Thursday, October 31, 2019

మా నివాసంలో కామేశ్వ‌రి పూజ‌

కార్తీక పురాణం- 4వ రోజు పారాయ‌ణం  (శుక్ల చ‌వితి రోజున‌)

స‌ప్త‌మాధ్యాయం
ఓ జ‌న‌క రాజేంద్రా క‌ల్మ‌ష‌ఘ్న‌మైన కార్తీక మాసంలో పుష్పార్చ‌న‌, దీప విధానాల‌ను చెబుతాను విను.

ఈ కార్తీక మాసంలో క‌మ‌ల‌నాభుడైన శ్రీ‌హ‌రిని క‌మ‌లాల‌తో పూజించ‌డం వ‌ల‌న క‌మ‌లాస‌ని అయిన ల‌క్ష్మీదేవి ఆ భ‌క్తుల ఇంట స్థిర నివాసం ఏర్ప‌ర‌చుకుంటుంది. తుల‌సీ ద‌ళాల‌తో గాని, జాజి పూల‌తో గాని, మారేడు ద‌ళాల‌తో గాని పూజించే వారు తిరిగి భూమిపై జ‌న్మించ‌రు. భ‌క్తియుక్తులై పండ్ల దానం చేసే వారి పాపాలు సూర్యోద‌యానికి చీక‌టి వ‌లె చెదిరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయ‌ల‌తో పూజించే వారిని తేరి చూడ‌డానికి య‌మునికి కూడా శ‌క్తి చాల‌దు. కార్తీకంలో ఎవ‌రైతే సాల‌గ్రామాన్ని తుల‌సీద‌ళాల‌తో పూజిస్తారో వారికి మించిన ధ‌న్యులెవ‌రూ ఉండ‌ర‌నేది అతిశ‌యోక్తి కాదు. బ్రాహ్మ‌ణ స‌మేతులై ఉసిరి చెట్టు కింద వ‌న‌భోజ‌నం చేసే వారి మ‌హాపాత‌కాలు సైతం మ‌ట్టి క‌లిసిపోతాయి. బ్రాహ్మ‌ణ స‌మేతులై ఉసిరి చెట్టు కింద సాల‌గ్రామ పూజ చేసే వారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వ‌లె ఆనందిస్తారు. విష్ణు ఆల‌యంలో మామిడాకుల తోర‌ణం క‌డ‌తారో వారు ప‌ర‌మానందాన్ని పొందుతారు. పూల‌తో గాని, అర‌టి స్తంభాల‌తో గాని, మండ‌పం క‌ట్టిన వారు వైకుంఠంలో విష్ణు సామీప్యం పొందుతారు. ఒక్క‌సారైనా శ్రీ‌హ‌రికి సాష్టాంగ‌దండ ప్ర‌ణామం చేసిన వారు అశ్వ‌మేథం చేసినంత‌టి పుణ్య‌వంతుల‌వుతారు. 

విష్ణువుకు ఎదురుగా జ‌ప‌,హోమ‌, దేవ‌తార్చ‌న‌లు చేసే వారు పిత‌రుల‌తో స‌హా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు. స్నానం చేసి త‌డి బ‌ట్ట‌లతో ఉన్న వానికి పొడి బ‌ట్ట దానం చేస్తే ప‌ది వేల అశ్వ‌మేథాల ఫ‌లాన్ని పొందుతారు. ఆల‌యం శిఖ‌రంపై ధ్వ‌జారోహ‌ణం చేసి వారి పాపాలు గాలికి పుష్ప ప‌రాగం వ‌లె ఎగిరిపోతాయి. న‌ల్ల‌ని లేదా తెల్ల‌ని అవిశె పూల‌తో శ్రీ‌హ‌రి పూజ చేసిన వారికి ప‌ది వేల య‌జ్ఞాల ఫ‌లం ల‌భిస్తుంది. ఏ స్ర్తీ అయినా బృందావ‌నాన్ని గోమయంతో అలికి, పంచ‌రంగుల‌తో శంఖ‌ప‌ద్మ‌స్వ‌స్తికాది రంగ‌వ‌ల్లులు తీర్చి దిద్దితే ఆమె విష్ణువుకు ప్రియురాల‌వుతుంది. విష్ణు స‌న్నిధిలో నందా దీపాన్ని అర్పించ‌డం వ‌ల‌న క‌లిగే పుణ్యాన్ని ఆదిశేషుడైనా వేనోళ్ల పొగ‌డ‌లేడు. కార్తీక‌మాసంలో శివుని జిల్లేడు పూల‌తో పూజించిన వారు దీర్ఘాయుష్మంతులై అంత‌మున మోక్షాన్ని పొందుతారు. విష్ణు ఆల‌యంలో మండ‌పాన్ని అలంక‌రించిన వారు హ‌రిమందిరంలో చిర‌స్థాయిగా ఉంటారు. హ‌రిని మ‌ల్లె పూల‌తో పూజించిన వారి పాపాలు స‌ర్వ‌నాశ‌న‌మైపోతాయి. తుల‌సీగంధంతో సాల‌గ్రామ పూజ చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు స‌న్నిధిలో నాట్యం చేసిన వారి పూర్వ‌సంచిత పాపాల‌న్నీ నాశ‌న‌మైపోతాయి. భ‌క్తియుక్తులై అన్న‌దానం చేసిన వారి పాపాలు గాలికి మంచుతున‌క‌ల్లా ఎగిరిపోతాయి.కార్తీక మాసంలో నువ్వుల దానం, మ‌హాన‌దీ స్నానం, బ్ర‌హ్మ‌ప‌త్ర భోజ‌నం, అన్న‌దానం ఈ నాలుగూ ఆచ‌రించ‌డం ధ‌ర్మంగా చెప్ప‌బ‌డుతోంది. స్నాన‌దానాలు ఆచ‌రించ‌ని వారు, లోభియై య‌థాశ‌క్తి దానం చేయ‌ని వారు నూరు జ‌న్మ‌లు కుక్క‌లుగా పుట్టి క‌డ‌ప‌ట ఛండాల‌యోనిన జ‌న్మిస్తారు. కార్తీక వ్ర‌త శూన్యులు మ‌రుజ‌న్మ‌లో గాడిద‌గా పుట్టి త‌దుప‌రి నూరు పుట్టుక‌లు శున‌క‌యోనిని జ‌న్మిస్తారు. కార్తీక మాసంలో శ్రీ‌హ‌రిని క‌దంబ పుష్పాల‌తో పూజించిన వారు సూర్యమండ‌లంలోనే నివ‌శిస్తారు.

ఓజ‌న‌క మ‌హారాజా, కార్తీక మాసంలో ఎవ‌రైతే అవిశ పూల‌ను తాము ధ‌రించి త‌దుప‌రి ఆవిశ పూల మాలిక‌ల‌తో శ్రీ‌హ‌రిని పూజిస్తారో వారు స్వ‌ర్గాధిప‌తుల‌వుతారు. మాల‌లు, తుల‌సిద‌ళాల‌తో విష్ణువును పూజించే వ‌నిత‌లు వైకుంఠాన్ని పొందుతారు.
ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను. అశ‌క్తులైన వారు
శ్లో - కార్తీకే భానువారేతు స్నాన‌క‌ర్మ‌మాచ‌రేత్
మాస స్నానేన య‌త్పుణ్యం త‌త్పుణ్యం ల‌భ‌తే నృప‌
శ్లో - ఆద్యేంతిమే తిథౌ మ‌ధ్య‌మేచ దినే యః స్నాన‌మాచ‌రేత్‌
మాస‌న్నాన ఫ‌లంతేన ల‌భ్య‌తే నాత్ర సంశ‌యః

కార్తీక మాసంలో ఆదివారం నాడు కాని లేదా శుక్ల పాడ్య‌మి, పూర్ణిమ నాడు గాని, అమావాస్య నాడు గాని సంక‌ల్ప స‌హితంగా ప్రాతః స్నాన‌మాచ‌రించ‌డం వ‌ల‌న ఆ మాస‌మంతా స్నానం చేసిన పుణ్యం ల‌భిస్తుంది. ఆ పాటి శ‌క్తి కూడా లేని వారు కార్తీక మాసం నెల‌రోజులూ ఈ సంపూర్ణ కార్తీక మ‌హాపురాణాన్ని చ‌దివినా, విన్నా కూడా స్నాన‌ఫ‌లాన్ని పొందుతారు. తాము స్వ‌యంగా సంక‌ల్ప‌పూర్వ‌కంగా విష్ణువును పూజించే వారు అవ్య‌య ప‌దాన్ని పొందుతారు. కార్తీక మాసం సాయంకాల స‌మ‌యాల్లో దేవాల‌యాల్లో శివ‌, విష్ణు స్తోత్రాలు ప‌ఠించే వారు కొంత కాలం స్వ‌ర్గంలో ఉండి ఆ త‌ర్వాత ధ్రువ‌లోకాన్ని పొందుతారు. ఇలా ప్ర‌తీ కార్తీక మాసంలో ఎవ‌రైతే హ‌రిహ‌రుల‌ను స్మ‌రించ‌కుండా ఉంటారో వారు ఏడు జ‌న్మ‌ల పాటు న‌క్క‌లుగా పుడ‌తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.
స‌ప్త‌మాధ్యాయ స‌మాప్తః
---------------- 

అష్ట‌మాధ్యాయం
వ‌శిష్ఠుడు చెప్పిన‌దంతా విని జ‌న‌కుడు ఇలా అడుగుతున్నాడు. "ఓ మ‌హ‌ర్షీ మీరు చెప్పిన‌వ‌న్నీ విన్న త‌ర్వాత నాకొక సందేహం క‌లుగుతోంది. వ‌ర్ణ సాంక‌ర్యాది మ‌హాపాపాల‌ను చేసిన దుర్జ‌నులు వేద త్ర‌యోక్తాలైన ప్రాయ‌శ్చిత్తాల‌ను చేసుకొన‌నిదే ప‌రిశుద్ధులు కారు అని స‌మ‌స్త శాస్ర్తాలు ఘోషిస్తుండ‌గా కేవ‌లం కార్తీక వ్ర‌తాచ‌ర‌ణ చేత‌నే స‌మ‌స్త పాపాలు న‌శించిపోయి వైకుంఠం పొందుతార‌ని చెప్ప‌డంలోని మ‌ర్మం ఏమిటి, ఎలా సాధ్యం? అత్యంత స్వ‌ల్ప‌మైన పుణ్య‌మాత్రం చేత‌నే గొప్ప‌గొప్ప పాపాలు ఎలా న‌శించిపోతాయి, అగ్ని ద‌గ్ధ‌మ‌వుతున్న ఇంటిలో ఉన్న వాడు ఆ మంట మీద పురిషెడు నీరు చ‌ల్లితే అగ్ని శిఖ‌లు ఆరిపోతాయా? ఏ మ‌హాన‌దీ ప్ర‌వాహంలోనైనా కొట్టుకుపోయే వారిని ఓ పాటి గ‌డ్డిప‌ర‌క గ‌ట్టుకు చేర్చ‌గ‌లుగుతుందా? త‌నంత తానుగా కొండ‌చ‌రియ‌ల‌లోని ఏ ల‌తా సూత్రాన్నో ప‌ట్టుకున్నంత మాత్రం చేత న‌దీ ప్ర‌వాహ వేగాన్నుంచి సంర‌క్షింప‌బ‌డ‌తాడా? వ‌శిష్ఠా ఏ విధ‌మైన దృష్టాంతాల రీత్యా మ‌హాపాపులైన వారు స‌హితం అతి స్వ‌ల్ప‌కార్య‌మైన కార్తీక వ్ర‌తాచ‌ర‌ణం వ‌ల‌న పాప‌ర‌హితులు, పుణ్యాత్ములు ఎలా అవుతారు?" అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు.

