క‌న‌ర‌పాలా, ఇత‌రుల సొమ్ముతో చేసే తీర్థ‌యాత్ర‌లు, దేవ‌బ్రాహ్మ‌ణ స‌మారాధ‌న‌ల ఫ‌లం, పుణ్యం ఆ దాత‌ల‌కే చెందుతుంద‌న్న విష‌యం జ‌గ‌ద్విదితం.
శ్లో - క‌న్యాదానం తు కార్తిక్యాం యః కుర్యాద్భ‌క్తితో న‌ఘ‌
స్వ‌యం పాపైర్విముక్తః పితృణాం బ్రాహ్మ‌ణః ప‌ద‌మ్
కార్తీకంలో క‌న్యాదాన‌మాచ‌రించిన వాడు స్వ‌యంగా తాను త‌రించ‌డ‌మే కాకుండా త‌న పిత‌రులంద‌రికీ కూడా బ్ర‌హ్మ‌లోక ప్రాప్తిని క‌లిగించిన వాడ‌వుతాడు. ఇందుకు నిద‌ర్శ‌నంగా ఒక క‌థ చెబుతాను విను. 

సువీరోపాఖ్యాన‌ము
ద్వాప‌ర యుగంలో వంగ‌దేశాన దుర్మార్గుడైన సువీరుడ‌నే రాజు ఉండే వాడు. లేడి క‌న్నుల వంటి సోగ‌క‌న్నులు గ‌ల సుంద‌రాంగి అత‌ని భార్య‌. దైవ‌యోగం వ‌ల‌న సువీరుడు దాయాదుల‌చే ఓట‌మి పాలై రాజ్య‌భ్ర‌ష్ఠుడై సుంద‌రాంగితో స‌హా అడ‌వుల్లోకి పారిపోయి కంద‌మూలాల‌లో కాలం గ‌డిపే వాడు. ఆ స‌మ‌యంలోనే అత‌ని భార్య గ‌ర్భ‌వ‌తి అయింది. సువీరుడు న‌ర్మ‌దా న‌దీతీరంలో ప‌ర్ణ‌శాల నిర్మించాడు. ఆ ప‌ర్ణ‌శాల‌లోనే రాణి చ‌క్క‌ని కుమార్తెను ప్ర‌స‌వించింది. స‌ర్వ‌సంప‌ద‌లు శ‌త్రువుల పాలై అడ‌వులు ప‌ట్టి తిరుగుతూ కంద‌మూలాలు భుజిస్తూ బ‌తుకుతున్న ఈ రోజుల్లో రాణి క‌డుపు పంటి సంతానం క‌ల‌గ‌డం, పోష‌ణ‌కు చిల్లి గ‌వ్వ‌యినా లేని దుర్భ‌ర దారిద్ర్యం గురించే నిరంత‌రం త‌ల‌చుకుంటూ పూర్వ‌జ‌న్మ‌కృత పాప‌క‌ర్మ‌ల‌ని నిందించుకుంటూ అతి క‌ష్టం మీద ఆ కుమార్తెను సువీర దంప‌తులు పెంచుకోసాగారు. కాల‌గ‌మ‌నంలో సువీరుని కుమార్తె చ‌క్క‌గా ఎదిగి స్ఫుర‌ద్రూపి అయింది. అమిత లావ‌ణ్య సౌంద‌ర్యాల‌తో చూసే వారికి నేత్రానందం క‌లిగించేది. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఎంతో మ‌నోహ‌రంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆమెను త‌న‌కిచ్చి వివాహం చేయాల‌ని సువీరుని కోరాడు. ఋషిపుత్రా, ప్ర‌స్తుతం నేను ఘోర ద‌రిద్రంలో ఉన్నాను. క‌నుక నేను కోరినంత ధ‌నాన్ని క‌న్యాశుల్కంగా స‌మ‌ర్పించ‌గ‌లిగితే నీ కోరిక తీరుస్తాను అని సువీరుడు చెప్పాడు. ఆ పిల్ల మీద మ‌క్కువ వీడ‌లేని ఆ మునిబాల‌కుడు ఓ రాజా, నేను మునికుమారుడినైనందు వ‌ల‌న త‌క్ష‌ణ‌మే ఆ ధ‌నం ఇవ్వ‌లేను. త‌ప‌స్సు చేత‌, ఇత‌ర‌త్రా ధ‌నం సంపాదించి తెచ్చి ఇస్తాను. అంత‌వ‌ర‌కు ఈ బాలిక‌ను నా కోసం భ‌ద్ర‌ప‌రిచి ఉంచు అని కోరాడు. అందుకు సువీరుడు అంగీక‌రించ‌డంతో ఆ న‌ర్మ‌దా తీరంలోనే త‌పోనిష్ఠ‌లో కూచున్నాడు. అనూహ్య ధ‌న‌రాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికి అందించాడు. ఆ సొమ్ముకు సంతృప్తి చెందిన రాజు త‌మ ఇంటి ఆచారం ప్ర‌కారంగా త‌న కుమార్తెను ముని యువ‌కునికి ఇచ్చి ఆ అర‌ణ్యంలోనే క‌ల్యాణం జ‌రిపించాడు. ఆ బాలిక భ‌ర్త‌తో క‌లిసి వెళ్లిపోయింది. ఆ ద్ర‌వ్యంతో రాజు భార్య‌తో క‌లిసి సుఖంగా జీవించ‌సాగాడు. రాణి మ‌రోసారి గ‌ర్భ‌వ‌తి అయి ఈ సారి కూడా ఆడ‌పిల్ల‌కే జ‌న్మ‌నిచ్చింది. పెద్ద‌పిల్ల‌ను అమ్మి ధ‌నం సంపాదించిన‌ట్టే ఈ బాలిక ద్వారా కూడా మ‌రింత ద్ర‌వ్యం సంపాదించ‌వ‌చ్చున‌ని సువీరుడు ఆనంద‌ప‌డ్డాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది.

ఒక య‌తీశ్వ‌రుడు న‌ర్మ‌దా స్నానానికి వ‌చ్చి అక్క‌డ ప‌ర్ణ‌శాల‌లో సువీరుని, అత‌ని భార్య‌ను, కుమార్తెను చూసి "ఓయీ, నేను కౌండిన్య గోత్ర‌జుడైన య‌తిని. ఈ అర‌ణ్య ప్రాంతంలో సంసారం ఉంటున్న నీవెవ‌రివి" అని అడిగాడు.
అయ్యా, "నేను వంగ‌దేశాధీశుడ‌నైన సువీరుడిని. దాయాదుల వ‌ల‌న రాజ్య‌భ్ర‌ష్టుడ‌నై ఇలా అడ‌విలో నివ‌శిస్తున్నాను అయి సువీరుడు స‌మాధానం ఇచ్చాడు.
శ్లో - న దారిద్ర్యం స‌మం దుఃఖం న శోకః పుత్ర‌మార‌ణాత్‌
న‌చ వ్య‌ధానుగ‌మ‌నేన వియోగః ప్రియాప‌హాత్‌

