Monday, January 27, 2020

47వ సుంద‌ర‌కాండ ఆహ్వానం


బెడిద శ్రీ‌నివాస‌రావు, అరుణ దంప‌తుల నివాసంలో 47వ సుంద‌ర‌కాండ హోమ‌రూపంగా ఫిబ్ర‌వ‌రి 3 నుంచి 9 తేదీల మ‌ధ్య కాలంలో జ‌రుగుతుంది. 3వ తేదీ సోమ‌వారంనాడు హ‌నుమ‌త్ ప్ర‌తిష్ఠ‌, కంక‌ణ‌ధార‌ణ చేస్తారు. మంగ‌ళ‌వారం నుంచి శ‌నివారం మ‌ధ్య వ‌ర‌కు ప్ర‌తీ రోజూ ఉద‌యం వేళ 6.30 కి హోమం ప్రారంభిస్తారు. గురూజీ సుంద‌ర‌కాండ శ్లోకాలు పారాయ‌ణ చేస్తుండ‌గా శ్రీ‌నివాస‌రావు దంప‌తులు స్వాహాకారం చేస్తూ హోమంలో నెయ్యి, హోమ‌ద్ర‌వ్యం వేస్తారు. రోజువారీ పారాయ‌ణ ముగిసిన అనంత‌రం తీర్థ‌ప్ర‌సాదాలు వినియోగిస్తారు. 9వ తేదీ ఆదివారంనాడు య‌థావిధిగా ఉద‌యం 7 గంట‌ల నుంచి విష్ణుస‌హ‌స్ర‌నామ పారాయ‌ణ‌, శ్రీ‌రామ‌, శ్రీ హ‌నుమ‌త్ స్తుతి, ఆంజ‌నేయ స‌హ‌స్ర‌నామార్చ‌న చేసి తీర్థ‌ప్ర‌సాద వినియోగం చేస్తారు. అంద‌రూ పాల్గొని త‌రించాల‌ని నిర్వాహ‌కులు ఆహ్వానిస్తున్నారు. వారి ఆహ్వాన‌ప‌త్రిక చూడండి. 




46వ సుంద‌ర‌కాండ దృశ్య‌మాలిక‌


46వ సుంద‌ర‌కాండ వీడియో

Thursday, January 16, 2020

తృతీయాష్టోత్త‌ర శ‌త ప‌రంప‌ర‌లోని 46వ సుంద‌ర‌కాండ‌

త‌ల్లావ‌ఝ‌ల మూర్తి శ‌ర్మ‌, సుబ్బ‌ల‌క్ష్మి దంప‌తుల నివాసంలో శ‌నివారం ఉద‌యం తృతీయాష్టోత్త‌ర శ‌త ప‌రంప‌రలోని 47వ సుంద‌ర‌కాండ క‌ల‌శ‌స్థాప‌న జ‌రిగింది. ఆదివారం నుంచి శ‌నివారం వ‌ర‌కు ప్ర‌తీ రోజూ సాయంత్రం వారి ఇంటిలో గురూజీ ఆంజ‌నేయ అష్టోత్త‌ర శ‌త‌నామార్చ‌న చేయించిన అనంత‌రం సుంద‌ర‌కాండ స‌ర్గ ప‌ఠ‌నం చేసి సుంద‌ర‌కాండ ప‌ర‌మార్ధం, ఆయా స‌ర్గ‌ల వివ‌రాల‌ను ప్ర‌వ‌చ‌న రూప‌కంగా వివ‌రిస్తారు. ప్ర‌తీ ఒక్క‌రూ ఈ ప్ర‌వ‌చ‌నాల్లో పాల్గొని ఆంజ‌నేయ‌స్వామివారి తీర్థ ప్ర‌సాదాలు స్వీక‌రించి ధ‌న్యులు కావ‌డంతో పాటు వారి క‌టాక్షానికి కూడా పాత్రులు కావ‌చ్చు. ప్ర‌త్య‌క్షంగా పాల్గొన‌లేని వారు శ‌నివారం నాటి క‌ల‌శ‌స్థాప‌న‌, హ‌నుమ‌త్ ప్ర‌తిష్ఠ‌; ఆదివారం నాటి కార్య‌క్ర‌మం చిత్రాలు వీక్షించి త‌రించండి.