జ‌న‌కుని ప్ర‌శ్న‌ల‌కు వ‌శిష్ఠుని స‌మాధానం
మంచి విమ‌ర్శే చేశావు మ‌హారాజా. చెబుతాను విను. ధ‌ర్మాన్నిసూక్ష్మంగా చింతించాలే గాని స్థూల రూపాన్ని ఆలోచించ‌కూడ‌దు. అదీ గాక వేద‌శాస్త్ర పురాణాల‌న్నీ అనేక ధ‌ర్మ‌సూక్ష్మాల‌ను మ‌న‌కందిస్తున్నాయి. ఆయా ధ‌ర్మ‌సూత్రాల వ‌ల‌న కొన్ని ప‌ర్యాయాలు గొప్ప‌గొప్ప పుణ్య‌కార్యాలు స్వ‌ల్ప‌మైన‌విగాను, స్వ‌ల్ప పుణ్య‌కార్యాలు గొప్ప‌విగాను ప‌రిణ‌మిస్తాయి. ధ‌ర్మాల‌న్నీ గుణ‌త్ర‌యంతో కూడుకుని స్వ‌ల్పాన‌ల్ప‌త‌ల‌ను సిద్ధింప‌చేసుకుంటాయి. మూల‌ప్ర‌కృతి అయిన మ‌హామాయ కార‌ణంగా స‌త్వ‌ర‌జ‌స్త‌మ‌స్సుల‌నే మూడు గుణాలూ ఏర్ప‌డ్డాయి. వాటిలో స‌త్వ‌గుణ ప్ర‌ధాన‌మైన‌వి ధ‌ర్మ‌సూక్ష్మాలు. క‌ర్మ‌కాండ‌, త‌ప‌స్సు, ప్రాయ‌శ్చిత్తం అన్నీ ర‌జోగుణం వ‌ల‌న ఏర్ప‌డ్డాయి. త‌ర్కం, దైవేత‌ర చింత‌న‌తో సాగించే దైవీయ కృత్యాలు, ఆచ‌రించే దాన‌ధ‌ర్మాలు ఇవ‌న్నీ ధ‌ర్మం యొక్క స్థూల స్వ‌రూపాలు. ఇవి త‌మోగుణం వ‌ల్ల ఏర్ప‌డ‌తాయి. వీటిలో స‌త్వ‌గుణంతో ఆచ‌రించే ధ‌ర్మాలు స్వ‌ల్పంగా క‌నిపించినా దేశ‌కాల యోగ్య‌త‌ల‌నున బ‌ట్టి విశేష ఫ‌లాల‌ను ఇస్తాయి. దేశ‌ము అంటే పుణ్య‌క్షేత్రం. కాల‌ము అంటే పుణ్య‌కార్యం. యోగ్య‌త అంటే పాత్ర‌త‌. బ్ర‌హ్మ‌జ్ఞ‌త క‌ల‌వారు ఈ మూడింటినీ చింతించ‌కుండా చేసే స‌ర్వ‌ధ‌ర్మాలూ, తామ‌సాలూ-వీటి వ‌ల‌న పాపాలు న‌శించ‌వు. కాబ‌ట్టి దేశ‌కాల యోగ్య‌త‌ల‌ను విచారించి చేసేవే స‌త్వ ధ‌ర్మాలు. వీటిలో కొన్ని స‌మ‌కూరి, కొన్ని స‌మ‌కూర‌క జ‌రిపేవి ర‌జోగుణాల‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర‌లేదు క‌దా, జ‌న‌క‌మ‌హారాజా. అన్నింటికీ క‌ర్మ‌మే మూలం. ఎవ‌రి క‌ర్మ‌ను బ‌ట్టి వారికి ఫ‌లితాలుంటాయి. అయిన‌ప్ప‌టికీ మ‌నిషికి జ్ఞానం ఉన్నందు వ‌ల‌న ఆచ‌రించే ధ‌ర్మాల‌ను పై మూడింటితో పోల్చుకుని ప్ర‌య‌త్న‌పూర్వ‌కంగానైనా ఆచ‌రించాలి. ఈ విధంగా మూడూ క‌లిసి వ‌చ్చిన‌ప్పుడు ఆచ‌రించిన ధ‌ర్మం అక్ష‌య ఫ‌లాన్నిస్తుంది. రాజా ప‌ర్వ‌త‌మంత ఎత్తు క‌ట్టెల‌ను పేర్చి వాటి మ‌ధ్య గురివింద గింజంత అగ్నిక‌ణాన్ని ఉంచితే ఆ అగ్నిక‌ణం ఆ క‌ట్టెల‌ను ఎలా కాల్చివేయ‌గ‌లుగుతుందో, సువిశాల‌మైన న‌ట్టింట పెట్టిన న‌లుసంత దీపం ఆ ఇంటి చీక‌ట్ల‌నెలా తొల‌గిస్తుందో, గుండిగ‌డు మంచినీటిని ఒక ఇండుపు గింజ ఎలా శుభ్ర‌ప‌రుస్తుందో అదే విధంగా తెలిసి గాని, తెలియ‌క గాని పుణ్యాకాలంలో, పుణ్య‌క్షేత్రంలో, పుణ్య‌మూర్తుల వ‌ల‌న ఆచ‌రించే ధ‌ర్మం అనంత పాపాల‌నూ ద‌గ్ధం చేసి మోక్ష‌మార్గం వేస్తుంది. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఒక క‌థ చెబుతాను విను. 

అజామిళోపాఖ్యాన‌ము   
అమిత పూర్వ‌కాలంలో క‌న్యాకుబ్జ క్షేత్ర‌నివాసి, సార్థ‌క నామ‌ధేయుడు అయిన స‌త్య‌నిష్ఠుడ‌నే బ్రాహ్మ‌ణునికి అజామిళుడ‌నే కుమారుడు ఉండే వాడు. వాడు ప‌ర‌మ దురాచారుడు. దాసీ సాంగ‌త్య‌ప‌రుడు, హింసాప్రియుడు. సాటి బ్రాహ్మ‌ణ గృహంలో ఒకానొక దాసితో సాంగ‌త్యం పెట్టుకుని త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలి ఆ దాసీదానితోనే భోజ‌న శ‌య‌నాదుల‌న్నీ సాగించే వాడు. కామాంధుడై వైదిక క‌ర్మ‌ల‌న్నింటినీ విడిచిపెట్టి కేవ‌ల కామాస‌క్తుడై ప్ర‌వ‌ర్తించే వాడు. బంధువులంతా అత‌న్ని వ‌దిలివేశారు. కులంలోని వారు వెలి వేశారు. ఈ కార‌ణంగా ఇల్లు వ‌దిలిపెట్టి వెళ్లిపోవ‌ల‌సివ‌చ్చింది. అజామిళుడు ఛండాల‌పు వారిళ్ల‌లో ఒకానొక దాసీదానితో కాపురం పెట్టి, కుక్క‌లు, మృగాల‌ను ఉచ్చులు వేసి ప‌ట్టుకునే వృత్తిలో బ‌తికే జ‌నాల్లో ఒక‌డుగా ఉంటూ మ‌ధుమాంస సేవ‌న‌లు సాగించే వాడు. ఇలా ఉండ‌గా ఒక‌నాడ‌త‌ని ప్రియురాలైన దాసీది క‌ట్టుతాగి తాటి చెట్టు ఎక్క‌డం వ‌ల‌న క‌మ్మ విరిగి కింద ప‌డి మ‌ర‌ణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు. అప్ప‌టికే ఆ దాసీదానికి య‌వ్వ‌న‌వ‌తి అయిన కూతురు ఉంది. మ‌హాపాపాత్ముడు, మ‌హాకామాంధుడు అయిన అజామిళుడు త‌న కూతురు వ‌ర‌స అని కూడా త‌ల‌చ‌కుండా ఆ పిల్ల‌నే వ‌రించి ఆమెతో కామోప‌భోగాలు అనుభ‌వించ‌సాగాడు. కాముకుడైన అజామిళుడు కూతురుతోనే అనేక మంది బిడ్డ‌ల‌ను పొందాడు. కాని వారంతా ప‌సికందులుగానే క‌డ‌తేరిపోయారు. చివ‌రిగా పుట్టిన బిడ్డ‌కు "నారాయ‌ణ" అని నామ‌క‌ర‌ణం చేసి అమిత ప్రేమ‌తో పెంచుకోసాగాడు. తాను తింటున్నా, నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా నిరంత‌రం కుమారునే స్మ‌రించుకుంటూ "నారాయ‌ణా, నారాయ‌ణ" అని పిలుచుకుని త‌న్మ‌యుడ‌వుతూ ఉండేవాడు. కాలం గ‌డిచి అజామిళుడు కాలం చేస స‌మ‌యం ఆస‌న్న‌మ‌యింది. అత‌నిలోని జీవుని తీసుకుపోయేందుకు ఎర్ర‌ని గ‌డ్డ‌ములు, మీస‌ములు క‌లిగి, చేత‌దండ‌పాశాల‌ను ధ‌రించిన భ‌యంక‌ర రూపులైన య‌మ‌దూత‌లు వ‌చ్చారు. వారిని చూస్తూనే గ‌డ‌గ‌డ‌లాడిపోయిన ఆ అజామిళుడు ప్రాణావ‌సాన వేళ కూడా పుత్ర‌వాత్స‌ల్యాన్ని వీడ‌క ఎక్క‌డో దూరంగా స్నేహితుల‌తో ఆట‌ల్లో మునిగి ఉన్న కుమారుని కోసం "నారాయ‌ణా, ఓ నారాయ‌ణా, ఓ తండ్రీ నారాయ‌ణా" అని ప‌దేప‌దే పిలిచాడు. ఆ పిలుపు అత‌ని కుమారునికి విన‌ప‌డ‌లేదు. అత‌ను రానూలేదు. కాని చేరువ‌కు వ‌చ్చిన య‌మ‌దూత‌లు ఆ నారాయ‌ణ నామ‌స్మ‌ర‌ణం విని వెన‌క్కి త‌గ్గారు. అదే స‌మ‌యంలో విష్ణుదూత‌లు వ‌చ్చి "ఓ య‌మ‌దూత‌లారా, అడ్డు తొల‌గండి. అత‌డు మా వెంట రాద‌గిన వాడే గాని, మీ వెంట రాద‌గిన వాడు కాదు" అని హెచ్చ‌రించారు. విక‌సిత ప‌ద్మాల వ‌లె విశాల‌మైన నేత్రాలు క‌ల‌వారు, ప‌ద్మ‌మాలాంబ‌ర ధ‌రులైన ఆ విష్ణుదూత‌ల‌ను చూసి విభ్రాంతులైన య‌మ‌దూత‌లు "అయ్యా మీరెవ‌రు, మా ప్ర‌భువైన య‌మ‌ధ‌ర్మ‌రాజు మాకు విధించిన ధ‌ర్మం ప్ర‌కారం తీసుకుని వెళ్ల‌నున్న ఈ జీవుని మీరెందుకు తీసుకుని వెళ్తామంటున్నారు" అని అడిగారు. వారికి విష్ణుదూత‌లు ఇలా స‌మాధానం చెప్ప‌సాగారు.
నాల్గ‌వ‌ రోజు పారాయ‌ణం స‌మాప్తం

Wednesday, October 30, 2019

కార్తీక పురాణం - 3వ రోజు పారాయ‌ణం (శుక్ల త‌దియ రోజున‌)