దరిద్రం క‌న్నా ఏడిపించేది, కొడుకు చావు క‌న్నా ఏడ‌వ‌వ‌ల‌సింది, భార్యా (రాజ్యం, భార్య‌) వియోగం క‌న్నా బ‌య‌ట‌కు ఏడ‌వ‌లేని దుఃఖం ఇంకేమీ ఉండ‌దు. త‌మ‌కు తెలిసిన‌దే క‌దా, ప్ర‌స్తుతం నేను ఆ విధ‌మైన మూడు ర‌కాల విచారాల వ‌ల‌న అమిత దుఃఖితుడ‌నై అమిత దుఃఖితుడ‌నై కంద‌మూలాలు భుజిస్తూ ఈ అర‌ణ్య‌మే ఆశ్ర‌యంగా జీవిస్తున్నాను. అర‌ణ్యంలోనే తొలి చూలుగా ఒక కుమార్తె జ‌న్మించింది. ఆమెను ఒక మునికుమారునికి విక్ర‌యించి ఆ ధ‌నంతో ప్ర‌స్తుతం సుఖంగానే బ‌తుకుతున్నాను. ఇది నా రెండ‌వ కుమార్తె, ఈమె నా భార్య‌. నా గురించి ఇంకా ఏ వివ‌రాలు కావాలో అడిగితే చెబుతాను" అన్నాడు సువీరుడు.

సువీరుని స‌మాధానానికి ఆశ్చ‌ర్య‌పోతూ ఆ య‌తీంద్రుడు ఓ రాజా, ఎంత ప‌ని చేశావు. మూర్ఖుడ‌వై అగ‌ణిత‌మైన పాపాన్ని మూట‌గ‌ట్టుకున్నావు.
శ్లో - క‌న్యాద్ర‌వ్యేణ యో జీవే వ్ర‌తం స‌గ‌చ్ఛ‌తి
దేవాన్ ఋషీన్ పిత్రూన్ క్యాపి క‌న్యా ద్ర‌వ్యేణ త‌ర్ప‌యేత్
శాపం దాస్యంతి తే స‌ర్వే జ‌న్మ‌జ‌న్మ‌న్య పుత్ర‌తామ్
ఆడ‌పిల్ల‌ని అమ్ముకుని అలా వ‌చ్చిన డ‌బ్బుతో జీవించే వారు మ‌ర‌ణానంత‌రం అశివ్ర‌తం అనే న‌ర‌కం పాల‌వుతారు. ఆ సొమ్ముతో దేవ‌, ఋషి, పితృ గ‌ణాల‌కు చేసిన అర్చ‌న త‌ర్ప‌ణాదుల వ‌ల‌న ఆ దేవ ఋషీ పిత్రాదులంద‌రూ కూడా న‌ర‌కాన్ని చ‌వి చూస్తారు. అంతే కాదు, క‌ర్త‌కు జ‌న్మ‌జ‌న్మ‌ల‌కు కూడా పుత్ర సంతానం క‌లుగ‌కూడ‌ద‌ని శ‌పిస్తారు. ఇక ఇలా ఆడ‌పిల్ల‌ని అమ్ముకుని జీవించ‌డ‌మే వృత్తిగా పెట్టుకున్న వారు క‌చ్చితంగా రౌర‌వ న‌ర‌కంలో ప‌డ‌తారు.
శ్లో - స‌ర్వేషామేవ పాపానాం ప్రాయ‌శ్చిత్తం విదుర్భుదాః
క‌న్యావిక్ర‌య శీల‌స్య ప్రాయ‌శ్చిత్తం న చోదిత‌మ్
అన్ని ర‌కాల పాపాల‌కూ ఏవో కొన్ని ప్రాయ‌శ్చిత్తాలున్నాయి. కాని క‌న్యాశుల్కం అనే పేరుతో వ్య‌వ‌హారంలో ఉన్న ఆడ‌పిల్ల‌ని అమ్ముకునే మ‌హాపాపిని ఒడ్డుకు చేర్చ‌గ‌ల ప్రాయ‌శ్చిత్తం ఏ శాస్త్రంలోనూ లేదు.
కాబ‌ట్టి సువీరా ఈ కార్తీక మాసంలో శుక్ల‌ప‌క్షంలో నీ రెండ‌వ కుమార్తెకు క‌న్యాదాన పూర్వ‌కంగా క‌ల్యాణం జ‌రిపించు. కార్తీక మాసంలో విద్యాతేజ‌శ్వీల యుక్తుడైన వ‌రునికి క‌న్యాదానం చేసిన వాడు గంగాది స‌మ‌స్త తీర్ధాల‌లోనూ స్నాన‌దానం చేయ‌డం వ‌ల‌న క‌లిగే పుణ్యాన్నీ, య‌థోక్త ద‌క్షిణాయుతంగా అశ్వ‌మేథాది యాగాలు చేసిన వారు పొందే స‌త్ ఫ‌లితాన్నీ పొందుతాడు అని హిత‌బోధ చేశాడు.

కాని నీచ‌బుద్ధి గ‌ల ఆ సువీరుడు ఆ స‌జ్జ‌నుని స‌ద్బోధ‌ను కొట్టిపారేస్తూ బాగా చెప్పావ‌య్యా బాప‌డా, పుట్టినందుకు పుత్ర‌దారా గృహ క్షేత్ర వాసోవ‌సు ర‌త్నాద్య‌లంకారాదుల‌తో ఈ శ‌రీరాన్ని పుష్టిప‌ర‌చి సుఖించాలే గాని ధ‌ర్మం ధ‌ర్మం అంటూ కూచుంటే ఎలా? అస‌లు ధ‌ర్మ‌మంటే ఏమిటి, దాన‌మంటే ఏమిటి, ఫ‌ల‌మంటే ఏమిటి, పుణ్య‌లోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారూ ఏదో ర‌కంగా డ‌బ్బు సంపాదించి భోగాలు అనుభ‌విచండ‌మే ప్ర‌ధానం. పెద్ద‌పిల్ల కంటె అధికంగా ధ‌నం ఇచ్చే వాడికే నా చిన్న పిల్ల‌ను ఇచ్చి పెళ్లి చేసి న‌ను కోరుకునే సుఖ‌భోగాల‌న్నీ అనుభ‌విస్తాను. అయినా నా విష‌యాల‌న్నీ నీకెందుకు, నీ దారిన నువ్వెళ్లు అని క‌సిరి కొట్టాడు.
అంత‌టితో ఆ తాప‌సి త‌న దారిన తాను వెళ్లిపోయాడు. 


శృత‌కీర్త్యుపాఖ్యానం 
ఈ సువీరుని పూర్వీకుల్లో శృత‌కీర్తి అనే రాజొక‌డున్నాడు. స‌మ‌స్త ధ‌ర్మాలు ఆచ‌రించాడు. శ‌తాధిక యాగాలు చేశాడు. ఆ పుణ్య‌కార్యాల వ‌ల‌న స్వ‌ర్గంలో ఇంద్రాదుల చేత గౌర‌వం పొందుతూ స‌మ‌స్త సుఖాలు అనుభ‌విస్తున్నాడు.