సోమ‌వారం నాటి దృశ్యాలు








మంగ‌ళ‌వారం నాటి దృశ్యాలు







త‌మ‌ల‌పాకు మాల‌లో స్వామివారు
గురువారం నాటి దృశ్యాలు



వ‌డ‌మాల‌లొ స్వామివారు





----------------------------------
గురూజీ నిర్వ‌హ‌ణ‌లోని తృతీయాష్టోత్త‌ర సుంద‌ర‌కాండ ప‌రంప‌ర‌లోని 46వ సుంద‌ర‌కాండ ప్ర‌వ‌చ‌న స‌హితంగా శ్రీ త‌ల్లావ‌ఝ‌ల మూర్తి శ‌ర్మ‌, సుబ్బ‌ల‌క్ష్మి దంప‌తుల నివాసంలో శ‌నివారం కంక‌ణ‌ధార‌ణ‌తో ప్రారంభం అవుతుంది. ఆదివారం నుంచి ఆపై శ‌నివారం వ‌ర‌కు ప్ర‌తీరోజూ సాయంత్రం వేళ సుంద‌ర‌కాండ స‌ర్గ పారాయ‌ణం, అనంత‌రం ప్ర‌వ‌చ‌నాలు నిరాఘాటంగా జ‌రిగి 26వ తేదీ ఉద‌యం శ్రీ విష్ణుస‌హ‌స్ర‌నామ‌, శ్రీ‌రామ‌నామ పారాయ‌ణ‌లు, హ‌నుమ‌త్ స్తుతి అనంత‌రం ఆంజ‌నేయ స‌హ‌స్ర‌నామార్చ‌న‌తో ముగుస్తాయి. ప్ర‌తీ ఒక్క‌రూ పాల్గొన‌వ‌చ్చును.





Wednesday, January 8, 2020

అరుణాచ‌ల క్షేత్రం



మనకి అష్టమూర్తి తత్త్వం అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు. అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యాన్ని గుర్తించలేనపుడు సాకారోపాసనతో శివుని దేనియందు చూడవచ్చు అన్న దానిని గురించి శంకర భగవత్పాదులు చ‌క్క‌గా చెప్పారు.

కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతగుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యాజమాన లింగం – ఈ ఎనిమిది అష్టమూర్తులు.

ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే. కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు. అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డంగా ఒక గీత పెడ‌తారు. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర. అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు. అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకోలా ఉంటుంది. కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. అరుణాచలం ప‌ర‌మ‌పావ‌న క్షేత్రం. ఆ క్షేత్ర‌ ప్ర‌వేశానికి ఈశ్వరానుగ్రహం కావాలి. అంతరాలయంలో ఉన్న శివ‌లింగానికి కొంచెం దగ్గరగా కూర్చుంటే ఎవ‌రికైనా ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను త‌ట్టుకోవ‌డం అసాధ్యం. ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూ ఉంటాడు. అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు. 

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరాలు నాలుగింటిని చెప్తారు.

"దర్శనాత్ అభ్రశదసి జననాత్ కమలాలే
స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః "

స్మరణం మనసుకు సంబంధించినది. మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశి మొత్తాన్ని ఆయ‌న‌ ధ్వంసం చేస్తాడు. కేవ‌లం స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచలం. ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెబుతుంది. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. దాని పేరే అరుణాచలం. అచలం అంటే కొండ. దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది. ఆ కొండ అంతా శివుడే. అక్కడ కొండే శివుడు. కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదాలు అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి. అరుణాచలంలో మూడు యోజనాల‌ దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమాలు లేవు.

గిరి ప్ర‌ద‌క్షిణం
గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది. అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు. చుట్టూ ఉన్న అన్ని ఆలయాలు దర్శనం చేస్తూ ప్ర‌ద‌క్షిణం పూర్తి చేయాలి.

- అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు. శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయంలో శివలింగంగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు.