ఓ శివ‌ధ‌నుస్సంప‌న్నా, జ‌న‌క‌మ‌హారాజా, శ్ర‌ద్ధ‌గా విను. మ‌నం చేసిన పాపాల‌న్నింటినీ న‌శింప‌చేగ‌ల శ‌క్తి ఒక్క కార్తీక వ్ర‌తానికి మాత్ర‌మే ఉంది. కార్తీక మాసంలో విష్ణుస‌న్నిధిలో ఎవ‌రు భ‌గ‌వ‌ద్గీతా పారాయ‌ణం చేస్తారో వారి పాపాల‌న్నీ పాము కుబుసంలా తొల‌గిపోతాయి. అందులోనూ 10, 11 అధ్యాయాలు పారాయ‌ణ చేసిన వారు వైకుంఠానికి క్షేత్ర‌పాల‌కుల‌వుతారు. తుల‌సి ద‌ళాల‌తో గాని, తెలుపు లేదా న‌లుపు గ‌న్నేరు పూల‌తో గాని విష్ణు పూజ చేసిన వారు వైకుంఠానికి చేసి విష్ణువుతో స‌మానంగా భోగాల‌నుభ‌విస్తారు. ఈ కార్తీక మాసంలో హ‌రిహ‌రులెవ‌రి స‌న్నిధినైనా స‌రే ఏ పురాణాన్నైనా ప్ర‌వ‌చించే వారు స‌ర్వ‌క‌ర్మ‌బంధ విముక్తుల‌వుతారు.
కార్తీక వ‌న భోజ‌నం
శ్లో- యః కార్తీకే సితే వ‌న‌భోజ‌న మాచ‌రేత్
న‌యాతి వైష్ణ‌వం ధామ స‌ర్వ‌పాపై ప్ర‌ముచ్య‌తే
కార్తీక మాసం శుక్ల ప‌క్షంలో వ‌న‌భోజ‌నం చేసిన వారు -పాప‌విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జ‌ప‌, హోమ‌, పూపా, భోజ‌న‌, త‌ర్ప‌ణ ఫ‌లాల‌తో- పాపీ క్షుద్ర ఛండాలాది అశౌచ‌వంతుల పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి. కాబ‌ట్టి మ‌హారాజా, కార్తీక మాస శుక్ల ప‌క్షంలో అన్ని ర‌కాల వృక్షాల‌తో పాటుగా ఉసిరిచెట్టు ఊడా ఉన్న తోట‌లోనే వ‌న‌భోజ‌నం ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాల‌గ్రామం ఉంచి గంధ‌పుష్పాక్ష‌త‌ల‌తో పూజించి య‌థాశ‌క్తి బ్రాహ్మ‌ణుల‌ను ఆహ్వానించి గౌర‌వించి వారితో క‌లిసి భోజ‌నం చేయాలి. ఇలా కార్తీక మాసంలో వ‌న భోజ‌నం ఎవ‌రైతే నిర్వ‌హిస్తారో వారు ఆయా కాలాల్లో చేసిన స‌ర్వ‌పాపాల నుంచి విముక్తులై విష్ణులోకాన్ని పొందుతారు. జ‌న‌క‌ప‌తీ, ఈ కార్తీక మాహాత్మ్యాన్ని భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో విన్న బ్రాహ్మ‌డుడొక‌డు దుర్యోనీ సంక‌టంనుంచి ర‌క్షింప‌బ‌డిన క‌థ చెబుతాను, విను.
దేవ‌ద‌త్తోపాఖ్యాన‌ము
పూర్వం కావేరీ తీరంలో దేవ‌శ‌ర్మ అనే స‌ద్ర్బాహ్మ‌ణుడుండే వాడు. అత‌నికొక ప‌ర‌మ దుర్మార్గుడైన కుమారుడు క‌లిగాడు. అత‌ని పేరు దేవ‌ద‌త్తుడు. అత‌ని దుష్ట ప్ర‌వ‌ర్త‌న‌ల‌ను గుర్తించిన తండ్రి అత‌గాడిని పాప‌విముక్తుని చేయాల‌ని సంక‌ల్పించి "నాయ‌నా రోజూ కార్తీక వ్ర‌త స్నానం ఆచ‌రించు. సాయంవేళ హ‌రిస‌న్నిధిలో దీపారాధ‌న చేయి. ఈ విధంగా కార్తీక వ్ర‌తాన్ని ఆచ‌రించి ధ‌న్యుడ‌వు కా" అని చెప్పాడు. కాని దుర్వ‌ర్త‌నుడైన ఆ బ్రాహ్మ‌ణ‌పుత్రుడు తాన‌టువంటి క‌ట్టుక‌థ‌ల‌ను న‌మ్మ‌న‌ని, కార్తీక వ్ర‌తం ఆచ‌రించ‌న‌ని తండ్రికి ఎదురుతిరిగాడు. అందుకు ఆగ్ర‌హించిన దేవ‌శ‌ర్మ త‌న కుమారుడిని అడ‌విలోని చెట్టుతొర్ర‌లో ఎలుక‌వై ప‌డి ఉండు అని శ‌పించాడు. శాపానికి భ‌య‌ప‌డిన ఆ విప్ర‌కుమారుడు తండ్రి పాదాల‌పై ప‌బి త‌రుణోపాయం వేడ‌గా "నాయ‌నా నీవు ఎప్పుడైతే కార్తీక మ‌హాత్మ్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడు నీ ఎలుక రూపం పోతుంది" అని శాప‌విముక్తి తెలియ‌చేశాడు.
దేవ‌ద‌త్తునికి శాప‌విముక్తి
తండ్రి శాపం కార‌ణంగా క్ష‌ణాల్లో మూషిక రూపంలోకి మారిపోయిన ఆ బ్రాహ్మ‌ణ‌యువ‌కుడు గ‌జార‌న్‌యంలో ఫ‌ల‌వంత‌మైన‌ది, అనేక జంతువుల‌కు ఆశ్ర‌యం ఇచ్చేది అయిన ఒక మ‌హావృక్షం తొర్ర‌లో గ‌డ‌ప‌సాగాడు. కొంత‌కాలం గ‌డిచిన త‌ర్వాత మ‌హ‌ర్షి విశ్వామిత్రుడు శిష్య స‌మేతంగా కార్తీక స్నానం ఆచ‌రించి వ‌చ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొద‌టిలో కూచుని త‌న శిష్యుల‌కి ప‌ర‌మ పావ‌న‌మైన కార్తీక మాహాత్మ్యాన్ని వినిపించ‌సాగాడు. ఆ స‌మ‌యంలో ద‌యాహీనుడూ, పాపాల పుట్ట‌, అడ‌వి జీవాల‌ను హింసించి పొట్ట పోసుకునే వాడు అయిన ఒక కిరాత‌కుడు ఆ ప్రాంతానికి వ‌చ్చాడు. పుణ్య‌పురుషుల ద‌ర్శ‌నం వ‌ల్ల ఉప‌కార‌మే గాని, అప‌కారం ఎన్న‌టికీ జ‌రుగ‌దు. విశ్వామిత్రాది త‌పోధ‌నుల ద‌ర్శ‌నం చేత ర‌వంత ప‌శ్చాత్తాప‌ప‌డిన వాడై జ్ఞానం ఉద‌యించ‌గా ఆ కిరాత‌కుడు వారిని స‌మీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న క‌థ‌లేమిటి? అవి వింటుంటే నాకీ కిరాత‌క జీవితం ప‌ట్ల చిరాకు క‌లిగింది. ద‌య‌చేసి ఆ ర‌హ‌స్య‌మేమిటో చెప్పండి అని విన్న‌వించుకున్నాడు. అత‌నిలో వివేకం విచ్చుకుంటున్న వైనాన్ని గ‌మ‌నించిన విశ్వామిత్రుడు నాయ‌నా, మేము కార్తీక వ్ర‌తాన్ని ఆచ‌రిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవ‌రైనా తెలిసి గాని, తెలియ‌క గాని స్నాన‌దాన జ‌ప‌త‌పాదులు చేసి పురాణ శ్ర‌వ‌ణం చేసిన‌ట్ట‌యితే వారు స‌ర్వ‌పాపాల నుంచి విముక్తుల‌వుతార‌ని చెప్పాడు. ఈ వ్ర‌తాన్ని భ‌క్తితో ఆచ‌రించే వారు జీవ‌న్ముక్తుల‌వుతార‌ని కూడా తెలిపాడు. అలా కిరాత‌కునికి చెబుతున్న కార్తీక మ‌హాత్మ్యం పూర్తిగా విన్న ఎలుక రూపంలోని ఆ బ్రాహ్మ‌ణ‌కుమారుడు శాప‌విమోచ‌న పొంది సొంత రూపం సంపాదించుకున్నాడు. విశ్వామిత్రాదుల‌కు ప్ర‌ణామాలు చేసి త‌న గాథ‌ను వినిపించి వారి నుంచి సెల‌వు తీసుకుని ఆశ్ర‌మానికి త‌ర‌లిపోయాడు. అనంత‌రం ఆ కిరాత‌కుడు కూడా విశ్వామిత్రాదుల నుంచి కార్తీక మాహాత్మ్యం సంపూర్ణంగా తెలుసుకుని దేహాంత‌రాన ఉత్త‌మ గ‌తులు పొందాడు. కాబ‌ట్టి ఓ జ‌న‌క‌మ‌హారాజా ఉత్త‌మ గ‌తులు కోరే వారు ప్ర‌య‌త్న‌పూర్వ‌కంగా కార్తీక వ్ర‌తం ఆచ‌రించాలి లేదా క‌నీసం కార్తీక మ‌హాత్మ్యం భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో వినాలి.
పంచ‌మోధ్యాయ స‌మాప్తః
---------------

ష‌ష్ఠాధ్యాయ‌ము
వ‌శిష్ఠ మ‌హ‌ర్షి ఇంకా ఇలా చెబుతున్నాడు. రాజ‌ర్షీ జ‌న‌కా, ఈ కార్తీకం 30 రోజులూ కూడా ఎవ‌రు శ్రీ మ‌హావిష్ణువును క‌స్తూరీ గంధాదుల‌తోనూ, పంచామృతాల‌తోనూ అభిషేకిస్తారో వారికి ప‌ది వేల అశ్వ‌మేథాలు చేసిన ఫ‌లితం ల‌భిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు స‌న్నిధిలో దీపారాధ‌నం చేసినా, దీప‌దానం చేసినా విష్ణులోకాన్ని పొందుతారు. ప‌త్తిని శుభ్ర‌ప‌రిచి దానితో వ‌త్తి చేసి, బియ్య‌ప్పిండి లేదా గోధుమ‌పిండితో ప్ర‌మిద‌లో ఆవు నేతిని పోసి వ‌త్తిని త‌డిపి వెలిగించాలి. చివ‌రి రోజున ఒక‌ స‌ద్ర్బాహ్మ‌ణునికి ఆహ్వానించి వెండి ప్ర‌మిద‌ను, భ‌మిడి వ‌త్తినీ చేయించి వాటిని బియ్య‌పు పిండి మ‌ధ్య‌న ఉంచి పూజా నివేద‌నాదులు ఆచ‌రించి భోజ‌నం పెట్టిన అనంత‌రం
శ్లో - స‌ర్వ‌జ్ఞాన‌ప్ర‌దం దీపం స‌ర్వ‌సంప‌చ్ఛుభావ‌హం
దీప‌దానం ప్ర‌దాస్యామి శాంతిర‌స్తు స‌దా మ‌మ
(జ్ఞాన‌మునూ, సంప‌ద‌ల‌నూ, శుభ‌ముల‌ను క‌లిగించేదైన దీప‌దానం చేస్తున్నాను. దీని వ‌ల‌న నాకు నిరంత‌ర సంప‌ద‌లు క‌లుగుగాక) అని చెప్పుకుంటూ పిండితో స‌హా ఆ దీపాన్ని బ్రాహ్మ‌ణునికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్ష‌య‌పుణ్యం పొందుతారు. దీప‌దానం వ‌ల‌న విద్య‌, జ్ఞానం, ఆయువు వృద్ధి చెందిన స‌ర్వ‌భోగాలు క‌లుగుతాయి. మ‌నోవాక్కాయ కృత పాపాల‌న్నీ స‌మ‌సిపోతాయి. ఉదాహ‌ర‌ణ‌కి ఒక క‌థ చెబుతాను విను.
లుబ్ధ వితంతువు మోక్ష‌మందుట‌
పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువుండేది. ఆమె రోజూ భిక్షాట‌నం చేసి వ‌చ్చిన దానిలో మంచి అన్నం కూర‌లు వండి విక్ర‌యించి మిగిలిన అన్నంతో తృప్తి ప‌డుతూ డ‌బ్బు వెన‌కేయ‌సాగింది. ఇత‌రుల ఇళ్ల‌లో వంట‌ప‌నులు, కుట్టుప‌నులు చేస్తూ ప్ర‌తిఫ‌లంగా వారి నుంచి ద్ర‌వ్యం తీసుకునేది. భిక్షాట‌న కూడా చేసేది. ఇలా నిత్య ధ‌నార్జ‌న‌లోనే మునిగిపోయిన ఆ వితంతువు డ‌బ్బు సంపాద‌న మిన‌హా ఏ రోజూ హ‌రినామ స్మ‌ర‌ణం చేయ‌లేదు. హ‌రిక‌థ లేదా పురాణ ప్ర‌వ‌చ‌నాలు విన‌లేదు. పుణ్య‌తీర్థాల‌కు తిర‌గ‌లేదు. ఏకాద‌శీ ఉప‌వాసం చేసి ఎరుగ‌దు. ఇలాంటి లుబ్ధురాలింటికి దైవ‌వ‌శాన శ్రీ‌రంగ యాత్రీకుడైన ఒక బ్రాహ్మ‌ణుడు వ‌చ్చాడు. ఆమెను మంచి దారిలో పెట్టాల‌ని భావించి ఓ అమాయ‌కురారా, నేను చెప్పేది శ్ర‌ద్ధ‌గా విను. ఆలోచించుకో. ఈ తోలు శ‌రీరం వ‌ట్టి అశాశ్వ‌తం అని తెలుసుకో. నేల‌, నీరు, నిప్పు, నింగి, గాలఇ అనే పంచ‌భూతాత్మ‌క‌మైన‌దే ఈ శ‌రీరం. ఈ దేహం న‌శించ‌గానే ఆ పంచ‌భూతాలు కూడా ఇంటి పై క‌ప్పు మీద కురిసిన వాన‌నీటి వ‌లె చెదిరిపోతాయి. నీటి మీద నురుగు లాంటి త‌నువు నిత్యం కాదు. ఇది శాశ్వ‌తం అనుకున్న‌ట్ట‌యితే ఆశ‌ల అగ్నిలో ప‌డే మిడ‌త వ‌లె మ‌సి కాక త‌ప్ప‌దు. మోహాన్ని, భ్ర‌మ‌ల‌ను వ‌దిలిపెట్టు. దైవం ఒక్క‌డే శాశ్వ‌తుడ‌ని, స‌ర్వ‌భూత‌ద‌యామ‌యుడ‌ని గుర్తించి నిరంత‌రం హ‌రిచ‌ర‌ణాల‌నే స్మ‌రించు. కామం, క్రోథం, భ‌యం, లోభం, మోహం, మ‌మ‌తాహంకారాలు అనే ఆరు శ‌త్రువుల‌ను వ‌దిలిపెట్టు. నా మాట విని ఇక నుంచైనా కార్తీక వ్ర‌త స్నానం ఆచ‌రించు. విష్ణుప్రీతికై భ‌గ‌వ‌ద‌ర్ప‌ణంగా దీప‌దానం చేయి. త‌ద్వారా అనేక పాపాల నుంచి విముక్తి పొందుతావు అని హిత‌వు చెప్పి త‌న దారిన తాను వెళ్లిపోయాడు.