సువీరునికి య‌ముడు విధించిన శిక్ష కార‌ణంగా య‌మ‌దూత‌లు స్వ‌ర్గం చేసి అక్క‌డ సుఖిస్తున్న శృత‌కీర్తి జీవానికి పాశ‌బంధం వేసి న‌ర‌కానికి తీసుకువ‌చ్చారు. ఆ చ‌ర్య‌కు ఆశ్చ‌ర్య‌ప‌డిన శృత‌కీర్తి య‌ముని ముంగిట నిల‌బ‌డి స్వ‌ర్గంలో ఉన్న న‌న్ను ఇక్క‌డికెందుకు ర‌ప్పించావు, నేను చేసిన పాప‌మేమిటి? అని నిల‌దీశాడు. 

మంద‌హాసం చేస్తూ ఆ య‌మ‌ధ‌ర్మ‌రాజు "శృత‌కీర్తీ, నువ్వు పుణ్యాత్ముడ‌మే, స్వ‌ర్గార్హుడ‌వే. కాని నీ వంశంలోనే జ‌న్మించిన సువీరుడు క‌న్య‌ను విక్ర‌యించి మ‌హాపాపి అయ్యాడు. అత‌ను చేసిన మ‌హాపాపం వ‌ల‌న అత‌ని వంశీకులైన మీరంగా న‌ర‌కానికి రావ‌ల‌సివ‌చ్చింది. అయినా వ్య‌క్తిగ‌తంగా అత్య‌ధిక పుణ్యాత్ముడ‌వి కావ‌డం వ‌ల‌న నీకొక అవ‌కాశం ఇస్తున్నాను. ప‌ర‌మ పాప‌కృత్యం చేసిన సువీరుని రెండో కుమార్తె న‌ర్మ‌దా న‌దీ తారంలోని ప‌ర్ణ‌శాల‌లో త‌ల్లితో క‌లిసి జీవిస్తోంది. ఆ బిడ్డ‌కింకా వివాహంకాలేదు. అనుగ్ర‌హం వ‌ల‌న భూలోక వాసులు గుర్తించే దేహం పొంది అక్క‌డ‌కు వెళ్లి ఆమెను యోగ్యుడైన వ‌రునికి క‌న్యాదాన‌యుక్తంగా దానం చేయి. శృత‌కీర్తీ, ఎవ‌రైతే కార్తీక మాసంలో స‌ర్వాలంకార భూషిత అయిన క‌న్య‌ను యోగ్యుడైన వ‌రునికి దానం చేస్తాడో వాడు లోకాధిప‌తితో స‌మానం అవుతాడు. అలా క‌న్యాదానం చేయాల‌నే సంక‌ల్పం ఉండి సంతానం లేని వాడు బ్రాహ్మ‌ణ క‌న్యాదానానికి గాని, క‌న్యాదానం చేయ‌బోతున్న బ్రాహ్మ‌ణునికి గాని ధ‌న‌స‌హాయం చేసిన‌ట్ట‌యితే అత‌డు క‌న్యాదాత పొందే ఫ‌లాన్ని పొందుతాడు. అంతే కాదు, స్వ‌లాభాపేక్ష‌ర‌హితుడై రెండు పాడి ఆవుల‌ను చెల్లించి ఒక క‌న్య‌ను కొని ఆ క‌న్య‌ను ఆమెను చక్క‌ని వ‌రునికి ఇచ్చి వివాహం చేసినా కూడా క‌న్యాదాన ఫ‌లాన్ని పొందుతాడు. కాబ‌ట్టి శృత‌కీర్తీ, నువ్వు త‌క్ష‌ణ‌మే భూలోకానికి వెళ్లి సువీరుని రెండో కుమార్తెను ఎవ‌రైనా స‌ద్ర్బాహ్మ‌ణునికి క‌న్యాదాన మూలంగా దానం చేసిన‌ట్ట‌యితే నువ్వు, నీ పూర్వీకులు, ఈ సువీరుడు కూడా న‌ర‌కం నుంచి విముక్తుల‌వుతారు" అని చెప్పాడు. 

ధ‌ర్ముని అనుగ్ర‌హం వ‌ల‌న దేహం ధ‌రించిన శృత‌కీర్తి వెంట‌నే భూలోకంలోని న‌ర్మ‌దా న‌దీతీరాన్ని చేరి అక్క‌డ ప‌ర్ణ‌శాల‌లో ఉన్న సువీరుని భార్య‌కు హిత‌వు చెప్పి వారి రెండో సంతాన‌మైన ఆడ‌పిల్ల‌ని సువ‌ర్ణాలంకార భూషిత‌ను చేసి శివ‌ప్రీతిగా శివార్ప‌ణ‌మ‌స్తు అంటూ ఒక బ్రాహ్మ‌ణునికి క‌న్యాదానం చేశాడు. ఆ పుణ్య మ‌హిమ వ‌ల‌న సువీరుడు న‌ర‌క‌పీడా విముక్తుడై, స్వ‌ర్గానికి చేరి సుఖించ‌సాగాడు. ఆ త‌ర్వాత శృత‌కీర్తి ప‌ది మంది బ్ర‌హ్మ‌చారుల‌కు క‌న్యామూల్యాన్ని ధార పోయ‌డం వ‌ల‌న వారివారి పితృపితామ‌హాదివ‌ర్గాల వారంతా ప‌రిపూర్ణంగా పాపాల నుంచి విముక్తులై స్వ‌ర్గాన్ని పొందారు. ఆ త‌ర్వాత శృత‌కీర్తి కూడా య‌థాపూర్వంగా స్వ‌ర్గం చేరి త‌న వారిని క‌లిసి సుఖించ‌సాగాడు. కాబ‌ట్టి ఓ జ‌న‌క మ‌హారాజా కార్తీక మాసంలో క‌న్యాదానం చేసే వాడు స‌ర్వ‌పాపాలు న‌శింప‌చేసుకుంటాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. క‌న్యామూలాన్ని చెల్లించ‌లేని వాడు వివాహార్ధం మాట స‌హాయం చేసినా కూడా అమిత‌మైన పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవ‌రైతే కార్తీక మాసంలో య‌థావిధిగా కార్తీక వ్ర‌తాన్ని ఆచ‌రిస్తారో వారు స్వ‌ర్గాన్ని చేరుతార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే కార్తీక వ్ర‌తం ఆచ‌రించ‌ని వారు న‌ర‌కానికి చేర‌డం కూడా ఖాయ‌మే.
త్ర‌యోద‌శాధ్యాయ స‌మాప్తః
---------------