- మార్గంలో మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత ఆయువు వృద్ధి అవుతుంది. ఈ యమ లింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి. అక్కడ గల యమలింగానికి అటువంటి శక్తి ఉంది.

- నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. ఆ ముని తపస్సుకి అరుణాచలేశ్వరుడు తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగ‌ స్థానం. కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.

- ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగాన్ని కుబేరలింగం అని పిలుస్తారు. అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.

- పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై క్షేత్రం క‌న‌బ‌డుతుంది. అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది. అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహంలోనే కాకుండా ప‌రంలో కూడా సుఖం, మోక్షం కూడా ఇవ్వగలదు.

ఆల‌య గోపురాలు

తూర్పు గోపురం నుంచి అరుణాచల క్షేత్రంలో ప్రవేశిస్తాం. ఈ గోపురాన్ని శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించాడు. ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఆ ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి. అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒక సంకల్పం చేసింది. అప్పటికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు. ‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను. నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని సంక‌ల్పం చేసుకుని ఇంటింటికీ తిరుగుతూ చందా ఇవ్వమని అడిగేది. ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

- అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు. ఆ తరువాత కుడివైపు వెడితే అక్కడ పాతాళ లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది.

- క్షేత్రానికి సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు. ఆలయానికి  కొంచెం దక్షిణంగా వెడితే ఆ చెట్టు కనపడుతుంది. ర‌మ‌ణులు ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. అటువంటి పరమ పావనమయిన క్షేత్రం. ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు. దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది. అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది.

- ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది. ఒకనాడు కైలాస పర్వతం మీద ప‌ర‌మ‌శివుడు కూచుని ఉండ‌గా అమ్మ‌వారు ప‌రిహాసానికి వెనుక నుంచి వ‌చ్చి ఆయ‌న కన్నులు మూసింది. ఈ కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే ఆ దోష పరిహారార్థం అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది.

- పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని ‘అపీతకుచాంబ’అని పిలుస్తారు.  సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని చెప్పి ప‌ర‌మ‌శివుడు అమ్మవారిని తన శరీర అర్థభాగంలో స్వీకరించాడు.

- అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒకటుంది. ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం రాశాడు. లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.

- అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని విశ్వాసం. స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే. అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను ర‌మించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు. అరుణం అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి.

- అపారమయిన దయ కలిగినది అమ్మ. అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ.

భగవాన్ రమణుల మూర్తి ప్రతి ఇంట ఉండాలి. అందరం తిరువణ్ణామలై వెళ్ళాలి. అందరం గిరి ప్రదక్షిణం చేయాలి. మన పిల్లలకి అటువంటి మహాపురుషుని గురించి చెప్పాలి. సూరినాగమ్మ లేఖల పుస్తకం తప్పకుండా ఇంట్లో ఉంచుకుంటే మంచిది. ఆ పుస్తకం సులభశైలిలో ఉంటుంది. రమణులు ఎప్పుడెప్పుడు ఏమి మాట్లాడారో ఆ పుస్తకంలో చదువుతుంటే మీరు రమణాశ్రమంలో ఉన్నట్లుగా ఉంటుంది. రమణుల అనుగ్రహం మనం పొందుతాం.

Sunday, January 5, 2020

ముక్కోటి ఏకాద‌శీ వ్ర‌తం ప‌ర‌మార్ధం ఏమిటి...?