అత‌ని హితోక్తుల‌తో ఆమెకి జ్ఞానోద‌యం అయింది. తాను చేసిన పాపాల‌కు చింతిస్తూ కార్తీక వ్ర‌తం చేయాల‌ని సంక‌ల్పించుకుంది. ఆ సంవ‌త్స‌రంలో వ‌చ్చిన కార్తీక మాసంలో వ్ర‌తాచ‌ర‌ణ ప్రారంభించింది. సూర్యోద‌యం వేళ‌క‌ల్లా చ‌న్నీటి స్నానం, హ‌రిపూజ‌, దీప‌దానం చేసి పురాణ‌శ్ర‌వ‌ణం చేసేది. ఇలా కార్తీక మాసం నెల‌రోజులూ ఆచ‌రించి చివ‌రి రోజున చ‌క్క‌గా బ్రాహ్మ‌ణ స‌మారాధ‌న కూడా చేసింది. త‌క్ష‌ణ‌మే ఆమె బంధాలు న‌శించిపోయి విగ‌త‌జీవురాల‌యింది. విమాన‌రూఢ‌యై పుణ్య‌లోకాల‌కు చేరి శాశ్వ‌త భోగ‌సౌఖ్యాలు పొందింది. కాబ‌ట్టి రాజా కార్తీక మాసంలో అన్నింటి క‌న్నా ప్ర‌ధాన‌మైన‌ది దీప‌దానం. అది చేసిన వారు పాప‌విముక్తుల‌వుతున్నారు. దీన్ని విన్నా, చ‌దివినా కూడా బంధ విముక్తులై విష్ణుభ‌క్తి ప‌రాయ‌ణుల‌వుతారు.
కార్తీక మాహాత్మ్యం చ‌తుర్ధాధ్యాయం స‌మాప్తం
మూడ‌వ రోజు పారాయ‌ణం ముగిసింది.

Tuesday, October 29, 2019

కార్తీక పురాణం- 2వ రోజు పారాయ‌ణం (శుక్ల విదియ రోజున‌)