చ‌తుర్ద‌శాధ్యాయం
ఓ మిథిలాధీశా, కార్తీక మాస‌మంతా పూర్వోక్త స‌ర్వ‌ధ‌ర్మ సంయుతంగా కార్తీక వ్ర‌తాన్ని ఆచ‌రించ‌లేక‌పోయినా కార్తీక పౌర్ణ‌మి నాడు వృషోత్స‌ర్గం చేసిన వారి జ‌న్మాంత‌ర పాపాల‌న్నీ కూడా న‌శించిపోతాయి.
వృషోత్స‌ర్గ‌ము
జ‌న‌క మ‌హీపాలా, దేశ‌వాళి గోవుకు జ‌న్మించిన కోడెదూడ‌ను అచ్చుబోసి ఆంబోతుగా వ‌ద‌ల‌డాన్నే వృషోత్స‌ర్గం అంటారు. ఈ మాన‌వ లోకంలో ఏ ఇక‌ర క‌ర్మాచ‌ర‌ణ‌ల వ‌ల‌న కూడా సాధ్యం కాని పుణ్యం ప్ర‌సాదించే ఈ కార్తీక మాసంలోనే పూర్ణిమ నాడు పితృదేవ‌తా ప్రీతికోసం ఒక కోడెదూడ‌ను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛ‌గా వ‌ద‌లాలి. అలా చేయ‌డం వ‌ల‌న గ‌యాక్షేత్రంలో కోటి సార్లు పితృదేవ‌త‌ల‌కు శ్రాద్ధ‌క‌ర్మ నిర్వ‌హించిన పుణ్యం క‌లుగుతుంది.
శ్లో - యః కోవాస్మ‌త్కులే జాతః పౌర్ణ‌మాస్యాంతు కార్తీకే
ఉత్ప్ర‌జేద్వృష‌భం నీలం తేన తృప్తా వ‌యంత్వితి
కాంక్షంతి నృప‌శార్దూల పుణ్య‌లోక స్థితా అపి
పుణ్య‌లోకాల్లో ఉన్న పిత‌రులు కూడా త‌మ కులంలో పుట్టిన వాడెవ‌రైనా కార్తీక పౌర్ణ‌మినాడు న‌ల్ల‌ని గిత్త‌ను అచ్చుబోసి వ‌దిలిన‌ట్ట‌యితే మ‌న‌కు అమితానందం క‌లుగుతుంది క‌దా అని చింతిస్తూ ఉంటారు. రాజా, ధ‌నికుడై ఉండి కూడా జీవితంలో ఒక్క‌సారైనా కార్తీక మాసంలో వృష‌త్స‌ర్గం చేయ‌ని వాడు అంధ‌తామిస్రం అనే న‌ర‌కంలో ప‌డ‌తాడు. గ‌యాశ్రాద్ధం వ‌ల‌న గాని, ప్ర‌తివ‌ర్షాబ్ధి వ‌ల‌న గాని, తీర్థ‌స్థ‌లాల్లో త‌ర్ప‌ణం చేయ‌డం వ‌ల‌న గాని ఈ వృషోత్స‌ర్గంతో స‌మాన‌మైన ఆనందం పిత‌రులు పొంద‌లేర‌న్న‌ది తెలుసుకో. 

వివిధ దానాలు
కార్తీక మాసంలో పండ్ల‌ను దానం చేసే వాడు దేవ‌ర్షి పిత్రూణాల నుంచి విముక్తుడ‌వుతాడు. ద‌క్షిణాయుతంగా ధాత్రీ (ఉసిరిక‌) ఫ‌లాన్ని దాన‌మిచ్చే వాడు సార్వ‌భౌముడ‌వుతాడు. కార్తీక పౌర్ణ‌మి నాడు లింగ‌దానం స‌మ‌స్త పాప‌హ‌రం, అత్యంత పుణ్య‌దాయ‌కం. ఈ దానం వ‌ల‌న ఈ జ‌న‌మ‌లో అనేక భోగాలు అనుభ‌వించి మ‌రుజ‌న్మ‌లో చ‌క్ర‌వ‌ర్తిత్వం పొందుతాడు

నిషిద్ధాహారాలు
అనంత ఫ‌ల‌దాయ‌క‌మైన ఈ కార్తీక వ్ర‌తాచ‌ర‌ణా స‌ద‌వ‌కాశం అంద‌రికీ అంత తేలిక‌గా ల‌భించ‌దు. అమిత ఉత్కృష్ట‌మైన ఈ కార్తీక మాసంలో ఇత‌రుల అన్నం, పితృశేషం, తిన‌కూడ‌నివి తిన‌డం, శ్రాద్ధ‌క‌ర్మ‌ల‌కు భోక్త‌గా వెళ్ల‌డం, నువ్వుల దానం ప‌ట్ట‌డం మానివేయాలి. ఈ నెల‌లో సంఘాన్నం, శూద్రాన్నం, దేవార్చ‌న నాని అన్నం, అప‌రిశుద్ధాన్నం, త్య‌క్త‌క‌ర్ముని అన్నం కూడా తిన‌కూడ‌దు. కార్తీక పౌర్ణ‌మి, అమావాస్య‌ల్లో, పితృదినం నాడు, ఆదివారంనాడు, సూర్య‌చంద్ర గ్ర‌హ‌ణ దినాల్లోను వ్య‌తీపాద‌త వైదృత్యాలు నిషిద్ధం. ఈ నెల‌లో వ‌చ్చే ఏకాద‌శినాడు రాత్రిం బ‌వ‌ళ్లు రెండు పూట‌లా భోజ‌నం చేయ‌కూడ‌దు. ఈ రోజుల్లో ఛాయా న‌క్తం (అంటే త‌మ నీడ శ‌రీర‌పు కొల‌త‌కు రెండింత‌లుగా ప‌డిన‌ప్పుడు భోజ‌నం చేయ‌డం) ఉత్త‌మ‌మ‌ని మ‌హ‌ర్షులు చెప్పారు. ప‌ర‌మ ప‌విత్ర‌మైన ఈ కార్తీకంలో నిషిద్ధ దినాల్లో భోజ‌నం చేసే వారి పాపాలు అంతులేనంత‌గా పెరిగిపోతాయి. అందు వ‌ల‌న కార్తీకంలో తైలాభ్యంగ‌నం, ప‌గ‌టి నిద్ర‌, కంచుపాత్ర‌లో భోజ‌నం, ప‌రాన్న భోజ‌నం, గృహ‌స్నానం, నిషిద్ధ దినాల్లో రాత్రి భోజ‌నం, వేద‌శాస్త్ర నింద ఈ ఏడు క‌ర్మ‌లూ చేయ‌కూడ‌దు. స‌మ‌ర్థులై ఉండి కూడా న‌దీస్నానం చేయ‌కుండా ఇంటి ద‌గ్గ‌రనే వేడి నీటి స్నానం చేసిన‌ట్ట‌యితే అది క‌ల్లుతో చేసిన స్నానానికి స‌మాన‌మ‌ని బ్ర‌హ్మ‌శాస‌నం. సూర్యుడు తుల‌లో ఉండ‌గా న‌దీస్నాన‌మే అత్యంత ప్ర‌ధానం. చేరువ‌లో న‌దులు లేన‌ప్పుడు మాత్రం చెరువుల్లో గాని, కాలువ‌ల్లో గాని, నూతి వ‌ద్ద గాని గంగాగోదావ‌ర్యాది మ‌హాన‌దుల‌ను స్మ‌రించుకుంటూ స్నానం చేయ‌వ‌చ్చును. ఎక్క‌డ చేసినా ప్రాతఃకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయ‌ని వారు న‌ర‌కాన్ని పొంది అనంత‌రం ఛండాల‌పు జ‌న్మ‌నెత్తుతారు. గంగాన‌దీ స్మ‌ర‌ణం చేసి స్నానం చేసి సూర్య‌మండ‌ల‌గ‌తుడైన శ్రీ‌హ‌రిని ధ్యానించి ఆ విష్ణుగాథా పురాణాదులు ఆల‌కించి ఇంటికి వెళ్లాలి. ప‌గ‌లు చేయ‌వ‌ల‌సిన ప‌నుల‌న్నీ ముగించుకుని సాయంకాలం మ‌ర‌లా స్నానం చేసి ఆచ‌మ‌నం చేసి పూజాస్థానంలో పీఠం వేసి దాని మీద ఈశ్వ‌రుని ప్ర‌తిష్టించి పంచామృత‌, ఫ‌లోద‌క‌, క‌ల‌శోద‌కాల‌తో మ‌హాస్నానం చేయించి షోడ‌శోప‌చారాల‌తో పూజించాలి.