మృత్యువు వ‌చ్చిన‌ప్పుడు అది ఎలా ఉంటుందో దానికి సంబంధించిన‌ త‌ర్ఫీదును మ‌న‌సుకి ఇవ్వ‌డ‌మే ఏకాద‌శి ప‌ర‌మార్ధం. ఏకాద‌శీ వ్ర‌తం చాపి త్ర‌యం అత్యంత దుర్ల‌భం అంటారు. అందుకే ఏడాదంతా చేయ‌లేక‌పోయినా ఒక్క ముక్కోటి ఏకాద‌శి మాత్రం చాలున‌ని విష్ణుమూర్తి చెబుతాడు. ఒక్క ముక్కోటి ఏకాద‌శి చేసిన‌ట్ట‌యితే 24 ఏకాద‌శుల ఫ‌లితం ఇస్తాను అని ఆయ‌న అంటాడు. కాని ఒక‌టి ఎక్కువ నేన‌డుగుతాను, సాధార‌ణంగా చేసే దానితో క‌లిపి ఆ ఒక్క‌టి కూడా చేస్తే నీకు మూడు కోట్ల ఏకాద‌శుల ఫ‌లితం ఇస్తాను. కాని సాధార‌ణంగా చేసే ఏకాద‌శి క‌న్నా విరుద్ధంగా ముక్కోటి ఏకాద‌శి చేయాలంటాడు ఆయ‌న‌. ఎందుకు అలా విరుద్ధంగా చేయాలి...?  సాధార‌ణ ఏకాద‌శి నాడు ఉప‌వాసం ఉన్న‌ప్పుడు పండు లేదా కాయ తీసుకుంటే త‌ప్పులేదు. 

ఆదివారం, పౌర్ణ‌మి, అమావాస్య రోజుల్లో ఉప‌వాసం చేసిన‌ప్పుడు రాత్రి వేళ ఏమీ తిన‌కూడ‌దు. అష్ట‌మి, చ‌తుర్ద‌శి తిథుల్లో ప‌గ‌లంతా ఉప‌వాసం ఉండి రాత్రివేళ న‌క్ష‌త్ర ద‌ర్శ‌నానంత‌రం పార‌ణం చేయ‌వ‌చ్చు. వారాలు అన్ని యుగాల్లో లేవు. క‌లియుగంలో మాత్ర‌మే వారాలున్నాయి. అందుకే క‌లియుగంలో మాత్ర‌మే వార‌నియ‌మాలున్నాయి. ఆరోగ్యం సూర్య‌భ‌గ‌వానుడి అనుగ్ర‌హంతోనే సాధ్య‌ప‌డుతుంది. ఆయ‌న తేజ‌స్సు ఎక్కువ‌గా ప‌రిపుష్టం అయ్యే రోజు భానువాస‌రం. అందుకే సూర్య భ‌గ‌వానుడి అనుగ్ర‌హం క‌ల‌గాలి అంటే ఆదివారం ఉప‌వాసం చేయాలి. 

అస‌లు ముక్కోటి ఉప‌వాసం ప‌ర‌మార్ధం ఏమిటి?
ఉప‌వాసాన్ని రెండుకోణాల్లో అర్ధం చేసుకోవాలి. దీన్ని మ‌న ఋషులు అద్భుతంగా అన్వ‌యించి చూపుతారు. క‌డుపులో ఉన్న ప‌దార్థం పూర్తిగా అయిపోయేంత వ‌ర‌కు తిరిగి అందులో ఏమీ వేయ‌కూడ‌దు అన్న‌దే ఆ నియ‌మం. అంటే క‌డుపు కండ‌రాలు క‌ద‌ల‌కుండా విశ్రాంతి ఇవ్వ‌డ‌మే ఉప‌వాసంలో ప్ర‌ధాన ప్ర‌క్రియ‌. ఉదాహ‌ర‌ణ‌కి పెద్ద పెద్ద ప్లాంట్ల‌ని కావాల‌ని అప్పుడ‌ప్పుడూ ష‌ట్ డౌన్ చేస్తారు. అలా చేయ‌డం వ‌ల్ల వాటి జీవిత కాలం పెరుగుతుంది. ఋషులు దాన్నే మ‌న శ‌రీరానికి అన్వ‌యించారు. శ‌రీరం కూడా ఒక యంత్రం లాంటిదే. ఈ శ‌రీరం ఉన్నప్పుడే మ‌నం ఏ పుణ్య‌మైనా, ధ‌ర్మ‌కార్యాలైనా చేయ‌డం సాధ్య‌మ‌వుతుంది. అస‌లు ఆ శ‌రీర‌మే లేకుండా చేసుకుంటే ఎవ‌రైనా జీవుడు ఏం చేయ‌గ‌ల‌డు...?  ధ‌ర్మ‌కార్యాలు చేయాలంటే శ‌రీరం ఆయుర్దాయం పెంచాలి. ఆయుర్దాయం రెండు ర‌కాలుగా పెంచుకోవ‌చ్చు. ఒక‌టి ఆవేశ‌ప‌డి ఊపిరి తీయ‌డం నివారించాలి.వ‌ద‌ల‌కూడ‌దు. ఎందుకంటే ఆయుర్దాయం ఊపిరిలోనే ఉంది. అలాగే ఏదో ఒక‌టి దొరికింది క‌దా అని ఏది ప‌డితే అది తినేయ‌కుండా ఉండ‌డ‌మే రెండోది.ఈ రెండూ చేసిన వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. పాప‌కార్యాలు చేయ‌డానికి దీర్ఘాయుష్మంతుడు కాకూడ‌దు. జీవుణ్ని చ‌క్క‌బెట్టుకోవ‌డానికి మాత్ర‌మే దీర్ఘాయుష్మంతుడు కావాలి. ఆ ప్ర‌క్రియ‌లో వ‌చ్చిన అద్భుత‌మైన తిథి ముక్కోటి ఏకాద‌శి.  