తృతీయాధ్యాయం
బ్ర‌హ్మ‌ర్షి వ‌శిష్ఠ మ‌హ‌ర్షి రాజ‌ర్షి జ‌న‌కునికి ఇంకా ఇలా చెప్ప‌సాగాడు
రాజా! స్నాన‌దాన‌జ‌ప‌త‌పాల‌లో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్ది పాటిగా ఆచ‌రించినా అది అక్ష‌య ఫ‌లాన్నిస్తుంది. ఎవ‌రైతే సుఖ‌లాల‌సులై శ‌రీర క‌ష్టానికి జ‌డిసి కార్తీక వ్ర‌తాన్ని ఆచ‌రించ‌రో అలాంటి వారు నూరు జ‌న్మ‌లు కుక్క‌లుగా పుడ‌తారు.
శ్లో - పౌర్ణ‌మ్యాం కార్తీక మాసే స్నానాదీంస్తు నాచ‌ర‌న్
కోటి జ‌న్మ‌సు చండాల యోనౌ సంజాయ‌తే నృప‌
శ్లో - క్ర‌మాద్యోనౌ స‌ముత్ప‌న్నో భ‌వ‌తి బ్ర‌హ్మ‌రాక్ష‌సః
అత్రైవోదాహ‌రంతీ మ‌మితిహాసం పురాత‌నమ్‌
కార్తీక పౌర్ణ‌మి నాడు స్నాన‌దాన‌జ‌పోపాస‌నాల‌లో ఏ ఒక్క‌టీ కూడా ఆచ‌రించ‌ని వారు కోటి ప‌ర్యాయాలు చండాల‌పు యోనుల‌లో జ‌న్మించి తుద‌కు బ్ర‌హ్మ‌రాక్ష‌సులుగా మార‌తారు. ఉదాహ‌ర‌ణ‌గా ఒక గాథ చెబుతా విను.
త‌త్త్వ‌నిష్ఠోపాఖ్యాన‌ము
పూర్వ‌కాలంలో ఆంధ్ర‌దేశంలోఒ త‌త్త్వ నిష్ఠుడ‌నే బ్రాహ్మ‌ణుడుండేవాడు. స‌క‌ల శాస్త్ర పారంగ‌తుడు, అస‌త్యం ప‌లికే వాడు కాడు. అన్ని భూత‌ముల యందూ ద‌యాళువూ, తీర్థాట‌న ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థ‌యాత్రా సంద‌ర్భంగా ప్ర‌యాణిస్తూ మార్గ‌మ‌ధ్యంలో గోదావ‌రీ తీరాన గ‌ల ఒకానొక ఎత్తైన మ‌ర్రి చెట్టు మీద ముగ్గురు బ్ర‌హ్మ‌రాక్ష‌సుల‌ను చూశాడు. వారు న‌లుపు కాయ‌చ్చాయతో, ఎండిన డొక్క‌లు, ఎర్ర‌ని నేత్రాలు, గ‌డ్డాల‌తో, గుచ్చిన‌ ఇనుప తీగ‌ల‌ వ‌లె పైకి నిగిడి ఉన్న త‌ల వెంట్రుక‌ల‌తో, వికృత వ‌ద‌నార‌విందాల‌తో క‌త్తులు, క‌పాలాలు ధ‌రించి, స‌ర్వ‌జీవ భ‌యంక‌రులుగా ఉన్నారు. వారిని గురించిన భ‌యంతో ఆ మ‌ర్రిచెట్టు నాలుగు వైపులా ప‌న్నెండు మైళ్ల దూరంలో ఎక్క‌డా ప్రాణి సంచార‌మ‌నేదే లేదు. అటువంటి భ‌యంక‌ర స్వ‌రూపులైన ఆ రాక్ష‌సుల‌ను అల్లంత దూరం నుంచే చూసిన త‌త్త్వ‌నిష్ఠుడు అదిరి ప‌డ్డాడు. దానితో పాటే ఆ రాక్ష‌సులు కూడా త‌న‌ను చూడ‌డంతో మ‌రింత భ‌య‌ప‌డి శోకాకుల చిత్తంతో శ్రీ‌హ‌రిని స్మ‌రింప‌సాగాడు.
త‌త్త్వ‌నిష్ఠుడి శ‌ర‌ణాగ‌తి
శ్లో - త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయ‌ణావ్య‌య‌
స‌మ‌స్త భ‌య విధ్వంస‌న్ త్రాహిమాం శ‌ర‌ణాగ‌తం
వ్యాసం ప‌శ్యామి దేవేశ త్వ‌త్తోహం జ‌గ‌దీశ్వ‌ర‌
దేవ‌త‌ల‌కూ, లోకాల‌కూ య‌జ‌మాని అయిన వాడా, నారాయ‌ణా, అవ్య‌యా న‌న్ను కాపాడు. అన్ని ర‌కాల భ‌యాల‌ను అంతం చేసే వాడా, నిన్నే శ‌ర‌ణు కోరుతున్న న‌న్ను ర‌క్షించు అని ఎలుగెత్తి స్మ‌రిస్తూ రాక్ష‌సుల భ‌యంతో అక్క‌డ నుంచి పారిపోసాగాడు. అత‌న్ని ప‌ట్టి వ‌ధించాల‌నే త‌లంపుతో ఆ రాక్ష‌స త్ర‌యం అత‌ని వెనుక‌నే ప‌రుగెత్త సాగారు. ర‌క్క‌సులు చేరువ‌వుతున్న కొద్ది ఆ విప్రుని తేజ‌స్సు కంట ప‌డ‌డం, నిరంత‌ర హ‌రినామ స్మ‌ర‌ణ విన‌బ‌డ‌డం వ‌ల‌న వారికి జ్ఞానోద‌య‌మ‌యింది. అదే త‌డ‌వుగా ఆ బాప‌నికి ఎదురుగా చేరుకుని దండ‌ప్ర‌మాణాలాచ‌రించి అత‌నికి త‌మ వ‌ల‌న కీడు జ‌ర‌గ‌బోద‌ని న‌మ్మ‌బ‌లుకుతూ "ఓ విప్రోత్త‌మా, నీ ద‌ర్శ‌నంతో మా పాపాలు న‌శించిపోయాయి" అని ప‌దేప‌దే న‌మ‌స్క‌రించారు.
వారి న‌మ్ర‌త‌కు కుదుట‌ప‌డిన హృద‌యంతో త‌త్త్వ‌నిష్ఠుడు "మీరెవ‌రు, చేయ‌రాని ప‌నులు ఏవి చేయ‌డం వ‌ల‌న ఇలా అయిపోయారు, మీ మాట‌లు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మ‌రి ఈ వికృత రూపాలేమిటి?  నాకు వివ‌రంగా చెప్పండి. మీ బాధ‌లు తొల‌గే దారి చెబుతాను" అన్నాడు.
ద్రావిడుని క‌థ‌
ఆ ర‌క్క‌సుల‌లో ఒక‌డు త‌న క‌థ‌నిలా వినిపించ‌సాగాడు. "విప్రోత్త‌మా, నేను ద్రావిడుడ‌ను. ద్ర‌విడ దేశ‌మంద‌లి మంధ‌ర‌మ‌నే గ్రామాధికారిగా ప‌ని చేసే వాడ‌ను. కులానికి బ్రాహ్మ‌ణుడ‌నే అయినా గుణానికి కుటిలుడ‌ను, వంచ‌న‌న‌తో ఇత‌రుల‌ను బుట్ట‌లో వేయ‌గ‌ల చ‌మ‌త్కారిని. నా కుటుంబ శ్రేయ‌స్సు కోసం అనేక మంది విప్రుల విత్తాన్ని హ‌రించాను. బంధువుల‌కు గాని, బ్రాహ్మ‌ణుల‌కు గాని ఏ నాడూ ప‌ట్టెడ‌న్నం పెట్టిన పాపాన పోలేదు. న‌య‌వంచ‌న‌ల‌తో బ్రాహ్మ‌ణ ధ‌నాన్ని అప‌హ‌రించ‌డం వ‌ల‌న నాతో స‌హా నా కుటుంబం ఏడు త‌రాల వారు అథోగ‌తిపాలైపోయారు. మ‌ర‌ణానంత‌రం దుస్స‌హ‌మైన న‌ర‌క‌యాత‌న‌లు అనుభవించి బ్ర‌హ్మ‌రాక్ష‌సుడ‌న‌య్యాను. కృపాయ‌త్త చిత్తుడ‌వై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పండి" అని వేడుకున్నాడు.
ఆంధ్ర‌దేశీయుని క‌థ
రెండ‌వ రాక్ష‌సుడు త‌న క‌థ‌ను ఇలా వివ‌రించాడు. "ఓ ప‌విత్రుడా, నేను ఆంధ్రుడ‌ను. నా త‌ల్లిదండ్రుల‌తో క‌ల‌హిస్తూ వారిని త‌ర‌చు దూషిస్తూ ఉండేవాడిని. నా భార్యాపిల్ల‌ల‌తో మృష్టాన్నం తింటూ త‌ల్లిదండ్రుల‌కు మాత్రం చ‌ద్దికూడు ప‌డేసే వాడిని. బాంధ‌వ బ్రాహ్మ‌ణ‌కోటికేనాడూ ఒక పూటైనా భోజ‌నం పెట్ట‌లేదు. విప‌రీతంగా ధ‌నార్జ‌న చేసి ఆ కావ‌రంతో బ‌తికే వాడిని. కాలం చేశాక న‌ర‌కాన ప‌డి ఘోరాతి ఘోర‌మైన బాధ‌ల‌నుభ‌వించి చివ‌రికి ఇక్క‌డ ఇలా బ్ర‌హ్మ‌రాక్ష‌సుడుగా మారాను. ద్రావిడుని వ‌లెనే నాకు కూడా ముక్తి మార్గానికి దారి చూపించండి మ‌హానుభావా" అని కోరాడు. 
పూజారి క‌థ‌
అనంత‌రం మూడ‌వ రాక్ష‌సుడు ముందుకు వ‌చ్చి త‌న మొర ఇలా వినిపించాడు. "ఓ స‌దాచార సంప‌న్నుడా, నేను ఆంధ్ర‌దేశ‌పు బ్రాహ్మ‌ణుడ‌ను. విష్ట్ణ్వాల‌యంలో పూజారిగా ఉండే వాడిని. కాముకుడినై అహంభావం ప్ర‌ద‌ర్శిస్తూ క‌ఠిన వ‌చ‌నాలు ప‌లుకుతూ ఉండే వాడ‌ను. భ‌క్తులు స్వామివారికి స‌మ‌ర్పించే కైంక‌ర్యాల‌న్నింటినీ వేశ్య‌ల‌కు అంద‌చేసి విష్ణు సేవ‌ల‌ను స‌క్ర‌మంగా చేయ‌క గ‌ర్వంతో తిరిగే వాడిని. తుద‌కు గుడి దీపాల‌లో నూనె కూడా హ‌రించి వేశ్య‌ల‌కు ధార పోసి వారితో సంభోగ సుఖాల‌నుభ‌విస్తూ పాప‌పుణ్య‌విచ‌క్ష‌ణా ర‌హితుడ‌నై ప్ర‌వ‌ర్తించే వాడిని. నా దోషాల‌కు ప్ర‌తిఫ‌లంగా మ‌ర‌ణానంత‌రం న‌ర‌కం చ‌వి చూసి అనంత‌రం ఈ భూమిపై నానా విధ హీన యోనుల‌లో నీచ జ‌న్మ‌లెత్తి చివ‌రికి ఘోర‌మైన ఈ బ్ర‌హ్మ‌రాక్ష‌స రూపం పొందాను. ఓ స‌దాచార సంప‌న్నుడా న‌న్ను మ‌న్నించి మ‌ర‌లా జ‌న్మ లేని విధంగా మోక్ష మార్గాన్ని ప్ర‌సాదించు" అని విల‌పించాడు.
బ్ర‌హ్మ‌రాక్ష‌సులు ఉత్త‌మ గ‌తి పొంద‌డం
త‌మ త‌మ పూర్వ‌జ‌న్మ‌ల సంచిత పాపాల‌కు ఎంత‌గానో ప‌శ్చాత్తాప‌ప‌డుతున్న ఆ ర‌క్క‌సుల‌ను గ‌ని వారికి అభ‌యం ఇచ్చి భ‌య‌ప‌డ‌కండి, నాతో క‌లిసి కార్తీక స్నానానికి రండి. మీ స‌మ‌స్త దోషాలు న‌శించిపోతాయి అని వారిని త‌న వెంట తీసుకువెళ్లి కావేరి న‌ది చేరుకున్నారు. అక్క‌డ త‌త్త్వ నిష్ఠుడు బ్ర‌హ్మ‌రాక్ష‌సుల నిమిత్తం సంక‌ల్పం చేసి తాను స్వ‌యంగా ముందు స్నానం చేసి ఆ త‌ర్వాత బ్ర‌హ్మ‌రాక్ష‌సుల చేత కూడా స్నానం ఆచ‌రింప‌చేశాడు. అనంత‌రం
శ్లో- ఆముకానాం బ్ర‌హ్మ‌రాక్ష‌స‌త్వ నివార‌ణార్ధం
అస్యాం కావేర్యాం ప్రాతః స్నాన‌మ‌హం క‌రిష్యే
అనే సంక‌ల్పంతో విధివిధానంగా స్నానం చేసి ఆ ఫ‌లాన్ని బ్ర‌హ్మ‌రాక్ష‌సుల‌కు ధార‌పోయ‌గా వారి పాపాలు హ‌రించుకుపోయి దివ్య‌వేషాల‌తో వైకుంఠానికి ప్ర‌యాణ‌మ‌య్యారు.
విదేహ రాజా! కార్తీకమాసంలో సూర్యోద‌య కాలాన కావేరి న‌దిలో స్నాన‌మాచ‌రించి విష్ణువును పూజించిన వారికి అజ్ఞానం వ‌ల‌న గాని, మోహ ప్ర‌లోభాల వ‌లన గాని..ఏ కార‌ణం చేత‌నైనా గాని చేసిన పాపాలు తొల‌గిపోయి ప‌ది వేల య‌జ్ఞాలు చేసిన ఫ‌లం క‌లుగుతుంది. అందుకే ఏదో ఒక ఉపాయం చేసైనా స‌రే కార్తీక మాసంలో కావేరి స్నానం త‌ప్ప‌కుండా చేయాలి. కావేరిలో సాధ్యం కాక‌పోతే గోదావ‌రి లేదా మ‌రెక్క‌డైనా స‌రే ప్రాతః కాల స్నానం చేసి తీరాలి. అలా ఎవ‌రైతే కార్తీక దామోద‌ర ప్రీతిగా పాతః స్నానం చేయ‌రో వాళ్లు ప‌ది జ‌న్మ‌లు చండాల‌పు యోనుల‌లో పుట్టి అనంత‌రం ఊర‌పందులుగా జ‌న్మిస్తారు. కాబ‌ట్టి ఎలాంటి మీమాంస‌తో నిమిత్తం లేకుండా స్ర్తీలు గాని, పురుషులుగాని కార్తీక మాసంలో ప్రాతః కాల స్నానం త‌ప్ప‌నిస‌రిగా చేయాలి. 
తృతీయోధ్యాయ స‌మాప్తః
-----------------------
చ‌తుర్ధాధ్యాయం
జ‌న‌కుడు మ‌ర‌ల ఇలా అడిగాడు. ఓ మ‌హ‌ర్షీ మీరింత‌వ‌ర‌కు కార్తీక మాహాత్మ్యాన్ని అసాధార‌ణ ధోర‌ణిలో చెప్పారు. ఏ వ్ర‌తం ఆచ‌రించాలో, ఏయే దానాలు చేయాలో కూడా తెలియ‌చేయండి.
అది విని అన్ని పాపాల‌నూ హ‌రించేది, పుణ్యాల‌ను అగ‌ణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్ర‌తానికి ఫ‌లానా సంక‌ల్పం అనేది హాస్యాస్ప‌దంగా ఉంటుంది.
ఈ కార్తీక వ్ర‌తం ఆచ‌రించ‌డం వ‌ల‌న న‌శించ‌నంత‌టి పాపం అనేది ఈ ప్ర‌పంచ‌లోనే లేదు.
వ్ర‌త‌ధ‌ర్మాల‌నూ, వాటి ఫ‌లాల‌ను చెబుతాను, విను అంటూ వ‌శిష్ఠ మ‌హ‌ర్షి ఇలా చెప్ప‌సాగాడు.
కార్తీక మాసంలో సాయంకాల స‌మ‌యాన శివాల‌యంలో దీపారాధ‌న చేయ‌డం వ‌ల‌న అనంత‌మైన ఫ‌లం ల‌భిస్తుంది. శివాల‌యం గోపుర ద్వారాలు, శిఖ‌రాల వ‌ద్ద గాని, శివ‌లింగ స‌న్నిధిలో గాని దీపారాధ‌న చేయ‌డం వ‌ల‌న అన్ని పాపాలు హ‌రించిపోతాయి. ఎవ‌రైతే కార్తీకంలో శివాల‌యంలో ఆవునేతితో గాని, నువ్వుల‌నూనెతో గాని, ఇప్ప‌, నారింజ నూనెల‌తో గాని దీప స‌మ‌ర్ప‌ణ చేస్తారో వారు ధ‌ర్మ‌వేత్త‌ల‌వుతారు. ఆఖ‌రికి ఆముద‌పు దీపాన్న‌యినా స‌మ‌ర్పించిన వారు అత్యంత పుణ్య‌వంతుల‌వుతారు. బ‌డాయి కోసం న‌లుగురి న‌డుమ దీపాన్నిచ్చే వారు కూడా శివ‌ప్రియుల‌వుతారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఒక క‌థ చెబుతాను విను. 
కార్తీక దీపారాధ‌నా మ‌హిమ‌
పూర్వం పాంచాల రాజ్యాన్ని పాలించే మ‌హారాజు కుబేరుని మించిన సంప‌ద‌తో తుల‌తూగుతూ ఉన్నా పుత్ర సంతానం లేక కుంగిపోయి కురంగ‌పాణికై త‌ప‌స్సు ప్రారంభించాడు. ఆ వైపుగా వ‌చ్చిన పిప్ప‌లుడ‌నే మునివ‌ర్యుడు అత‌ని త‌ప‌స్సుకు కార‌ణం అడిగి తెలుసుకుని "ఓ రాజా, ఈ మాత్రం కోరిక‌కు త‌ప‌స్సుతో ప‌ని లేదు. కార్తీక మాసంలో శివ‌ప్రీతిగా వ్ర‌త‌మాచ‌రించి బ్రాహ్మ‌ణుల‌కు దీప‌దాన ద‌క్షిణ‌ల‌తో సంతోష‌పెట్టు. అలా చేస్తే నీకు త‌ప్ప‌క పుత్ర సంతానం క‌లుగుతుంది" అని సెల‌విచ్చాడు. ఋషి వాక్యం శిరోధార్యంగా స్వీక‌రించిన రాజు త‌న ప‌ట్ట‌ణానికి చేరుకుని కార్తీక వ్ర‌త‌మాచ‌రించి శివ‌ప్రీతికై బ్రాహ్మ‌ణుల‌కు దీప‌దానాలు చేశాడు. మ‌హారాణి నెల‌త‌ప్పి యుక్త కాలంలో మ‌గ శిశువును ప్ర‌స‌వించింది. రాజ దంప‌తులు శిశువుకు శ‌త్రుజిత్తు అని పేరు పెట్టారు.
శ‌తృజిత్తు చ‌రిత్ర‌ము
శ‌త్రుజిత్తు దిన‌దిన ప్ర‌వ‌ర్ధ‌మానుడై పెరిగి యువ‌కుడు, వీరుడు అయ్యాడు. కాని వేశ్యాంగ‌నాలోలుడై అప్ప‌టికీ తృప్తి చెంద‌క యుక్తాయుక్త విచ‌క్ష‌ణా ర‌హితుడై, శాస్త్రధిక్కారం చేస్తూ వ‌ర్ణ‌సంక‌రం చేశాడు. హిత‌వు చెప్పే వారిని చంపుతాయ‌ని బెదిరిస్తూ స్వేచ్ఛా విహారిగా ప్ర‌వ‌ర్తించ‌సాగాడు. అలాంటి సంద‌ర్భంలో సౌంద‌ర్య‌రాశి, సింహ‌మ‌ధ్య‌మ‌, చిలుక‌ప‌లుకులు ప‌లికేది అయిన ఒక బ్రాహ్మ‌ణ ప‌త్ని కంట‌బ‌డింది. శ‌త్రుజిత్తు ఆమె ప‌ట్ల మోహితుడ‌య్యాడు. అనుప‌మాన సౌంద‌ర్య‌, శౌర్య‌,తేజో విరాజితోడైన ఈ యువ‌రాజు ప‌ట్ల ఆ బ్రాహ్మ‌ణ వ‌నిత కూడా మోజు ప‌డింది. రోజూ భ‌ర్త నిద్ర పోగానే సంకేత స్థ‌లంలో రాజ‌కుమారుని క‌లిల‌సి సుర‌త క్రీడ‌ల్లో సుఖించేది. రంకూ, బొంకూ ఎన్నాళ్లో దాగ‌వు. ఆమె సంగ‌తి భ‌ర్త‌కు తెలిసింది. అత‌నొక క‌త్తి ధ‌రించి ఆ రంకుజంట కుత్తులుత్త‌రించాల‌ని తిరుగుతున్నాడు. మ‌హాకాముకురాల‌యిన చారిణి గాని, శ‌త్రుజిత్తు గాని ఆ విష‌యం గ్ర‌హించ‌లేక‌పోయారు. ఒకానొక కార్తీక పూర్ణిమ, సోమ‌వారం రాత్రి ఆ కాముకులు సుర‌త క్రీడ‌ల‌కై ఒక శివాల‌యం సంకేత స్థానంగా ఎంచుకున్నారు. అప‌ర రాత్రి వేళ అక్క‌డ క‌లుసుకున్నారు. గ‌ర్భ‌గుడిలో అంతా చీక‌టిగా ఉంది. ఆ బ్రాహ్మ‌ణ వ‌నిత చీర చింపి వ‌త్తిని చేసింది. రాజ‌కుమారుడు వెతికి ఆముదం తెచ్చాడు. ఇద్ద‌రూ క‌లిసి అక్క‌డ ఖాళీ ప్ర‌మిద‌లో దీపం పెట్టారు. ఆ దీప‌కాంతుల్లో ఒక‌రినొక‌రు చూసుకుంటూ సంభోగంలో మునిగిపోయారు. 
 ఆ విష‌యం ఎలాగో ఆమె భ‌ర్త గ్ర‌హించాడు. ఇద్ద‌రూ సంభోగంలో మునిగిపోయి లోకం మ‌రిచిపోయి ఉన్న స‌మ‌యంలో మొద‌ట శ‌త్రుజిత్తుని, ఆ త‌ర్వాత త‌న భార్య‌ని న‌రికి తాను కూడా పొడుచుకుని ఆత్మహ‌త్య చేసుకున్నాడు. ముగ్గురూ విగ‌త‌జీవులై ప‌డి ఉండ‌గా పాశ‌హ‌స్తులైన య‌మ‌దూత‌లు, ప‌విత్రాత్ములైన శివ‌దూత‌లు ఒకేసారి అక్క‌డ‌కు వ‌చ్చారు. శివ‌దూత‌లు రాకుమారుని, రంకులాడిని త‌మ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. య‌మ దూత‌లు అమాయ‌క‌పు బ్రాహ్మ‌ణుని త‌మ‌తో న‌ర‌కం వైపు లాక్కుపోయారు. అది చూసి ఆశ్చ‌ర్య‌పోయిన ఆ బ్రాహ్మ‌ణుడు "ఓ శివ‌దూత‌రాలా, కాని ప‌ని చేసిన వారికి కైలాస భోగం, నా వంటి స‌దాచారునికి న‌ర‌క‌యోగ‌మా" అని ప్ర‌శ్నించాడు. అందుకు ఆ శివ‌దూత‌లు స‌మాధానం చెబుతూ "వారెంత పాపాత్ములైనా కార్తీక పౌర్ణ‌మి రోజు, సోమ‌వారం నాడు శివాల‌యంలోను...అందునా శిథిలాల‌యంలోను శివ‌లింగం ఎదురుగా దీపారాధ‌న చేశారు. గ‌నుక వారి పాపాలు న‌శించి పుణ్యాత్ముల‌య్యారు. ఏ కార‌ణం చేత‌నైనా శివ‌లింగానికి ఎదురుగా దీపారాధ‌న చేసిన వారిని అత్యంత పుణ్యాత్ముడ‌వైన నీవు వ‌ధించిన కార‌ణంగా పుణ్య‌హీనుడు, పాపాత్ముడు అయ్యావు, అందుకే నీకు న‌ర‌కం, వీరికి కైలాసం" అన్నారు. 
బ్రాహ్మ‌ణునికి, శివ‌దూత‌ల‌కు మ‌ధ్య జ‌రిగిన ఈ సంభాష‌ణ విన్న శ‌త్రుజిత్తు క‌లుగ‌చేసుకుని అయ్య‌లారా, దోషులం మేము కాగా మాకు కైవ‌ల్యం ఇచ్చి పుణ్యాత్ముల‌ను చేసిన ఆ అమాయ‌కుడిని న‌ర‌కానికి పంప‌డం భావ్యం కాదు. కార్తీక‌మాసం దొడ్డ‌దైతే, అందునా పౌర్ణ‌మి గొప్ప‌దైతే, సోమ‌వారం ఘ‌న‌మైన‌దేతై, దీపారాధ‌న పుణ్య‌క‌ర‌మ‌యితే మాతా పాటే మ‌ర‌ణించిన ఆ బ్రాహ్మ‌ణునికి కూడా కైలాస‌మీయ‌క త‌ప్ప‌ద‌ని వాదించాడు. శ‌త్రుజిత్తు తాను, త‌న ప్రియురాలు సంపాదించి తెచ్చిన‌ వ‌త్తీ, తైలం పుణ్యం తాముంచుకుని ఆ దీపం వెలిగించిన పుణ్యం బ్రాహ్మ‌ణునికి ధార‌పోశాడు. శివ‌దూత‌లు ఆ విప్రుని య‌మ‌దూత‌ల నుంచి కాపాడి కైలాసానికి తీసుకువెళ్లారు.
కాబ‌ట్టి ఓ మిథిలేశ్వ‌రా, కార్తీక మాసంలో త‌ప్ప‌నిస‌రిగా శివాల‌యంలో గాని, విష్ణు ఆల‌యంలో గాని దీపారాధ‌న చేసి తీరాలి. నెల‌పొడుగునా చేసిన వారు జ్ఞానులై మోక్షాన్ని పొంద‌గ‌లుగుతారు. శివాల‌యంలో దీపారాధ‌న నిరంత‌ర మోక్ష ప్ర‌దాయినిగా ఉంటుంది. నా మాట విని కార్తీక‌మాసం నెల పొడ‌వునా శివాల‌యంలో దీపారాధ‌న చేయి అని వ‌శిష్ఠుడు చెప్పాడు.
చ‌తుర్ధాధ్యాయ స‌మాప్తః
రెండో రోజు పారాయ‌ణం ముగిసింది. 