ప‌ర‌మేశ్వ‌ర షోడ‌శోప‌చార పూజావిధానం
మొద‌ట ప‌ర‌మేశ్వ‌రుడైన ఆ పార్వ‌తీ ప‌తిని ఆవాహ‌నం చేయాలి.ఆ త‌ర్వాత‌
ఓం వృష‌ధ్వ‌జాయ న‌మః - ధ్యానం స‌మ‌ర్ప‌యామి
ఓం గౌరీ ప్రియాయ న‌మః - పాద్యం స‌మ‌ర్ప‌యామి
ఓం లోకేశ్వ‌రాయ న‌మః - అర్ఘ్యం స‌మ‌ర్ప‌యామి
ఓం రుద్రాయ న‌మః - ఆచ‌మ‌నీయం స‌మ‌ర్ప‌యామి
ఓం గంగాధ‌రాయ న‌మః - స్నానం స‌మ‌ర్ప‌యామి
మంత్రం
ఆపోహిష్ఠామ‌యోభువః తాన ఊర్జేద‌థాత‌వ మ‌హేర‌ణాయ చ‌క్ష‌సే
యోవ‌శ్శివ‌త‌మోర‌సః త‌స్య భాజ‌య‌తే హ‌వః ఉశ‌తీర‌వ‌మాత‌రః
త‌స్మాద‌రంగ మావ‌వో యాస్య క్ష‌యాయ జిన్వ‌ధ ఆపోజ‌న‌య‌థాచ‌నః
ఈ మంత్రం ప‌ఠిస్తూ నీటితో అభిషేకించాలి.
ఓం ఆశాంబ‌రాయ న‌మః వ‌స్త్రం స‌మ‌ర్ప‌యామి
ఓం జ‌గ‌న్నాధాయ న‌మః ఉప‌వీతం స‌మ‌ర్ప‌యామి
ఓం క‌పాల‌ధారిణే న‌మః గంథం స‌మ‌ర్ప‌యామి
ఓం ఈశ్వ‌రాయ న‌మః  అక్ష‌తాన్ స‌మ‌ర్ప‌యామి
ఓం పూర్ణ‌గుణాత్మ‌నే న‌మః పుష్పం స‌మ‌ర్ప‌యామి
ఓం ధూమ్రాక్షాయ న‌మః ధూప‌మాఘ్రాప‌యామి
ఓం తేజోరూపాయ న‌మః దీపం స‌మ‌ర్ప‌యామి
ఓం లోక‌ర‌క్ష‌కాయ న్ః నైవేద్యం స‌మ‌ర్ప‌యామి
ఇలా పూజ నిర్వ‌హించిన అనంత‌రం
ఓం భూర్భువ‌స్సువః త‌త్స‌వితుర్వ‌రేణ్యం భ‌ర్గో దేవ‌స్య ధీమ‌హి థియో యోనః ప్ర‌చోద‌యాత్ అనుకుంటూ పువ్వుతో ప‌దార్థాల చుట్టూ నీరు ప్రోక్షించి ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం స‌మానాయ స్వాహా, ఓం మ‌హాదేవాయ శివ‌శివ‌శివ‌శివ శంభ‌వే స్వాహా అంటూ నివేద‌నం చేయాలి. అమృత‌మ‌స్తు, అమృతోప‌స్త‌ర‌ణ‌మ‌సి ఋతం స‌త్యేన ప‌రిషించామి, ఉత్త‌రాపోశ‌నం స‌మ‌ర్ప‌యామి అంటూ ప‌దార్థాల కుడివైపు ఒక నీటి చుక్క వ‌ద‌లాలి. ఆ త‌ర్వాత
ఓం లోక‌సాక్షిణే న‌మః తాంబూలం స‌మ‌ర్ప‌యామి
ఓం భ‌వాయ న‌మః ప్ర‌ద‌క్షిణం స‌మ‌ర్ప‌యామి
ఓం క‌పాలినే న‌మః న‌మ‌స్కారం స‌మ‌ర్ప‌యామి
ఇలా నెల‌పొడ‌వునా షోడ‌శోప‌చార పూజ చేయాలి.
పార్వ‌తీ కాంత దేవేశ ప‌ద్మ‌జార్చ్యాంఘ్రి పంక‌జ
అర్ఘ్యం గృహేణ దైత్యారే ద‌త్తం చేద ముమాప‌తే
అంటూ మంత్రం ఇవ్వాలి. అనంత‌రం య‌థాశ‌క్తి దీపాల‌ను స‌మ‌ర్పించి శ‌క్తివంచ‌న లేకుండా బ్రాహ్మ‌ణుల‌కు దానం ఇవ్వాలి. ఈ ప్ర‌కారం కార్తీక మాసం నెల రోజులూ బ్రాహ్మ‌ణ‌స‌మేతంగా న‌క్త వ్ర‌తం ఆచ‌రించే వాడు వంద వాజ‌పేయాలు, వెయ్యి వంతున సోమాశ్వ‌మేథాలు చేసిన ఫ‌లాన్ని పొందుతాడు. కార్తీక‌మాస‌మంతా న‌క్త‌వ్ర‌తాచ‌ర‌ణ వ‌ల‌న పుణ్య‌ధిక్య‌త‌, పాప‌నాశ‌నం అవ‌లీల‌గా ఏర‌ప‌డ‌తాయి. కార్తీక చ‌తుర్ద‌శినాడు పితృప్రీతిగా బ్రాహ్మ‌ణుల‌కు భోజ‌నం పెట్ట‌డం వ‌ల‌న పితృదేవ‌త‌లు సంతృప్తులు అవుతారు. కార్తీక శుద్ధ చ‌తుర్ద‌శినాడు ఔర‌స పుత్రుడు చేసే తిల‌త‌ర్ప‌ణం వ‌ల‌న పితృలోకం స‌ర్వం తృప్తి పొందుతుంది. ఈ చ‌తుర్ద‌శినాడు ఉప‌వాసం ఉండి శివారాధ‌న చేసి తిల‌లు దానం చేస్తే కైలాస క్షేత్రాధిప‌తి అవుతాడు. ఈ కార్తీక వ్ర‌తం ఆచ‌రించిన వారు త‌మ పాపాలు పోగొట్టుకున్న వారై మోక్ష‌గాముల‌వుతారు.
ఓ జ‌న‌క‌మ‌హారాజా, కార్తీక పురాణంలో ఈ ప‌దునాల్గ‌వ అధ్యాయాన్ని శ్ర‌ద్ధాభ‌క్తుల‌తో చ‌దివినా, విన్నా కూడా స‌మ‌స్త పాపాల‌కూ ప్రాయ‌శ్చిత్తం చేసుకోవ‌డం ద్వారా క‌లిగే ఫ‌లితాన్ని పొందుతారు.
స‌ప్త‌మ దిన పారాయ‌ణ స‌మాప్తః
--------------------------------