"ఏకాద‌శ్యాంతు క‌ర్త‌వ్యం స‌ర్వేషాం భోజ‌న ద్వ‌యం"  అని ఒక శ్లోకం ఉంది.. ఏకాద‌శి నాడు అంద‌రూ రెండు సార్లు భోజనం చేయాల‌ని ఆ శ్లోకానికి ఒక‌ అర్ధం వ‌స్తుంది. మ‌రి అలా చేస్తే ఉప‌వాసం ఏమిటి?  కాని అందులో అంత‌రార్ధం ఉంది. అంద‌రికీ ఏదో ఒక క‌న్సెష‌న్ ఇచ్చిన‌ట్టు క‌న‌ప‌డితే దాన్ని క‌ర్ఫ‌ర్మ్ చేసుకోవ‌డానికి తాప‌త్ర‌య‌ప‌డ‌తారు. అందుకే ఆ శ్లోకానికి ఈ అంత‌రార్ధం పెట్టారు.  భో...జ‌న అంటే ఓ జ‌నులారా, ఏకాద‌శి నాడు రెండు నియ‌మాలు పాటించందే. శుద్ధోప‌వాసః ప్ర‌థ‌మః. ఏకాద‌శి నాడు శుద్ధోప‌వాసం చేయాలి. ద్వైత సంప్ర‌దాయంలో ఉన్న వారు శుద్ధోప‌వాసం చేస్తారు. వారు ఏకాద‌శి నాడు చివ‌రికి స‌త్య‌నారాయ‌ణ వ్ర‌తం కూడా చేయ‌రు. వ్ర‌తం చేస్తే భ‌గ‌వంతునికి నైవేద్యం పెట్టాలి. అందుకే వారు ఏకాద‌శి నాడు ఈశ్వ‌రుని కూడా క‌డుపు మాడ్చేస్తారు. ఏకాద‌శి నాడు ఎవ‌రైనా వాళ్లింటికి వెళ్లినా ప‌చ్చి మంచినీరు ఇవ్వ‌రు. ఇంటికి వ‌చ్చిన వారికి పండు కూడా చేతిలో పెట్ట‌రు. ఏం అనుకోకండి ఏకాద‌శి రోజు వ‌చ్చారు. ఏమీ ఇవ్వ‌డంలేదంటారు. వారు ఉమ్మి కూడా గుట‌క వేయ‌రు. వాళ్ల‌కి ఈశ్వ‌రుని మీద ఉన్న న‌మ్మ‌కం అటువంటిది. చివ‌రికి రాజ‌స్తాన్ ఎడారిలో అయినా అలాగే ఉంటారు. "స‌త్క‌థా శ్ర‌వ‌ణం త‌థాః" అన్న‌ది రెండో నియ‌మం. అంటే ఏకాద‌శి ఉప‌వాసం చేస్తున్నంత వ‌ర‌కు కూడా భ‌గ‌వంతునికి సంబంధించిన‌ స‌త్క‌థ‌లు వింటూ ఉండాలి. ఏకాద‌శి తిథి ఉన్నంత స‌మ‌యం నిరంత‌రాయంగా భ‌గ‌వంతుని ధ్యానం చేస్తావంటే జాగారం స‌యితం అందులోనే ఉంది. నీరు, ఆహారం తీసుకోలేదు గ‌నుక నీకు మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న‌కి కూడా వెళ్లే అవ‌స‌రం ఉండ‌దు.