Monday, October 28, 2019

రోజూ కార్తీక పురాణం

మ‌ళ్ళీ కార్తీక మాసం వ‌చ్చేసింది. కార్తీక పురాణం నిత్య‌పారాయ‌ణ‌కి ఇంత‌కి మించిన స‌మ‌యం లేదు...ప్ర‌తీ ఏడాది కార్తీక మాసంలో మ‌న సుంద‌ర‌కాండ భ‌క్తగ‌ణం కోసం రోజువారీ పారాయ‌ణ‌కు అనుగుణంగా ఏ రోజు పారాయ‌ణ అధ్యాయాల‌ను ఆ రోజు ప్ర‌చురిస్తూ వ‌స్తున్నాం. ఈ సారి కూడా అలాగే  రోజువారీ పారాయ‌ణ అధ్యాయాల‌ను ప్ర‌తీ రోజూ ప్ర‌చురించ‌డం జ‌రుగుతోంది. ప్ర‌తీ ఒక్క‌రూ చ‌దివి త‌రించండి...

కార్తీక పురాణం 1 వ రోజు పారాయణం (శుక్ల పాడ్య‌మి రోజున‌)


శ్రీ విఘ్నేశ్వ‌ర ప్రార్థ‌న
శ్లో - వాగీశాద్యా స్సుమ‌సస్స‌ర్వార్ధానాముప‌క్ర‌మే
యం న‌త్వా కృత‌కృత్య‌స్స్యుస్తం న‌మామి గ‌జాన‌న‌మ్ 
-----------------------
శౌన‌కాదుల‌కు సూతుడు కార్తీక‌ పురాణం ప్ర‌వ‌చ‌నం

శ్రీ‌మ‌ద‌నంత‌కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడైన భ‌గ‌వంతుని సృష్టిలోని అత్యంత విశిష్ట‌మైన నైమిశార‌ణ్యానికి విచ్చేసిన సూత మ‌హ‌ర్షిని స్థానికంగా నివాసులైన శౌన‌కాది ఋషులు స‌త్క‌రించి, సంతుష్టుని చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న చుట్టూ కూచుని ఓ సూత‌మునీ, క‌లిక‌ల్మ‌షాన్ని పోగొట్టేది, కైవ‌ల్య‌దాయ‌కం అయిన‌దైన కార్తీక మాహాత్మ్యాన్ని వినిపించి మ‌మ్మ‌ల్ని ధ‌న్యుల‌ను చేయండి అని కోరారు. వారి కోరిక‌ను మ‌న్నించిన వ్యాస శిష్యుడైన సూత‌మ‌హ‌ర్సి ఓ శౌన‌కాదులారా, మా గురువుగారైన భ‌గ‌వాన్ వేద‌వ్యాస మ‌హ‌ర్షుల వారు ఈ కార్తీక మాహాత్మ్యాన్ని అష్టాద‌శ పురాణాల్లోని స్కాంధ‌, ప‌ద్మ‌పురాణాలు రెండింటిలోనూ కూడా వివ‌రించారు. ఋషిరాజు శ్రీ వ‌శిష్ఠుల వారిచే రాజ‌ర్షి జ‌న‌కున‌కు స్కాంధ పురాణంలోను, హేలా విలాస బాలామ‌ణి అయిన స‌త్య‌భామ‌కు లీలామానుష విగ్ర‌హుడైన శ్రీ‌కృష్ణ ప‌ర‌మాత్మ ప‌ద్మ‌పురాణంలోను ఈ కార్తీక మాహాత్మ్యం స‌వివ‌రంగా బోధించారు. మ‌న అదృష్టం వ‌ల‌న నేటి నుంచి శుభ కార్తీక మాసం ప్రారంభం కావ‌డం వ‌ల‌న ప్ర‌తీ రోజూ నిత్య‌పారాయ‌ణ‌గా ఈ మాసం అంతా కార్తీక పురాణ శ్ర‌వ‌ణం చేసుకుందాం. ముందుగా స్కాంధ పురాణంలోని వ‌శిష్ఠ‌ప్రోక్త‌మైన కార్తీక మాహాత్మ్యాన్ని వినిపిస్తాను అంటూ చెప్ప‌సాగాడు
జ‌న‌కుడు వ‌శిష్ఠుని కార్తీక వ్ర‌త ధ‌ర్మాలు అడిగిన వృత్తాంతం
పూర్వం ఒక సారి సిద్ధాశ్ర‌మంలో జ‌రుగుతున్న యాగానికి అవ‌స‌ర‌మైన ద్ర‌వ్యం కోసం వ‌శిష్ఠ మ‌హ‌ర్షి జ‌న‌క మ‌హారాజు ఇంటికి వెళ్లాడు. జ‌న‌కుడు ఆయ‌న‌కు యుక్త మ‌ర్యాద‌లు చేసి లోనికి ఆహ్వానించాడు. ఆ సంద‌ర్భంగా తాను వ‌చ్చిన కార‌ణాన్ని వ‌శిష్ఠ మ‌హ‌ర్షి తెలియ‌చేయ‌గా హే బ్ర‌హ్మ‌ర్షీ మీ యాగానికి ఎంత ద్ర‌వ్యం కావాల‌న్నా నిర‌భ్యంత‌రంగా ఇస్తాను. కాని స‌ర్వ‌పాప‌హ‌ర‌మైన ధ‌ర్మ‌సూక్ష్మాన్ని మీరు నాకు తెలియ‌చేయండి. సంవ‌త్స‌రంలో అన్ని మాసాల క‌న్నా కార్తీక మాసం అత్యంత మ‌హిమాన్విత‌మైన‌ద‌ని, ఆ వ్ర‌తాచ‌ర‌ణం స‌మ‌స్త ధ‌ర్మాల క‌న్నా శ్రేష్ఠ‌మైన‌ద‌ని చెబుతూ ఉంటారు క‌దా! ఆ నెల‌కు అంత‌టి ప్రాముఖ్య‌త ఎలా క‌లిగింది? ఆ వ్ర‌తం ఉత్కృష్ట‌మైన‌ది ఎలా అయింది అని అడిగాడు. మునిజ‌న వ‌రిష్ఠుడైన వ‌శిష్ఠ మ‌హ‌ర్షి జ్ఞాన హాసం చేస్తూ ఇలా ప్ర‌వ‌చించాడు. 