నోట్ - చ‌దివిన వారంద‌రూ అద్భుతం, చాలా బాగుంది, బాగుంది అనే రేటింగ్ బాక్స్ ల్లో ఏదో ఒక దాని మీద క్లిక్ చేసి రేటింగ్ ఇవ్వండి. ధ‌న్య‌వాదాలు

Friday, November 1, 2019

కార్తీక పురాణం- 5వ రోజు పారాయ‌ణం  (శుక్ల పంచ‌మి రోజున‌) 

న‌వ‌మాధ్యాయం
య‌మ‌దూత‌ల ప్ర‌శ్న‌ల‌కు విష్ణుదూత‌లు చిరున‌వ్వుతో ఇలా అన్నారు. "ఓ య‌మ‌దూత‌లారా, మేము విష్ణుదూత‌ల‌ము. మీ ప్ర‌భువు మీకు విధించిన ధ‌ర్మాలేమిటి, పాపాత్ములెవ‌రు, పుణ్యాత్ములెవ‌రు? య‌మ దండ‌మున‌కు అర్హులైన వారెవ‌రో అన్నీ విపులీక‌రించి చెప్పండి".

"సూర్య‌చంద్రాగ్నివాయురాకాశ గోసంధ్య‌లు, ద‌శ‌దిశాకాలాలూ వీనిని పాప‌పుణ్యాల‌కు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవ‌త‌లారా, శ్ర‌ద్ధ‌గా వినండి. వేద‌మార్గాన్ని విడిచి త‌ల్లిదండ్రుల‌తో క‌ల‌హించే వారు, అస‌త్య‌వాదులు, జంతు హింస చేసే వారు, దానం చేయ‌ని వారు, దానం చేసిన దాన్ని తిరిగి ఆశించే వారు, చేసిన దానాన్ని డాంబికంగా బ‌య‌ట‌పెట్టుకునే వారు, ఇత‌రులు చేసే దానాన్ని కూడా నిరోధించే వారు, ద‌యార‌హితులు, ప‌ర‌భార్యాసంగ‌ములు, మిత్ర‌ద్రోహానికి పాల్ప‌డే వారు, కృత‌ఘ్నులు, ఇత‌రుల పురుష సంత‌తిని చూసి ఏడ్చే వారు, క‌న్యాశుల్కంతో జీవించే వారు, త‌ల్లిదండ్రుల శ్రాద్ధ‌క‌ర్మ‌ల‌ను విడిచిపెట్టిన వారు, వాపీకూప‌త‌టాకాది నిర్మాణాల‌ను ఆటంక‌ప‌రిచే వారు, భోజ‌నం మీద త‌ప్ప మ‌రే ఆలోచ‌న లేని వారు, త‌ల్లిదండ్రుల శ్రాద్ధ క‌ర్మ‌ల‌ను విడిచిపెట్టే వారు, నిత్య స్నాన‌సంధ్యాదులు చేయ‌ని వారు, బ్రాహ్మ‌ణ‌, గో హ‌త్య‌లు చేసే వారు...ఇలాంటి వారంద‌రూ పాపాత్ములు. వారు య‌మ‌లోకంలో బ‌హుదండ‌న‌ల‌కు అర్హులు. ఇక ఈ అజామిళుడంటారా, వీడు చేయ‌ని పాప‌మంటూ ఏదీ లేదు. బ్రాహ్మ‌ణ జ‌న్మ ఎత్తి కూడా దాసీ సంగ‌మ‌లోలువై చేయ‌రాని పాపాలు చేశాడు. వీడు మీ విష్ణులోకం చేర‌డానికి ఏ విధంగా అర్హుడు సెల‌వీయండి" అన్నారు య‌మ‌దూత‌లు.
వారికి స‌మాధానంగా విష్ణుదూత‌లు
ఓ య‌మ‌దూత‌లారా, "ఉత్త‌మ లోకాలు చేరేందుకు ఎవ‌రికి అర్హ‌త ఉంటుంది, ఎలాంటి పుణ్య‌కార్యాలు చేసిన వారు విష్ణుప‌థం చేర‌గ‌ల‌రు చెబుతాం వినండి. ఏ కార‌ణం వ‌ల‌న అయినా చెడు మిత్రుల‌ను వ‌దిలి స‌త్సంగంలో క‌లిసే వారు, నిత్య‌దైవ‌చింత‌నాప‌రులు, స్నాన సంధ్య జ‌ప హోమ త‌త్ప‌రులూ య‌మ లోకానికి అర్హులు కారు. అసూయా ర‌హితులై, జ‌పాగ్నిహోత్ర క‌ర్మ‌లు ఆచ‌రిస్తూ జ‌లాన్న గోదానాలు చేసే వారు, వృషోత్స‌ర్జ‌నాక‌ర్త‌లు కూడా య‌మ‌లోకాన్ని పొందేందుకు అన‌ర్హులు. విద్యాదానం చేసేవారు, ప‌రోప‌కార‌శీలురు, హ‌రిపూజా ప్రియులు, నిరంత‌రం హ‌రినామ జ‌పం చేసే వారు, వివాహ ఉప‌న‌య‌నాలు చేయించే వారు, అనాథ ప్రేత సంస్కారాలు చేసే వారు  కూడా య‌మ‌లోకాన్ని చేర‌లేరు. అంతే కాదు, నిత్యం సాల‌గ్రామాన్ని అర్చించి వాటి తీర్థం సేవించే వారు, తుల‌సీకాష్ఠ మూలిక‌లు ధ‌రించే వారు, ఇళ్ల‌లో తుల‌సిని పెంచే వారు, భాగ‌వ‌తాన్ని ప‌ఠించే వారు, పూజించే వారు, వినేవారు, సూర్య‌డులు మేష‌, తుల, మ‌క‌ర సంక్రాంతుల్లో ఉండ‌గా ప్రాతః కాల స్నానాలు ఆచ‌రించే వారు కూడా య‌మ‌లోకార్హ‌త లేని వారే. తెలిసిగాని, తెలియ‌క‌గాని హ‌రినామ సంకీర్త‌నం చేసే వారు పాప‌విముక్తుల‌వుతారు. అస‌లిన్ని మాట‌లెందుకు, అవ‌సాన కాలంలో ఒక్క‌సారైనా హ‌రినామ స్మ‌ర‌ణ చేసిన వాడు నేరుగా విష్ణులోకానికి రావ‌డానికే అర్హుడు" అన్నారు.

ఈ విధంగా సాగుతున్న య‌మ‌, విష్ణుదూత‌ల సంవాదాన్ని విన్న అజామిళుడులోని జీవుడు త‌న దాసీ సాంగ‌త్యాది పాపాల‌న్నింటినీ త‌లంచుకుని దుఃఖించ‌సాగాడు. ఇదేమి ఆశ్చ‌ర్యం, ఆ న‌ల్ల‌ని క‌త్తులు ధ‌రించిన య‌మ‌దూత‌లు ఏమైపోయారు?  నేనీ వైకుంఠంలో ఎలా ఉండ‌గ‌లిగాను?  పూర్వ జ‌న్మ పుణ్యం కాక‌పోతే నా జిహ్వ‌పై హ‌రినామం ఎలా వ‌చ్చింది, నాకు వైకుంఠ ప్రాప్తి ఎలా క‌లిగింది అని త‌న‌లో తానే అనుకుంటూ హ‌రినామ‌స్మ‌ర‌ణం చేయ‌సాగాడు.