ద్వాద‌శి పార‌ణ నియ‌మం ఏమిటి...?
ఏకాద‌శి తిథి రోజున ఏమీ తిన‌కుండా ఉండ‌డం ఎంత ప్ర‌ధాన‌మో ద్వాద‌శి తిథి ప్ర‌వేశించ‌గానే పార‌ణం చేసి తీరాలి. ఏదో ఒక‌టి తినేయాలి. ద్వాద‌శి పార‌ణ మ‌ధ్యాహ్నం వేళ చేయ‌కూడ‌దు. చివ‌రికి ద్వాద‌శి తిథి తెల్ల‌వారు ఝామున వ‌స్తోందంటే తెల్ల‌వార‌కుండానే భోజ‌నం చేసేయాలి. ఉద‌యం 6.30కి ద్వాద‌శి తిథి వ‌స్తోందంటే ఆ లోగానే ఈశ్వ‌రునికి మ‌హానివేద‌న చేసి ఆ వెంట‌నే భోజ‌నం చేసితీరాలి. నాకు ఆక‌లి వేయ‌దు అనే మాట కూడా ప‌నికిరాదు. అంబ‌రీషుని కథే ఇందుకు చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌. ద్వాద‌శి ఘ‌డియ‌లు రాగానే కొంచెం నీరు తాగినందుకే ఆయ‌న దూర్వాసుడి ఆగ్ర‌హానికి గురై ఆ త‌ర్వాత ఈశ్వ‌రానుగ్ర‌హం పొంద‌గ‌లిగాడు. ఈ భోజ‌నానికి కూడా నియ‌మం ఉంది. పాటు ష‌ర్టు వేసుకుని డైనింగ్ టేబుల్ మీద తిన‌డం కూడా పార‌ణ నియ‌మం కాదు. అంటే పైన చొక్కా లేకుండా పంచె క‌ట్టుకుని కింద కూచుని భోజ‌నం చేయాలి. అలాగే ద్వాద‌శి రోజున త‌న ఇంటిలో త‌ప్ప వేరొక‌రి ఇంటిలో భోజ‌నం చేయ‌కూడ‌దు. అలా చేసిన‌ట్ట‌యితే ఏకాద‌శి ఉప‌వాస ఫ‌లితం కోల్పోతారు. నిత్యం తిరుగుతూ ఉండే ఉపాధిలో ఉన్న‌వారు, ఏదో ఒక మ‌హ‌త్త‌ర ప్ర‌యోజ‌నం కోసం వేరే ప్ర‌దేశానికి మాత్ర‌మే వెళ్లిన వారికే ఇంటిలో కాకుండా ఎక్క‌డైనా భోజ‌నం చేసే వెసులుబాటు ఉంటుంది. ఈ నియ‌మం ఎందుకంటే ఏకాద‌శి రోజున ఉప‌వాసం చేశావు గ‌నుక భ‌గ‌వంతునికి నువ్వు ఆ రోజు మ‌హానివేద‌న పెట్ట‌లేదు. మ‌రి ద్వాద‌శి రోజున ఆయ‌న‌కి మ‌హానివేద‌న చేసి తీరాలి. అందుకే ఈ నియ‌మం పెట్టారు. ఏకాద‌శి తిథి వ‌చ్చిన రోజున అస‌లు ఇల్లు వ‌దిలే వెళ్ల‌కూడ‌దు. అందుకే పెద్ద పెద్ద నైవేద్య‌పు తిథుల్లో అస‌లు ఇల్లు వ‌దిలి వెళ్ల‌నేకూడ‌దు. ఏకాద‌శి వ‌స్తోంది క‌దండీ మేం ఇల్లు వ‌దిలి ఎలా రాగ‌లం అంటారు. అంటే ఏకాద‌శి నియ‌మంలో ఇల్లు వ‌దిలి వెళ్ల‌క‌పోవ‌డం అనే నియ‌మం కూడా ఉంది. అలా ఉన్న‌ప్పుడే ఈశ్వ‌రునికి నీ ఇంట్లో నివేద‌న చేయ‌గ‌లుగుతావు. కాయ‌క‌ష్టం చేసుకునే వారికి మాత్ర‌మే ఈ నియ‌మానికి మిన‌హాయింపు ఉంది. 