వ‌శిష్ఠ ప్ర‌వ‌చ‌నం
జ‌న‌క మ‌హారాజా, పూర్వ జ‌న్మ‌ల్లో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని స‌త్వ‌శుద్ధి క‌ల‌గ‌దు. ఆ స‌త్వ‌శుద్ధి క‌లిగిన నీ వంటి వారికి మాత్ర‌మే ఇటువంటి పుణ్య‌ప్ర‌ద‌మైన‌ది, విన్నంత మాత్రం చేత‌నే అన్ని పాపాలు హ‌రించేది అయిన కార్తీక మాహాత్మ్యం వినాల‌నే కోరిక క‌లుగుతుంది. విశ్వ‌శ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నీవ‌డిగిన సంగ‌తుల‌న్నీ వివ‌రిస్తాను. జాగ‌రూకులై వినండి.
ఓ విదేహా, కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్ర‌మ‌ణంలో ఉండ‌గా స‌హృద‌యంతో ఆచ‌రించే స్నాన‌, దాన‌, జ‌ప, పూజాదులు విశేష ఫ‌లితాల‌నిస్తాయి. ఈ కార్తీక వ్ర‌తాన్ని తులాసంక్ర‌మ‌ణం నుంచి గాని, శుద్ధ పాడ్య‌మి నుంచి గాని ప్రారంభించాలి.
ముందుగా
శ్లో - స‌ర్వ‌పాప‌హ‌రం పుణ్యం వ్ర‌తం కార్తీక సంభ‌వం
నిర్విఘ్నం కురుమే దేవ దామోద‌ర న‌మోస్తుతే
ఓ దామోద‌రా, నా ఈ కార్తీక వ్ర‌తాన్ని నిర్విఘ్నంఘా పూర్తి చేయించు అని న‌మ‌స్కార‌పూర్వ‌కంగా సంక‌ల్పించుకుని కార్తీక స్నానం ఆరంభించాలి. కార్తీకంలో సూర్యోద‌య వేళ కావేరీ న‌దిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్ప‌న‌ల‌వి కాదు. సూర్యుడు తులారాశిలో ప్ర‌వేశించ‌గానే గంగాన‌ది ద్ర‌వ‌రూపం ధ‌రించి స‌మ‌స్త న‌దీ జ‌లాల్లోనూ చేరుతుంది. వాపీ కూప త‌టాకాది స‌మ‌స్త జ‌లాశ‌యాల్లోనూ కూడా విష్ణుమూర్తి వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మ‌ణుడైన వాడు కార్తీక మాసంలో న‌దికి వెళ్లి, హ‌రిధ్యానం చేసి, కాళ్లూ, చేతులూ క‌డుక్కుని, ఆచ‌మ‌నం చేసి శుద్ధాత్ముడై మంత్ర‌యుక్తంగా భైర‌వాజ్ఞ‌ను తీసుకుని మొల‌లోతు నీటిలో నిల‌బ‌డి స్నానం చేయాలి. ఆ త‌ర్వాత‌ దేవ‌త‌లు, ఋషులు, పిత‌రుల‌కు త‌ర్ప‌ణాలు వ‌ద‌లాలి. అనంత‌రం ఆఘ‌మ‌ర్ష‌ణ మంత్ర‌జ‌పంతో బొట‌న వేలి కొన‌తో నీటిని చుట్టు తిప్పుతూ మూడు దోసిళ్ల నీళ్లు తీసుకుని గ‌ట్టు మీద‌కు చిమ్మి తీరం చేరాలి. చేర‌గానే క‌ట్టుబ‌ట్ట కొన‌ల‌ను పిండాలి. దీన్నే య‌క్ష‌త‌ర్ప‌ణం అంటారు. అనంత‌రం ఒళ్లు తుడుచుకుని పొడి ఆరిన తెల్ల‌ని మ‌డి వ‌స్ర్తాల‌ను ధ‌రించి హ‌రినామ‌స్మ‌ర‌ణ చేయాలి. గోపీ చంద‌నంలో 12 ఊర్థ్వ‌పుండ్రాలు ధ‌రించి సంధ్యావంద‌న గాయ‌త్రీ జ‌పాల‌ను ఆచ‌రించాలి. ఆ త‌ర్వాత ఔపాస‌నం చేసి బ్ర‌హ్మ‌య‌జ్ఞ‌మాచ‌రించి తోట‌లో నుంచి చ‌క్క‌ని పుష్పాల‌ను తెచ్చి శంఖ‌చ‌క్ర‌ధారి అయిన విష్ణువును సాల‌గ్రామంలో స‌భ‌క్తిగా షోడ‌శోప‌చారాల‌తో పూజించాలి. అ త‌ర్వాత కార్తీక పురాణ ప‌ఠ‌నం లేదా శ్ర‌వ‌ణం చేసి ఇంటికి చేరాలి. ఇంటి వ‌ద్ద దేవ‌తార్చ‌న పూర్తి చేసుకుని భోజ‌నం కావించి ఆచ‌మించి తిరిగి పురాణ కాల‌క్షేపానికి స‌న్న‌ద్ధం కావాలి.
సాయంకాలం కాగానే ఇత‌ర వ్యాపారాల‌న్నింటినీ విర‌మించుకుని శివాల‌యంలో గాని, విష్ణ్వాల‌యంలో గాని య‌థాశ‌క్తి దీపాలు పెట్టి అక్క‌డి స్వామిని ఆరాధించి భ‌క్ష్య‌భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కుతో హ‌రిని స్తుతించి న‌మ‌స్క‌రించుకోవాలి. ఈ కార్తీక మాసం పొడుగునా ఈ విధంగా వ్ర‌తాన్ని ఆచ‌రించిన వారు పున‌రావృత్తి ర‌హిత‌మైన వైకుంఠాన్ని పొందుతారు. ప్ర‌స్తుత‌, పూర్వ జ‌న్మార్జితాలైన పాపాల‌న్నీ ఈ కార్తీక వ్ర‌తం ఆచ‌రించ‌డం వ‌ల‌న హ‌రించుకుపోతాయి.
వ‌ర్ణాశ్ర‌మ‌, వ‌యోలింగ భేద‌ర‌హితంగా ఈ వ్ర‌తాన్ని ఎవ‌రు ఆచ‌రించినా వారు మోక్షార్హులు అవుతార‌నేది నిస్సంశ‌యం. జ‌న‌క‌రాజా, త‌న‌కు తానుగా ఈ వ్ర‌తాన్ని ఆచ‌రించ‌లేక‌పోయినా ఇత‌రులు చేస్తుండ‌గా చూసి అసూయార‌హితుడై ఆనందించే వారికి ఆ రోజు చేసిన పాపాల‌న్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి.
ప్ర‌థ‌మోధ్యాయ స‌మాప్తః
---------------- 
ద్వితీయోధ్యాయం

కార్తీక సోమ‌వార వ్ర‌తం
హే జ‌న‌క మ‌హారాజా, విన్నంత మాత్రం చేత‌నే మ‌నోవాక్కాయ క‌ర్మ‌ల ద్వారా చేసిన స‌ర్వ‌పాపాల‌నూ హ‌రింప‌చేసే కార్తీక మాహాత్మ్యాన్ని శ్ర‌ద్ధ‌గా విను. అందునా ఈ నెల‌లో శివ‌ప్రీతిగా సోమ‌వార వ్ర‌తం ఆచ‌రించే వాడు త‌ప్ప‌నిస‌రిగా కైలాసం చేరుకుంటాడు. కార్తీక మాసంలో వ‌చ్చే ఏ సోమ‌వారం నాడైనా స్నాన జ‌పాదులు ఆచ‌రించే వాడు వెయ్యి అశ్వ‌మేథాల ఫ‌లాన్ని పొందుతాడు. ఈ సోమ‌వార వ్ర‌త విధి ఆరు ర‌కాలుగా ఉంది.
ఉప‌వాసం, ఏక‌భుక్తం, న‌క్తం, అయాచితం, స్నానం, తిల‌దానం
ఉప‌వాసం : శ‌క్తి గ‌ల వారు కార్తీక సోమ‌వారం నాడు ప‌గ‌లంతా ఉప‌వాసం  ఉండి సాయంకాలం శివాభిషేకం చేసి న‌క్ష‌త్ర ద‌ర్శ‌నానంత‌రం తుల‌సీ తీర్థం మాత్ర‌మే సేవించాలి.
ఏక‌భుక్తం :  సాధ్యం కాని వారు ఉద‌యం స్నాన‌దాన‌జ‌పాదులు య‌థావిధిగా నిర్వ‌ర్తించి మ‌ధ్యాహ్న భోజ‌నం చేసి, రాత్రి భోజ‌నానికి బ‌దులు శైవ తీర్థ‌మో, తుల‌సి తీర్థ‌మో మాత్ర‌మే తీసుకోవాలి.
న‌క్తం : ప‌గ‌లంతా ఉప‌వాసం చేసి రాత్రి న‌క్ష‌త్ర ద‌ర్శ‌నం త‌ర్వాత భోజ‌నం గాని, ఉపాహారం గానీ స్వీక‌రించాలి.
అయాచితం :  భోజ‌నానికి త‌మంత తాముగా ప్ర‌య‌త్నించ‌కుండా ఎవ‌రైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్ర‌మే భోజ‌నం చేయ‌డం అయాచితం.
స్నానం :  పైవి ఏవీ చేయ‌డానికి శ‌క్తి లేని వారు స‌మంత్ర‌కంగా స్నాన‌జ‌పాదులు చేసినా చాలును.
తిల‌దానం :  మంత్ర‌జ‌ప విధులు కూడా తెలియ‌ని వారు కార్తీక సోమ‌వారం నాడు నువ్వులు దానం చేసినా స‌రిపోతుంది.
పై ఆరు ప‌ద్ధ‌తుల్లో దేన్ని ఆచ‌రించినా కార్తీక సోమ‌వార వ్ర‌తం చేసిన‌ట్టే అవుతుంది. కాని తెలిసుండి కూడా ఏ ఒక్క‌దానిని ఆచ‌రించ‌ని వారు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక‌, రౌర‌వాది న‌ర‌కాల పాల‌వుతార‌ని ఆర్షులు చెప్పారు. ఈ వ్ర‌తాచ‌ర‌ణం వ‌ల‌న అనాథ‌లు, స్ర్తీలు కూడా విష్ణు సాయుజ్యం పొందుతారు. కార్తీక మాసంలో వ‌చ్చే ప్ర‌తీ సోమ‌వారం నాడు ప‌గ‌లు ఉప‌వ‌సించి రాత్రి న‌క్ష‌త్ర ద‌ర్శ‌నానంత‌రం మాత్ర‌మే భోజ‌నం చేస్తూ ఆ రోజంతా భ‌గ‌వ‌ధ్యానంలో గ‌డిపేవ ఆరు త‌ప్ప‌కుండా శివ‌సాయుజ్యాన్ని పొందుతారు. సోమ‌వార వ్ర‌తాన్ని చేసే వారు న‌మ‌క‌, చ‌మ‌క స‌హితంగా శివాభిషేకం చేయ‌డం ప్ర‌ధానం. ఈ సోమ‌వార వ్ర‌త మాహాత్మ్యాన్ని వివ‌రించే ఒక ఇతిహాసం చెబుతా వినండి. 