కాబ‌ట్టి ఓ రాజా కేవ‌ల హ‌రినామ స్మ‌ర‌ణ‌మే అంత‌టి ముక్తి ప్ర‌ద‌మైన‌ది. అలాంటిది హ‌రికి ఎంతో ప్రియ‌మైన కార్తీక వ్ర‌తం ఆచ‌రిస్తే ఎంత పుణ్యం క‌లుగుతుందో ఊహించు అన్నాడు వ‌శిష్ఠుడు.
న‌వ‌మాధ్యాయ స‌మాప్తః
--------------

ద‌శ‌మాధ్యాయం

ఈ వృత్తాంతం వినిపించిన వ‌శిష్ఠుని జ‌న‌క‌మ‌హారాజు ఇలా అడిగాడు.
"ఓ మ‌హ‌ర్షీ, ఈ అజామిళుడు పూర్వ‌జ‌న్మ‌లో ఎవ‌రు, ఏ పాపం వ‌ల‌న ఇలా పుట్టాడు, విష్ణుదూత‌ల మాట‌ల‌కు య‌మ‌దూత‌లు ఎలా త‌గ్గారు" అని ప్ర‌శ్నించాడు. 

దానికి వ‌శిష్ఠుడు నీవ‌డిగిన ప్ర‌శ్న‌ల‌కు ఒక క్ర‌మంలో స‌మాధానాలు చెబుతాను.

య‌మ‌దూత‌ల ఆరోప‌ణ - య‌ముని ఉప‌దేశం
అయ్యా పాపాత్ముడూ, దురాచార‌ప‌రుడూ, నిషిద్ధ క‌ర్మ‌లు ఆచ‌రించిన వాడు అయిన అజామిళుని జీవుని తెచ్చే స‌మ‌యంలో విష్ణుదూత‌లు మ‌మ్మ‌ల్ని అడ్డ‌గించి అత‌న్ని మా నుంచి విడిపించి వైకుంఠానికి తీసుకువెళ్లారు. వారిని ఎదిరించ‌లేక మేమిలా రిక్త‌హ‌స్తులుగా వ‌చ్చాము అని విష్ణుపారిష‌దుల చేత తిర‌స్కృతులైన య‌మ దూత‌లు య‌మునికి నివేదించారు.

కింక‌రులు చెప్పింది విన్న స‌మ‌వ‌ర్తికి ర‌వంత ఆగ్ర‌హం క‌లిగింది. జ్ఞాన‌దృష్టితో స‌మ‌స్తం అవ‌లోకించి వారితో ఇలా అన్నాడు.

కింక‌రులారా, కించిద‌పి పుణ్య విహీనోపి - ఆ అజామిళుడు మ‌హాపాపే అయిన‌ప్ప‌టికీ అంత్య కాలంలో హ‌రినామ స్మ‌ర‌ణ చేయ‌డం వ‌ల‌న స‌మ‌స్త‌పాపాలు న‌శించి విష్ణుప్రియుడ‌య్యాడు. తెలిసి తాకినా, తెలియ‌క తాకినా స‌మ‌స్త జాతుల‌ను అగ్ని ఎలా ద‌హిస్తుందో అలాగే దుష్టాత్ములై, శ్రీ‌హ‌రిని ఎన్న‌డూ క‌ల‌లోనైనా స్మ‌రించ‌ని వారు అంత్య‌కాలంలో శ్రీ‌హ‌రీ, నారాయ‌ణా అని ప‌లికితే చాలు వారి స‌మ‌స్త పాపాలు హ‌రించుకుపోతాయి. ఇక భ‌క్తిభావంతో ఎల్ల‌ప్పుడూ హ‌రినామ స్మ‌ర‌ణ చేసే వారు కేవ‌లం కైవ‌ల్యానికే చేరగ‌లుగుతారు.

ఇలా సేవ‌కుల‌కు ఎంతవ‌ర‌కు చెప్పాలో అంత‌వ‌ర‌కు మాత్ర‌మే చెప్పిన య‌మ‌ధ‌ర్మ‌రాజు ఆ అజామిళుని పూర్వ‌వృత్తాంతాన్ని కూడా జ్ఞాన‌దృష్టితో వీక్షించాడు. 

అజామిళుని పూర్వ‌జ‌న్మ‌
అజామిళుడు పూర్వ‌జ‌న్మ‌లో సౌరాష్ట్ర దేశంలో శివార్చ‌కుడుగా ఉండేవాడు. ఆ జ‌న్మ‌లో కూడా స్నాన సంధ్యాదులు విస్మ‌రించి, దైవేత‌రాల‌నే చింతిస్తూ, దేవుని ద్ర‌వ్యాన్ని కూడా అప‌హ‌రించే వాడు. బ్రాహ్మ‌ణుడై ఉండి కూడా ఆయుధాలు చేత‌ప‌ట్టి తిరుగుతూ దుష్టుల‌తో స్నేహం చేస్తూ కాలం గ‌డిపాడు. 

అదే గ్రామంలో ఒక ద‌రిద్ర బ్రాహ్మ‌ణుడుండే వాడు. అత‌ను ద‌రిద్ర పీడితుడై, అన్నం కోసం అన్ని ప్ర‌దేశాలు తిరుగుతూ యాయ‌వార వృత్తి అవ‌లంబించే వాడు. ఒక‌సారి అత‌ను యాయ‌వార వృత్తి ద్వారా ఆ రోజు త‌న‌కు ల‌భించిన వ‌స్తువుల‌తో ఇంటికి వ‌చ్చి భార్య‌ని పిలిచి "చాలా ఆక‌లిగా ఉంది. తొంద‌ర‌గా వంట చేయి. ముందుగా కాసిని మంచినీళ్లు ఇస్తే అవి తాగి ఉప‌శాంతి పొందుతాను" అన్నాడు.