నిజంగా ముక్కోటి ఏకాద‌శి చేసే వారు ఎంత‌మంది...?
ఏకాద‌శి ఉప‌వాసం చేసే వారు క‌నీసం మూడు రోజుల ముందు నుంచి పూర్తిగా సాత్వికాహారం తీసుకోవాలి. ఏకాద‌శి ఉప‌వాసం చేయాల‌నుకుని ముందు రోజున పుల్ల‌ని ప‌దార్థాలు లేదా తీయ‌ని ప‌దార్థాలు తినేయ‌కూడ‌దు. అలా చేస్తే దాహాన్ని ఆప‌డం సాధ్యం కాదు. సాత్వికాహారం తీసుకుంటే ఇంక దాహం వేయ‌డం ఉండ‌దు. అందుకే శ‌రీరాన్ని అల‌వాటు చేయ‌డం కోసం క‌నీసం మూడు రోజుల ముందు నుంచి పూర్తిగా సాత్వికాహారం తీసుకోవాలి.  శారీర‌క‌మైన, ఆంత‌రంగికమైన సాధ‌న‌లు చేయ‌డం అవ‌స‌రం. మ‌రీ వేడిగా ఉన్న ప్ర‌దేశంలో ఉండ‌కూడ‌దు. వాతావ‌ర‌ణం వేడిగా ఉంటే శ‌రీరం అల‌సిపోయి ప‌డిపోతుంది. అందుకే భ‌గ‌వంతుడు ముక్కోటి ఏకాద‌శిని నీటి అవ‌స‌రం అంత‌గా లేని పుష్య‌మాసం, హేమంత ఋతువులో పెట్టాడు. ముక్కోటి ఏకాద‌శి నాడు ఈ నియ‌మాల‌న్నీ పాటించి ఉప‌వాసం చేస్తే నీకు మూడుకోట్ల ఏకాద‌శుల ఫ‌లితం ఇస్తానంటాడు విష్ణుమూర్తి. కాని ఇది దుర్ల‌భం. ఎవ‌రికి వారు చేయ‌డం సాధ్యం కాదు. అందుకే స‌మూహంలో ఉండి చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఇంటిలో దేవ‌తార్చ‌న అనంత‌రం దేవాల‌యంలో అంద‌రూ స‌మావేశ‌మై భ‌గ‌వ‌త్క‌థ‌లు వింటూ ఉండ‌డం, భ‌గ‌వ‌త్కార్యంలో పాల్గొన‌డం చేయాలి. 24 ఏకాద‌శుల్లో ఒక ఏకాద‌శి అలా చేయ‌గ‌ల‌గాలి అంటే ఒక్క‌సారే సాధ్యం కాదు. ముందుగా ఒక ఏడాది ఆ ప్ర‌య‌త్నం చేస్తే మ‌రో ఏడాదికైనా అది సాధ్యం అవుతుంది. అక‌స్మాత్తుగా ముక్కోటి ఏకాద‌శి చేస్తామ‌ని సంక‌ల్పించుకున్నంత మాత్రాన అది సాధ్యం కాదు.5 జ్ఞానేంద్రియాలు, 5 క‌ర్మే్ంద్రియాలు, మ‌న‌సు ఈశ్వ‌రుని మీద నిల‌బెట్ట‌డానికే ఈ సాధ‌న అవ‌స‌రం.  