నిష్ఠురి క‌థ‌
పూర్వ‌కాలంలో ఒక బ్రాహ్మ‌ణునికి నిష్ఠురి అనే ఒక కూతురుండేది. పుష్టిగానూ, అందంగానూ, అత్యంత విలాస‌వంతంగాను ఉండే ఆమెకు గుణాలు మాత్రం శిష్ట‌మైన‌వి అబ్బ‌లేదు. దుష్ట‌గుణ భూయిష్ట అయి, గ‌య్యాళిగాను, కాముకురాలుగాను చ‌రించేది. ఈమెను ఆ గుణాల రీత్యా క‌ర్క‌శ అని కూడా పిలుస్తూ ఉండే వారు. బాధ్య‌త ప్ర‌కారం తండి ఆ క‌ర్క‌శ‌ను సౌరాష్ట్ర బ్రాహ్మ‌ణుడైన మిత్ర‌శ‌ర్మ అనే వానికిచ్చి వివాహం చేసి త‌న చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్ర శ‌ర్మ చ‌దువుకున్న వాడు. స‌ద్గుణ‌వంతుడు. స‌చాచార ప‌రాయ‌ణుడూ, స‌ర‌సుడూ మాత్ర‌మే కాక స‌హృద‌యుడు కూడా కావ‌డం వ‌ల‌న క‌ర్క‌శ ఆడిన‌ది ఆట‌గా, పాడిన‌ది పాట‌గా కొన‌సాగుతూ ఉండేది.
ఆమె ప్ర‌తీరోజూ భ‌ర్త‌ను, అత్త‌మామ‌ల‌ను తిడుతూ, కొడుతూ ఉండేది. అయినా త‌న మ‌న‌సుకు న‌చ్చిన‌ది కావ‌డం వ‌ల‌న మోజు చంపుకోలేక‌, భార్య‌ను ప‌రిత్య‌జించ‌డం వంశానికే ప‌రువు త‌క్కువ‌నే ఆలోచ‌న కార‌ణంగాను క‌ర్క‌శ పెట్టే క‌ఠిన హింస‌ల‌న్నింటినీ మిత్ర‌శ‌ర్మ భ‌రిస్తూ ఉండే వాడు త‌ప్ప ఏ నాడూ భార్య‌ను శిక్షించ‌లేదు. ఆమె ఎంద‌రో ప‌ర‌పురుషుల‌తో సంబంధం పెట్టుకుని భ‌ర్త‌ను, అత్త‌మామ‌ల‌ను మ‌రింత నిర్ల‌క్ష్యంగా చూసేది. ఒకానొక నాడు ఆమె విటుల‌లో ఒక‌డు నీ మొగుడు బ‌తికి ఉండ‌డం వ‌ల్ల‌నే మ‌నం త‌ర‌చు క‌లుసుకోలేక‌పోతున్నాం అని రెచ్చ‌గొట్ట‌డంతో క‌ర్క‌
శ ఆ రాత్రికి రాత్రే నిద్ర‌లో ఉన్న భ‌ర్త‌ను పెద్ద బండ‌రాతితో మోది చంపేసింది. తానే మోసుకుపోయి ఒక నూతిలోకి విసిరేసింది. ఇదంగా గ‌మ‌నించినా కూడా ఆమెకు విటుల‌బ‌లం ఎక్కువ కావ‌డం చేత అత్త‌మామ‌లు ఆమెనేమీ అన‌లేక తాము ఇల్లు వ‌దిలి పారిపోయారు. అంత‌టితో మ‌రింత స్వ‌తంత్రించిన క‌ర్క‌శ క‌న్నుమిన్ను గాన‌క కామావేశంతో అనేక మంది పురుషుల‌తో సంప‌ర్కం పెట్టుకుంది. ఎంద‌రో సంసార స్ర్తీల‌ను కూడా త‌న మాట‌ల‌తో భ్ర‌మింప‌చేసి త‌న విటుల‌కు తార్చి త‌ద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గ‌డిచింది. బ‌లం త‌గ్గి య‌వ్వ‌నం అంత‌రించిపోయింది. శ‌రీరంలోని ర‌క్తం ప‌ల‌చ‌బ‌డ‌డంతో క‌ర్క‌శ జ‌బ్బు ప‌డింది. అసంఖ్యాక పురుషుల‌తో ర‌మించిన ఆమెకు ప‌లు భ‌యంక‌ర‌మైన వ్యాధులు సోకాయి. పూల‌గుత్తి వంటి మేను పుళ్లు ప‌డిపోయింది. జిగిబిగి త‌గ్గిన క‌ర్క‌శ వ‌ద్ద‌కు విటుల రాక‌పోక‌లు త‌గ్గిపోయాయి. సంపాద‌న ప‌డిపోయింది. అంద‌రూ ఆమెను అస‌హ్యించుకోసాగారు. తుద‌కు అక్ర‌మ ప‌తుల‌కే గాని సుతుల‌ను నోచుకోని ఆ నిష్ఠుర తిన‌డానికి తిండి, ఉండేందుకు ఇల్లు, వంటి నిండా క‌ప్పుకునేందుకు వ‌స్త్రం కూడా క‌రువై సుఖ‌వ్ర‌ణాల‌తో న‌డివీధిన మ‌ర‌ణించింది. క‌ర్క‌శ శ‌వాన్ని కాటికి మోసుకుపోయే వారు కూడా లేక‌పోయారు. య‌మ‌దూత‌లు ఆ జీవిని పాశ‌బ‌ద్ధను చేసి తీసుకుని వెళ్లారు.
భ‌ర్తృద్రోహికి భ‌యంక‌ర న‌ర‌కం
భ‌ర్త‌ను విస్మ‌రించి ప‌ర‌పురుషుల‌ను ఆలింగ‌నం చేసుకున్న పాపానికి య‌ముడు ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగ‌లింప‌చేశాడు. భ‌ర్త త‌ల బ‌ద్ద‌లుకొట్టినందుకు ముళ్ల గ‌ద‌ల‌తో త‌ల చితికేట్టు మోదించాడు. భ‌ర్త‌ను దూషించినందుకు, కొట్టినందుకు, త‌న్నినందుకు దాని పాదాలు ప‌ట్టుకుని క‌ఠిన శిల‌ల‌పై వేసి బాదించాడు. సీసం కాచి చెవుల్లో పోయించాడు. కుంభీపాక న‌ర‌కానికి పంపాడు. ఆమె పాపాల‌కుగాను ముంద‌రి ప‌ది త‌రాల వారు, వెనుక ప‌ది త‌రాల వారు ఆమెతో క‌లిపి 21 త‌రాల వారు కుంభీపాకంలో కుమిలిపోసాగారు. న‌ర‌కానుభ‌వం అనంత‌రం ఆమె 15 జ‌న్మ‌ల పాటు భూమిపై కుక్క‌గా జ‌న్మించింది. 15వ ప‌ర్యాయ‌మున క‌ళింగ‌దేశంలో కుక్క‌గా పుట్టి ఒక బ్రాహ్మ‌ణ గృహంలో ఉండేది.

సోమ‌వార వ్ర‌తం చేత కుక్క‌కు కైలాస ప్రాప్తి
ఒక కార్తీక సోమ‌వారంనాడు ఆ బ్రాహ్మ‌ణుడు ప‌గ‌లు ఉప‌వాసం ఉండి శివాభిషేకాలు నిర్వ‌ర్తించి న‌క్ష‌త్ర ద‌ర్శ‌నానంత‌రం న‌క్త స్వీకారానికి సిద్ధ‌ప‌డి ఇంటి బ‌య‌ట బ‌లిని విడిచిపెట్టాడు. ఆ నాడంతా ఆహారం దొర‌క్క ప‌స్తు ఉన్న కుక్క ప్ర‌దోష స‌మ‌యంలో ఆ బ‌లి అన్నాన్ని భుజించింది. బ‌లి భోజనం వ‌ల‌న దానికి పూర్వ జ‌న్మ స్మృతి క‌లిగింది. ఓ విప్రుడా, ర‌క్షించు అని కుయ్యింటూ మొర‌పెట్టింది. దాని అరుపులు విని వ‌చ్చిన విప్రుడు కుక్క మాట‌లాడ‌డాన్ని గ‌మ‌నించి విస్తు పోతూ "ఏమి త‌ప్పు చేశావు, నేనెలా ర‌క్షించ‌గ‌ల‌ను" అని అడిగాడు.
అందుకా శున‌కం "ఓ బ్రాహ్మ‌ణుడా, పూర్వ జ‌న్మ‌లో నేనొక విప్ర‌వ‌నిత‌ను. కామంతో క‌ళ్లు మూసుకుపోయి జార‌త్వానికి ఒడిగ‌ట్టి భ‌ర్తృహ‌త్య‌కు, వ‌ర్ణ సంక‌రానికి కార‌కురాలిన‌య్యాను. ఆయా పాపాల‌కు అనుగుణంగా అనేక కాలం న‌ర‌కంలో చిత్ర‌హింస‌ల‌నుభ‌వించి ఈ భూమిపై ఇప్ప‌టికి 14 సార్లు కుక్క‌గా జ‌న్మించాను. ఇది శున‌కంగా 15వ జ‌న్మ‌. అలాంటిది ఇప్పుడు నాకు హ‌ఠాత్తుగా పూర్వ‌జ‌న్మ‌లెందుకు గుర్తు వ‌చ్చాయో అర్ధం కావ‌డంలేదు. ద‌య‌చేసి చెప్పండి" అని కోరింది.
బ్రాహ్మ‌ణుడు స‌ర్వాన్ని జ్ఞాన‌దృష్టితో తెలుసుకుని "ఓ శున‌క‌మా, ఈ కార్తీక సోమ‌వారం నాడు ప్ర‌దోష వేళ వ‌ర‌కు ప‌స్తు ఉండి నేను వ‌దిలిన బ‌లిభ‌క్ష‌ణం చేయ‌డం వ‌ల‌న నీకు ఈ పూర్వ‌జ‌న్మ జ్ఞానం క‌లిగింది" అని చెప్పాడు. ఆ పై ఆ జాగిలం క‌రుణామ‌యుడైన ఓ బ్రాహ్మ‌ణుడా నాకు మోక్షం ఎలా సంప్రాప్తిస్తుందో చెప్ప‌మ‌ని కోరిన మీద‌ట ద‌యాళుడైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమ‌వార వ్ర‌తాల్లో ఒక సోమ‌వార వ్ర‌త ఫ‌లాన్ని ఆ కుక్క‌కు ధార‌పోశాడు. ఆ క్ష‌ణంలోనే ఆ శున‌కం దేహాన్ని ప‌రిత్య‌జించి ప్ర‌కాశ‌మాన‌మైన హార‌వ‌స్త్ర విభూషిత అయి పితృదేవ‌తా స‌మ‌న్వితంగా కైలాసానికి చేరింది. కాబ‌ట్టి ఓ జ‌న‌క మ‌హారాజా, నిస్సంశ‌యంగా శ్రేయ‌దాక‌మైన ఈ కార్తీక సోమ‌వార వ్ర‌తం నీవు త‌ప్ప‌నిస‌రిగా ఆచ‌రించు అని వ‌శిష్ఠుడు చెప్ప‌డం ఆపాడు.
ద్వితీయోధ్యాయ స‌మాప్తః
స్కాంధ పురాణాంత‌ర్గ‌త‌ 1వ రోజు పారాయ‌ణం స‌మాప్తం 

Friday, October 25, 2019

కార్తీక పౌర్ణ‌మి స‌హిత 44వ సుంద‌ర‌కాండ ఆహ్వానం

గురూజీ శ్రీ‌మాన్ శృంగారం సింగ‌రాచార్యుల వారి నిర్వ‌హ‌ణ‌లోని తృతీయాష్టోత్త‌ర శ‌త సుంద‌ర‌కాండ ప‌రంప‌ర‌లోని 44వ సుంద‌రకాండ న‌వంబ‌ర్ 10 నుంచి పుట్టి వేంక‌ట శివ‌రావు, ఉమారాణి దంప‌తుల నివాసంలో జ‌రుగ‌నుంది. ఇది హోమ‌రూపంలో జ‌ర‌గ‌డం విశేషం. కార్తీక పౌర్ణ‌మితో క‌లిసి రావ‌డం మ‌రో ప్ర‌త్యేకం. 12వ తేదీన కార్తీక పౌర్ణ‌మి రోజున సాయంత్రం కార్తీక దీప ప్ర‌జ్వ‌ల‌న కూడా జ‌రుగుతుంది. అంద‌రూ అధిక సంఖ్య‌లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంద‌గ‌ల‌ర‌ని సూచ‌న‌.

Tuesday, October 15, 2019

43వ సుంద‌ర‌కాండ దృశ్యాలు

గురూజీ శ్రీ‌మాన్ శృంగారం సింగ‌రాచార్యుల వారి నిర్వ‌హ‌ణ‌లో శ్రీ శివ‌లెంక శ్రీ‌నివాస ప‌ద్మాక‌ర్‌, విద్యారాణి దంప‌తుల నివాసంలో తృతీయాష్టోత్త‌ర శ‌త సుంద‌ర‌కాండ ప‌రంప‌ర‌లోని 43వ సుంద‌ర‌కాండ‌ము ఎంతో వైభ‌వంగా గ‌త ఆదివారం (20వ తేదీ) నాడు ముగిసింది. ఆ కార్య‌క్ర‌మం దృశ్యాలు, వీడియోలు చూసి త‌రించండి.