కాని య‌వ్వ‌న‌వ‌తి, మ‌దాంధురాలు అయిన అత‌ని భార్య భ‌ర్త‌మాట‌లు వినిపించుకోలేదు. త‌న జారుని గురించే త‌ల‌పోస్తున్న ఆమెకు భ‌ర్త మాట‌లు చెవిన ప‌డ‌లేదు. అందుకు కోపించిన భ‌ర్త చేతికందిన క‌ర్ర‌తో ఆమెను కొట్టాడు. కామంతో కూడిన త‌న ఆలోచ‌న‌ల‌కు అడ్డుప‌డ్డాడ‌న్న కోపంతో ఆమె కూడా భ‌ర్త‌కు ముష్టిఘాతాలిచ్చింది. తీవ్రంగా అలిసిపోవ‌డంతో పాటు భార్య దుష్ట‌ప్ర‌వ‌ర్త‌న‌కు చింతించిన ఆ బ్రాహ్మ‌ణుడు ప‌రిత‌పించి ఇల్లు వ‌దిలిపోయాడు. వేరే గ్రామంలో యాయ‌వారం చేసుకుంటూ బ‌త‌క‌సాగాడు. మ‌దాంధ అయిన అత‌ని భార్య భ‌ర్త ఇల్లు వ‌దిలి వెళ్లిపోవ‌డంతో మ‌రింత బ‌రితెగించింది. ఆ జారిణి మ‌గ‌డు తెచ్చిన‌వ‌న్నీ వండుకుని సుష్టుగా తిని భ‌ర్త ఆభ‌ర‌ణాలు అలంక‌రించుకుని, దుస్తులు ధ‌రించి, తాంబూల‌చ‌ర్వ‌ణం చేస్తూ ఒక ర‌జ‌కుని ఇంటికి వెళ్లి ఆ రాత్రి త‌న‌తో సంభోగించాల్సిందిగా కోరింది. కాని నీతిమంతుడైన ఆ ర‌జ‌కుడు ఆమె కోర్కెను నిరాక‌రించాడు. వారిద్ద‌రి మ‌ధ్య సంవాదం కూడా జ‌రిగింది. అయినా ఆ ర‌జ‌కుడు త‌న‌ను కాద‌న‌డంతో కోప‌గించిన ఆమె ఇత‌ర ర‌సికుల‌ను వెతుక్కుంటూ వీధిన ప‌డింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో శివార్చ‌కుడు ఆమెకు ఎదుర‌య్యాడు. అత‌న్ని సుర‌త క్రీడ‌ల‌కు ఆమె ఆహ్వానించింది. బ్రాహ్మ‌ణుడైనా ప‌ర స్ర్తీ వ్యామోహంతో వెనుక‌ముందు చూడ‌కుండా ఆమె కోర్కెను అంగీక‌రించాడు. ఇద్ద‌రూ ఆ రాత్రంతా సుఖించారు. కాని స‌ద్వంశంలో జ‌న్మించింది కావ‌డం వ‌ల్ల కామం చ‌ల్లార‌గాన‌ ఆ జారిణి త‌న దోషాన్ని గుర్తించి ప‌శ్చాత్తాప‌ప‌డి భ‌ర్త‌ను వెతుక్కుంటూ వెళ్లింది. అత‌న్ని బ‌తిమాలి ఇంటికి తీసుకువ‌చ్చి ఆ త‌ర్వాత అత‌ను చెప్పిందే వేదంగా అత‌ని మాట జ‌వ‌దాట‌కుండా జీవించ‌సాగింది.

ఈ పాప‌క‌ర్మ‌ల వ‌ల‌న మ‌ర‌ణానంత‌రం ఆ శివార్చ‌కుడు రౌరవాది మ‌హాన‌ర‌కాలు అనుభ‌వించి చివ‌రికి స‌త్య‌నిష్ఠుడు అనే బ్రాహ్మ‌ణ‌కుమారుని ఇంటిలో జ‌న్మించాడు. అత‌డే అజామిళుడు. పూర్వ‌జ‌న్మ దుష్ట‌వాస‌న‌ల‌తో జీవితాంతం దుష్ట‌క‌ర్మ‌లే చేసినా కార్తీక పౌర్ణ‌మినాడు శివ‌సంద‌ర్శ‌నం, అంత్య కాలంలో హ‌రినామ‌స్మ‌ర‌ణం చేసిన పుణ్యం వ‌ల‌న మోక్షాన్ని పొందాడు.

ఆ నాడు శివార్చ‌కునితో జార‌త్వం నెరిపిన ఆ బ్రాహ్మ‌ణ జారిణీ కూడా కొంత కాలానికి మ‌ర‌ణించింది. న‌ర‌కం అనుభ‌వించిన అనంత‌రం క‌న్యాకుబ్జంలోని ఒక ఛండాలుని ఇంటిలో బాలిక‌గా జ‌న్మించింది. ఆ పిల్ల తండ్రి గండాన పుట్ట‌డం వ‌ల‌న వారు ఆ పిల్ల‌ను అడ‌విలో వ‌దిలేశారు. వ‌నాల్లో తిరుగుతున్న ఒక బ్రాహ్మ‌ణుడు ఆ శిశువు అర‌ణ్య‌రోద‌న విని జాలి ప‌డి త‌న‌తో తీసుకువెళ్లి ఇంటి దాసీకి పెంచుకునేందుకు ఇచ్చాడు. ఆ దాసీదాని ద‌గ్గ‌ర పెరిగిన పిల్ల‌నే త‌దుప‌రి జ‌న్మ‌లో అజామిళుడు ద‌గ్గ‌ర‌కు తీసుకున్నాడు.

మ‌హారాజా, నువ్వ‌డిగిన అజామిళుని పూర్వ‌గాథ ఇది. స‌మ‌స్త పాపాల‌కు హ‌రినామ స్మ‌ర‌ణ‌ను మించిన ప్రాయ‌శ్చిత్తం మ‌రొక‌టి లేదు. అది సాధ్యం కాన‌ప్పుడే ఇత‌ర ధ‌ర్మ‌శాస్ర్తాది ప్రోక్త పాయ‌శ్చిత్త క‌ర్మ‌లు ఆచ‌రించాల్సి ఉంటుంది.   

జ‌న‌క మ‌హారాజా, ఎవ‌రి జిహ్వ నిరంత‌రం హ‌రిని కీర్తించ‌దో, ఎవ‌రి మ‌న‌సు హ‌రిచ‌ర‌ణాలు ఆశ్ర‌యించ‌దో, ఎవ‌రి చెవులు శ్రీ‌హ‌రి కీర్త‌న‌లు ఆల‌కించ‌దో వారి పాపాలు ఏ విధంగానూ న‌శించే అవ‌కాశం లేదు. ఎవ‌రైతే చింత‌ల‌న్నింటినీ విడిచిపెట్టి నిరంత‌రం విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు త‌ప్ప‌నిస‌రిగా కైవ‌ల్యం పొందుతార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. మోక్షాస‌క్తుల‌కు ముర‌హ‌రి స్మ‌ర‌ణ ఏ విధంగా సూక్ష్మ‌మార్గ‌మో అదే విధంగా కార్తీక ధ‌ర్మాచ‌ర‌ణమ‌నే సూక్ష్మ మార్గం కూడా మ‌హోత్కృష్ట పుణ్య‌ప్ర‌దాయినియై పాత‌కాల‌ను పార‌దోలుతుంది. పాపాల‌ను న‌శింప‌చేసే శ‌క్తి ఈ కార్తీక వ్ర‌తాచ‌ర‌ణ‌కు మాత్ర‌మే ఉంది. దాని వ‌ల‌న ఎవ‌రు ఈ దివ్య వ్ర‌తాన్ని ఆచ‌రించ‌రో వారు న‌ర‌క ప్రాప్తులువార‌ని తెలుసుకో. పాప‌నాశ‌ని అయిన ఈ కార్తీక మాహాత్మ్యాన్ని వినిపించే వాడు వైకుంఠ గ‌తుడై విష్ణువుతో క‌లిసి సుఖించుతాడు.  
ద‌శ‌మాధ్యాయ స‌మాప్తః
ఐద‌వ రోజు పారాయ‌ణం ముగిసింది
--------------------------------- 
నోట్ - చ‌దివిన వారంద‌రూ అద్భుతం, చాలా బాగుంది, బాగుంది అనే రేటింగ్ బాక్స్ ల్లో ఏదో ఒక దాని మీద క్లిక్ చేసి రేటింగ్ ఇవ్వండి. ధ‌న్య‌వాదాలు