ఆమ‌రణ నిరాహార దీక్ష శాస్త్రవిరుద్ధం
సామూహికంగా చేసే ముందు ఒక ఏడాది నుంచి ప్ర‌ణాళిక వేసుకుని ఎంత శ్ర‌మ‌కైనా త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగిన దారుఢ్యం గ‌ల వారిని ఎంపిక చేసుకుని స‌ప్త‌మి తిథి నుంచే వారిని సంసిద్ధుల‌ని చేయాలి. అలా చేసిన త‌ర్వాత ఏకాద‌శి తిథి నాడు ఎంత సేపు ఉండ‌గ‌లిగితే అంత సేపు ఉప‌వాసం, జాగారం ఉంటారు. అయినా కూడా ఉండ‌లేని స్థితి వ‌స్తే అవ‌స‌రాన్ని బ‌ట్టి నీరు, ఆహారం తీసుకోవ‌చ్చు. అంత‌మాత్రాన ఏకాద‌శి ఉప‌వాస ఫ‌లితం పోదు. ఈశ్వ‌రుడు మీరు చేసిన దానికి నూటికి నూరు శాతం సిల‌బ‌స్ ను బ‌ట్టి మార్కులు వేయ‌డు. మీ ప్ర‌య‌త్నానికి మార్కులు వేస్తాడు. అందుకే ప్ర‌య‌త్నం ప్ర‌ధానం. శ‌రీరం ప‌డిపోయే ప‌రిస్థితి వ‌స్తుంటే మాత్రం నీరు పుచ్చుకోవ‌చ్చు లేదా ఏదైనా స్వ‌ల్పంగా ఆహారం తీసుకోవ‌చ్చు. శ‌రీరాన్ని బ‌ల‌వంతంగా  ప‌డ‌గొట్టేస్తే ఈశ్వ‌రుడు మోక్షం ఇవ్వ‌క‌పోగా పిశాచ‌త్వం ఇస్తాడు. ఆహారం, నీరు లేకుండా శ‌రీరాన్ని ప‌డ‌గొడితే పిశాచాలుగా మారిపోతారు. అందుకే ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష శాస్త్రవిరుద్ధం. 

ఈ నియ‌మాల‌న్నీ పాటిస్తూ శాస్త్రం చెప్పిన నియ‌మాల‌ను చేసిన వారికి మూడు కోట్ల ఏకాద‌శుల ఫ‌లితం వ‌స్తుంది. ముక్కోటి ఏకాద‌శి నాడు ఏ కార్యం చేసినా మూడు కోట్ల ఫ‌లితం వ‌స్తుంది. ఒక్క‌సారి శ్రీ‌రామ‌రామ రామేతి ర‌మే రామే మ‌నోర‌మే అని ఒక్క‌సారి అనుసంధానం చేస్తే మూడు కోట్ల మార్లు పారాయ‌ణ చేసిన ఫ‌లితం ల‌భిస్తుంది. అందుకే ముక్కోటి ఏకాద‌శి రోజున ఉప‌వాస‌మూ చేయాలి, వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కూడా చేయాలి. ఏదీ చేయ‌క‌పోతే మూడు కోట్ల పాపాల ఫ‌లితం పొందిన వారౌతారు. అందుకే ముక్కోటి ఏకాద‌శి రోజున రాత్రి జాగారం చేయ‌గ‌ల శ‌క్తి లేక‌పోయినా రోజంతా భ‌గ‌వ‌న్మామ సంకీర్త‌న చేయ‌గ‌లిగినా ఎంతో పుణ్యం చేసుకున్న వార‌వుతారు. ప్ర‌తీ ఒక్క‌రూ భ‌గ‌వంతుని సేవ‌లో ఉండండి, త‌రించండి.

( పూజ్య‌గురువులు శ్రీ‌మాన్ చాగంటి కోటీశ్వ‌ర‌రావుగారి ప్ర‌వ‌చ‌నం వీడియో ఆధారంగా చేసిన ప్ర‌య‌త్నం. వారు చెప్పింది అక్ష‌రం అక్ష‌రం య‌థాత‌థంగా రాసి ఉండ‌క‌పోవ‌చ్చు. కాని క‌నీసం 80 శాతం వ‌ర‌కు అయినా చేశాన‌నే న‌మ్మ‌కం ఉంది. చ‌ద‌వండి, ఆశీర్వ‌దించండి).
మీ
- దామ‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు